గద్వాల/ధరూర్, మే 20 : ఊరూరూ తిరుగుతూ జీవనం సాగించే ఆ కుటుంబాన్ని విధి వక్రీకరించింది. పొట్టకూటి కోసం పాత చీరలతో బొంతలు కుట్టుకొనే వారి కుటుంబంలో విషాదం నెలకొన్నది. తెల్లవారుజామునే కుటుంబ సభ్యులతో కలిసి వెళ్తున్న వారి బతుకులు తెల్లారాయి. ఆటోలో వెళ్తుండగా.. బొలేరో రూపంలో మృత్యువు కబళించింది. ప్రమాదంలో తల్లితోపాటు కొడుకు, కోడలు మృతి చెందిన విషాదకర సంఘటన జోగుళాంబ గద్వాల జిల్లాలో చోటు చేసుకున్నది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు..
గద్వాల మున్సిపాల్టీ పరిధిలోని 7వ వార్డు పరిధిలోని దౌదర్పల్లిలోని అద్దె ఇంట్లో 20 ఏండ్లుగా జములమ్మ (50) కుటుంబం నివాసం ఉంటుంది. ఆమెకు కొడుకుతోపాటు నలుగురు కూతుళ్లు ఉన్నారు. ఆమె భర్త పదేండ్ల కిందట మృతి చెందగా.. కుటుంబ పోషణకు జములమ్మ పెద్దదిక్కుగా మారింది. కష్టపడి ముగ్గురు ఆడపిల్లలకు వివాహం జరిపించగా.. నాలుగు నెలల కిందట హైదరాబాద్లోని ఉడుంగడ్డ ప్రాంతానికి చెందిన శంకర్ కూతురు వైశాలి (22)తో కొడుకు అర్జున్(24) వివాహాన్ని ఘనంగా జరిపించింది. తల్లితోపాటే కొడుకు, కోడలు దౌదర్పల్లిలోనే ఉంటూ ఊరూరా తిరుగుతూ బొంతలు కుడుతూ జీవనోపాధి పొందుతున్నారు.
రోజు మాదిరిగానే శనివారం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో బొంతలు కుట్టడానికి ఆటోలో ధరూర్ మండలం.. అక్కడి నుంచి కర్ణాటకలోని రాయిచూర్కు వెళ్లి వద్దామని ఆటోలో ముగ్గురూ బయలుదేరారు. వీరు ప్రయాణిస్తున్న ఆటో ధరూర్ మండలం పారుచెర్ల స్టేజీ వద్దకు రాగానే ఎదురుగా.. వేగంగా వస్తున్న బొలేరో మరో వాహనాన్ని తప్పించే క్రమంలో ఆటోను ఢీకొట్టింది. ప్రమాదంలో జములమ్మతో పాటు కుమారుడు అర్జున్, కోడలు వైశాలి అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఘటనా స్థలాన్ని డీఎస్పీ రంగస్వామి, సీఐ చంద్రశేఖర్, ఎస్సై శేఖర్రెడ్డి పరిశీలించి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. మృతదేహాలను గద్వాల ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కాగా రెండు నెలల కిందటే జములమ్మ చిన్న కూతురు కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకున్నది. బొలేరో ఆలూరు గ్రామానికి చెందిన వ్యక్తి పేరుతో రిజిస్ట్రేషన్ ఉన్నట్లు తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మృతుల కుటుంబాలకు పరామర్శ
రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారన్న విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి, జెడ్పీచైర్పర్సన్ సరిత, మున్సిపల్ చైర్మన్ కేశవ్ గద్వాల దవాఖానకు చేరుకొని వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రభుత్వ పరంగా అండగా ఉండడంతోపాటు ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
న్యాయం చేయాలని ధర్నా
గద్వాల అర్బన్, మే 20 : రోడ్డు ప్రమాదానికి కారణమైన బొలేరో ట్రక్ డ్రైవర్ను తక్షణమే అరెస్ట్ చేసి న్యాయం చేయాలని బాధిత కుటుంబ సభ్యులు దవాఖాన ఎదుట ధర్నా నిర్వహించారు. ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయి వాహనదారులు కాసేపు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సీఐ చంద్రశేఖర్ అక్కడకు చేరుకుని బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి ప్రమాదానికి కారణమైన వారిని అరెస్ట్ చేశామన్నారు.