మహబూబ్నగర్ మెట్టుగడ్డ, అక్టోబర్ 20 : ప్రజలకు రక్షణ కల్పించడంలో ఎంతో మంది పోలీసులు తృణప్రాయంగా ప్రాణాలొదిలి సమాజ రక్షణకు పాటుపడుతున్నారు. తన కుటుంబాన్ని వదిలి సమాజమే తన కుటుంబంగా భావించి అనుక్షణం రక్షణ కల్పిస్తున్న పోలీసుల సేవలు వెలకట్టలేనివి. శత్రువుల నుంచి కాపాడి ప్రజలకు భద్రత, భరోసా ఇస్తున్నారు. శాంతి భద్రతలను ఆదుపులో పెట్టాలన్నా.. ఆసాంఘిక శక్తుల ఆట కట్టించాలన్నా మొదటి వరుసలో ఉండేవాడు పోలీసు. అంకితభావం, నిబద్దత, కర్తవ్య నిర్వహణలో జిల్లాకు చెందిన కొంతమంది పోలీసులు ఆసువులు బాశారు. వారి త్యాగఫలమే నేటి మన సుఖ జీవనం. ప్రజాస్వామ్య, సమాజ పరిరక్షణ కోసం నిరంతరం పోరాడి ప్రాణాలు కోల్పోయిన పోలీసుల త్యాగనిరతిని మనందరం స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. జిల్లాలో మావోయిస్టు తుటాలకు ఇంతవరకు 39 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయి అమరులయ్యారు. వారి వీరత్వాన్ని గుర్తుచేస్తూ ప్రతి యేటా ఆక్టోబర్ 21 పోలీస్ అమరువీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహిస్తున్నారు. రక్తదాన శిబిరం, ఓపెన్ హౌజ్, వ్యాసరచన పోటీలు నిర్వహించనున్నారు. శనివారం ఉదయం 8:45 గంటలకు నివాళ్లుర్పిస్తారు. పోలీసులతోపాటు అమరుల కుటంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. జిల్లా కేంద్రంలో నివాళులర్పించి ఆనంతరం పోలీసు లు ఎస్పీ కార్యాలయం నుంచి ర్యాలీగా వన్టౌన్ చౌరస్తా వద్ద ఉన్న ఎస్పీ పరదేశినాయుడు విగ్రహం వద్ద నివాళులర్పిస్తారు.
1959 అక్టోబర్ 21వ తేదీన జమ్ముకశ్మీర్ రాష్ట్రం లడక్ జిల్లాలోని లెహ్ ప్రాంతంలోని 16 వేల అడుగుల ఎత్తులో మైనస్ 35 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మనషులు గడ్డకట్టే ఆ చలిలో సైతం భారత జవాన్లు సరిహద్దు గస్తీలో ఉన్నారు. అంతలోనే చైనా సైనికులు అకస్మాత్తుగా దాడి చేశారు. ఈ భీకర దాడిలో భారత జవాన్లు 11 మంది దుర్మరణం చెందారు. కొంతమంది చైనా సరిహద్దులో మృతి చెందారు. మృతదేహాలను దేశానికి తీసుకురాలేని పరిస్థితి. ఈ క్రమంలో భారత ప్రభుత్వం మృతదేహాలను అక్కడే ఖననం చేయాలని నిర్ణయించింది. సైన్యానికి చెందిన ఉన్నతాధికారులు మంచుకొండల్లోనే ఖననం చేశారు. కుటుంబ సభ్యులు తమ వారిని కడసారి చూపునకు నోచుకోలేదు. అసువులు బాసిన సైనికుల ఆత్మకు శాంతికలగాలని ప్రతి ఏడాది అక్టోబర్ 21వ తేదీన అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరుపుకొంటున్నారు. లెహ్ ప్రాంతంలో అమరవీరుల సంస్మరణ స్థూపం కూడా నిర్మించారు. అక్టోబర్లో మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే ఆ ప్రాంతంలో నివాళి కూడా కష్టమే. అందువల్ల ప్రతి ఏడాది సెప్టెంబరులోనే ప్రతి రాష్ట్రం నుంచి ఒక్కో ఐపీఎస్ అధికారిని ఎంపిక చేసి ఒక బృందంగా ఏర్పాటు చేసి పంజాబ్, చండీఘడ్ మీదుగా లెహ్ ప్రాంతానికి పంపుతారు. అధికారుల బృందం అమరవీరులకు నివాళి అర్పించి తిరిగి వస్తుంది.