నారాయణపేట, డిసెంబర్ 23: ప్రస్తుతం సైబర్ నేరగాళ్లు ప్రజలను అనేక రకాలుగా మోసం చేయడం జరుగుతుందని, సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం ఎస్పీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ అపరిచిత వ్యక్తుల వీడియో కాల్స్కు స్పందించరాదని, పండుగలకు షాపింగ్ చేసే సమయంలో ఇచ్చే లాటరీ కూపన్లకు వ్యక్తిగత వివరాలు ఇవ్వరాదన్నారు.
సైబర్ నేరగాళ్లు చెప్పే మోసపూరిత మాటలను నమ్మరాదని, సైబర్ నేరాలకు గురైతే 1930కి ఫోన్ కాల్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు. సైబర్ నేరగాళ్లు పంపే లింక్లను క్లిక్ చేయరాదని, సందేశాలకు స్పందిచరాదని తెలిపారు. సైబర్ నేరాలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని పోలీసులను ఆదేశించారు.