జడ్చర్ల, జనవరి 29: ఈ ఏడాది పత్తి ధరలు రైతన్నల గుండెల్లో పరుగులు పెట్టిస్తున్నాయి. రోజురోజుకూ ధరలు పడిపోవడంతో రైతులకు ఏం చేయాలో తోచడం లేదు. సీజన్ ప్రారంభంలో పత్తి ధరలు రైతులను మురిపించాయి. ఆ తర్వాత ధరలు పడిపోతుండటంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ప్రారంభంలో క్వింటా రూ.9వేలకు పైగా ధర పలుకగా రానురాను పత్తి ధరలు తగ్గుతూ వస్తున్నాయి. రెండు నెలలుగా పత్తిధరలు తగ్గుతూనే ఉన్నాయి. వానకాలం సీజన్ ప్రారంభంలో అధిక వర్షాలు కురిసి అన్ని పంటలు దెబ్బతిన్నాయి. దీనికితోడు తెగుళ్లు అధికమై పంటచేలు పాడయ్యాయి. గతేడాది ధగధగ మెరిసిన తెల్లబంగారం ఈ సారి అందుకు భిన్నంగా మారడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు. ఆరుగాలం రాత్రనక, పగలనక కష్టపడి శ్రమించి పండించినా గిట్టుబాటు ధరలు కరువయ్యాయి. వ్యవసాయాన్ని, భూమినే నమ్ముకొని కాలం వెళ్లదీస్తున్న రైతులకు పంటల ఉత్పత్తుల ధరలు చూస్తే రైతులకు చివరకు కన్నీళ్లే మిగులుతున్నాయి.
సాధారణంగా పత్తి ఎకరాకు 10నుంచి 15క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. కానీ, ఈ సారి వర్షాలు అధికంగా కురువడంతో పంటల ఎదుగుదల దెబ్బతిన్నది. వర్షాలకు నీళ్లు నిలిచి చాలావరకు వేసిన పత్తిపంటలు పూర్తిగా పోయాయి. అలాగే ఉన్న కాస్త పంటకు తెగుళ్లు సోకడంతో పంటలను దెబ్బతీశాయి. ఎకరాకు 3నుంచి4 క్వింటాళ్లకు మించి పండలేదు. గతేడాది రికార్డుస్థాయిలో ధర పలకడంతో ఈసారి కూడా పత్తికి ధరలు బాగుంటాయని రైతులు పత్తిని అధికంగా సాగుచేశారు. గతేడాది జిల్లాలో 80,449ఎకరాల్లో పత్తిని సాగు చేయగా ఈ ఏడాది 99,536ఎకరాల్లో పత్తిని సాగుచేశారు. కానీ, అధిక వర్షాలు రైతులను దెబ్బతీశాయి. గతేడాది రికార్డుస్థాయిలో రూ.10వేలు దాటిన పత్తి ధర ఈ సారి రెండు మూడు వేలకు తగ్గింది. ప్రస్తుతం పత్తికి ఎక్కువగా రూ.6 నుంచి 7వేల వరకు ధర పడి పోయింది. ధరలు మరింత పడిపోయే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు.
రూ.9వేలకు పైగా పలికిన ధరలు ఉన్నట్లుండి తగ్గడంతో రైతులకు ఏం చేయాలలో తెలియని పరిస్థితి నెలకొన్నది. అంతర్జాతీయ మార్కెట్లో పత్తికి డిమాండ్ లేకపోవడంతో ధరలు తగ్గుముఖం పడుతున్నాయని వ్యాపారవర్గాలు చెబుతున్నాయి. ఈ రోజు పలికిన ధర రేపు ఉండటం లేదు. పెరిగిన సాగు, పెట్టుబడి ఖర్చులకు క్వింటా రూ.12వేలకు పైచీలుకు ధర వస్తేనే గిట్టుబాటు అవుతుందని, లేదంటే తీవ్రంగా నష్టపోక తప్పదని రైతులు అంటున్నారు. బాదేపల్లి వ్యవసాయ మార్కెట్లో పత్తి డిమాండ్ పెరిగినట్లే పెరిగి అమాంతం పడిపోయింది. కొన్ని రోజులుగా ధరలు తగ్గుతూ వస్తున్నాయి. క్వింటాకు దాదాపు రూ.2వేల నుంచి రూ.2500 వరకు ధర తగ్గింది. సంక్రాంతి తర్వాత పత్తిధరలు పెరుగుతాయని భావించిన రైతులకు మరింత తగ్గడంతో తీవ్ర మనస్తాపానికి గురవుతున్నారు. గత బుధవారం మార్కెట్లో పత్తికి కనిష్ఠంగా రూ.3,500, గరిష్ఠంగా క్వింటాకు రూ.7,590 ధర పలికింది. అంటే పత్తి ధరలు దాదాపుగా 6నుంచి 7మధ్యనే అధికంగా ఉన్నాయి.
జడ్చర్ల మండలం గంగాపూర్లో ఇంట్లో నిల్వ ఉంచిన పత్తి వద్ద రైతు ఇండ్లలోనే పత్తి నిల్వలు
పత్తికి మార్కెట్లో ధరలు లేకపోవడంతో చాలామంది రైతులు పత్తిని ఇండ్లల్లోనే నిల్వ చేసుకున్నారు. గతేడాది ఇదే సీజన్ చివరిలో పత్తి ధరలు పెరిగినందున ఈ ఏడాది కూడా ధరలు పెరుగుతాయనే ఆలోచనతో చాలామంది రైతులు పత్తిని ఇండ్లలోనే ఉంచారు. సాగుఖర్చుల కోసం కొంత కొంతగా మార్కెట్కు తీసుకెళ్లి విక్రయిస్తున్నారు తప్పా మిగిలిన పత్తి మొత్తం రైతుల ఇండ్లల్లోనే నిల్వ ఉన్నది.
నిల్వ చేసుకున్న రైతులు మొదట్లో ధరలు ఉన్న సమయంలోనే అమ్ముకోవాల్సి ఉండిందని, ఇలా ధరలు పడిపోతాయని ఊహించలేరు. దీంతో వారు లోలోపల దిగులు చెందుతున్నారు. పెట్టుబడి ఖర్చుల కోసం, అప్పులబాధతో కొంతమంది రైతులు తక్కువ ధరకే పత్తిని అమ్ముకుంటున్నారు. చాలామంది భవిష్యత్లో ధరలు పెరుగుతాయని ఆశతో ఇండ్లలోనే ఉంచుకున్నారు. గత బుధవారం పత్తికి గరిష్ఠంగా క్వింటాకు రూ.7,590, కనిష్ఠంగా రూ.3,501, మధ్యస్తంగా రూ.7,510 ధర పలికింది. దీంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ప్రభుత్వం మద్దతు ధర కల్పించాలని కోరుతున్నారు.
పెట్టుబడి కూడా రాని పరిస్థితి
ఆరుగాలం కష్టపడి పండించిన పత్తి పంటకు ధర లేకపోవడంతోపాటు ఖర్చులు కూడా వచ్చే అవకాశం లేదు. గతేడాది క్వింటాకు రూ.10వేలకు పైగానే ధర పలికింది. ఈ ఏడాది కూడా ధర పెరుగుతుందనే ఉద్దేశంతో సాగుచేశాం. కానీ, ప్రస్తుతం మార్కెట్లో వస్తున్న ధరలను చూస్తే భయమేస్తుంది. కనీసం పెట్టుబడి కూడా వచ్చేలా లేదు. బుధవారం మార్కెట్కు పత్తిని తీసుకొస్తే రూ.5,500ధర పలికింది.
– వెంకటయ్య, రైతు, మానాజీపేట
మద్దతు ధర కల్పించాలి
సాగుకు ఖర్చు రోజురోజుకూ పెరుగుతున్నది. ఎకరాలో పత్తి పంటను సాగుచేయాలంటే రూ.30వేలు ఖర్చు వస్తుంది. దిగుబడి 3నుంచి 5 క్వింటాళ్ల వరకు వస్తుంది. పత్తికి ప్రభుత్వం మద్దతు ధరను కల్పిస్తే రైతులకు గిట్టుబాటవుతుంది. మార్కెట్లో ధరలేక పత్తి రైతులు నష్టపోతున్నారు. క్వింటాకు రూ.12వేలకుపైగా పెంచితేనే గిట్టుబాటవుతుంది. బుధవారం తీసుకొచ్చిన పత్తి క్వింటాకు రూ.7,300 వచ్చింది. ఇంత ధర వస్తే ఏం మిగులుతుంది. – లక్ష్మయ్య, రైతు, కల్వకుర్తి
అంతర్జాతీయంగా ధర లేకపోవడంతోనే..
పత్తికి అంతర్జాతీయ మార్కెట్లో ధరలు లేకపోవడం వల్ల స్థానికంగా ధరలు తగ్గుతున్నా యి. అదేవిధంగా ప్రస్తుతం మార్కెట్కు వస్తు న్న పత్తి కూడా అంతగా నాణ్యతలేకపోవడం వల్ల కూడా ధరలు తగ్గే అవకాశం ఉంది. సీజన్ ప్రారంభంలో పత్తి నాణ్యతగా ఉండటం తో మంచి ధరలు వచ్చాయి. ప్రస్తుతం పత్తికి ధరలు తగ్గాయి.
– నవీన్కుమార్, మార్కెట్యార్డు, కార్యదర్శి, బాదేపల్లి