తొమ్మిదిన్నరేండ్లు ఎంతో కష్టపడి రాష్ట్రంలో నిర్మించుకున్న వ్యవస్థ ఒక్కసారిగా కుప్పకూలుతది. బంగారు తెలంగాణ దిశగా పడుతున్న అడుగులు ఆగిపోయే ప్రమాదం ఉన్నది. కాంగ్రెస్ విధానాలు ప్రగతికి వినాశకాలుగా మారనున్నాయి. అధికార దాహంతో ఆ పార్టీ నాయకులు నోటికి ఏది పడితే అది చెబుతూ బూటకపు హామీలు గుప్పిస్తున్నది. ప్రజలను, రైతులను మోసం చేయడానికి కుట్ర రాజకీయానికి తెరతీసింది. వారిని నమ్మితే ఎన్కటి రోజులు రావడం పక్కా అని రైతులే అంటున్నారు. వ్యవసాయ రంగం సంక్షోభంలోకి వెళ్తుందని, దీంతో ఉపాధి లేక మళ్లీ వలసబాట తప్పదని హెచ్చరిస్తున్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ నాశనం కావడంతోపాటు భూముల ధరలు పాతాళానికి పాడిపోవడం ఖాయమంటున్నారు. పట్నానికి బస్సుల్లో వలసవెళ్లే బతుకులు మాకొద్దంటున్నారు. తమ సంక్షేమానికి పాటుపడుతున్న బీఆర్ఎస్కే జై కొడుతూ మద్దతు పలుకుతున్నారు.
వనపర్తి, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ) : తొమ్మిదిన్నరేండ్ల బీఆర్ఎస్ పాలనలో పల్లెలు, పట్నాలు సుందరంగా మారడంతో అభివృద్ధి పరుగులు పెట్టి బంగారు తెలంగాణగా మారుతున్నది. ఈ తరుణంలో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పొరపాటున కాంగ్రెస్కు చాన్స్ ఇస్తే రాష్ట్రం పదేండ్లు వెనక్కి పోయే ప్రమాదం ఉన్నదని రైతులు హెచ్చరిస్తున్నారు. సమైక్య పాలనలో నట్టేట మునిగాం.. మళ్లా వారి పాలన వద్దే వద్దు అన్న ప్రకటనలు వెల్లువెత్తుతున్నాయి.
కాంగ్రెస్ పాలనొస్తే తెలంగాణ ఆగం కావాల్సిందే. 60 ఏండ్లు పాలించిన హస్తం పార్టీ దేశానికి, రాష్ర్టానికి ఒరగబెట్టిందేమీ లేదు. నాడు వ్యవసాయం అంతంతే.. రైతుల కష్టాలు వర్ణణాతీతం.. ఎరువులు కావాలన్నా.. విత్తనాలు కావాలన్నా.. ఆందోళనలు, క్యూలైన్లు తప్పేవి కావు. మళ్లీ ఎన్కటి కష్టాలు వస్తాయి.. భూముల ధరలు పాతాళానికి పడిపోతాయి. సాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోతుంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ నాశనమవుతుంది. ఉపాధి కరువవుతుంది. మళ్లా వలసలు షురూ అవుతాయి.. ఇతర రాష్ర్టాలు, నగరాలకు బస్సులు ప్రారంభమవుతాయి. సాగు పడిపోతుంది.. ఆహార భద్రతకు ముప్పు ఏర్పడుతుంది. వ్యవసాయంపై ఆధారపడిన 70 శాతం కుటుంబాలు ఆదాయాన్ని కోల్పోతాయి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది.
అసెంబ్లీ ఎన్నికల్లో చేస్తున్న వాగ్ధానాలు రైతులను గందరగోళానికి గురిచేస్తున్నాయి. సమైక్య పాలనలో వ్యవసాయం అంటేనే విరక్తి పుట్టించారు. ఉమ్మడి జిల్లాను వలసలకు నిలయంగా చేసి ఏకంగా 10 లక్షల మంది కూలీలు ఇతర దేశాలు, రాష్ర్టాలకు వలసలు వెళ్లేలా చేసిన పాపం వారే మూటకట్టుకున్నారు. అయినా కాంగ్రెస్ ఇంకా తనివి తీరలేదన్నట్లు వ్యవహరిస్తున్నది. తెలంగాణలో వ్యవసాయ రంగానికి ప్రాధాన్యమివ్వడం, సేద్యం పండుగలా మారడం.. రైతుబంధు, రైతుబీమా, ఇతర పథకాలు కర్షకులకు భరోసానివ్వడంతో ఆర్థికంగా ఎదిగారు. ఇది చూసిన కండ్లుమండుతున్న హస్తం పార్టీ రైతులను మోసం చేసేందుకు చూస్తున్నది. మూడు గంటల కరెంట్తో సాగు కష్టమవుతుంది. ఏ రకంగా చూసినా సాగు విస్తీర్ణం తగ్గుతుంది. దానికితోడు 10 హెచ్పీ మోటర్లతో ఆర్థిక భారం పడుతుంది. రైతుబంధులో కౌలుదారులు, రైతుల మధ్య పంచాయితీతో శాంతిభద్రతలకు ముప్పు వాటిల్లుతుంది. కరెంట్ కట్ చేసి భూమికి భద్రత లేకుండా చేస్తారు. దీంతో గ్రామీణ వ్యవస్థ దెబ్బతింటుంది. ఈ పరిణమాలన్నీ కలగలిపి భూముల ధరలు కిందకు చేరుతాయి. ఆత్మహత్యలు పెరిగే అవకాశం లేకపోలేదు.
ధరణిని ఎత్తేసి పట్వారీ, పటేళ్ల వ్యవస్థను తీసుకురావాలని కాంగ్రెస్ కుట్ర పన్నుతున్నది. దీంతో రైతులకు మళ్లా కష్టాలు మొదలుకానున్నాయి. భూమికి రక్షణ పోతుంది. తిరిగి దళారులు పుట్టుకొస్తారు.. భూమికి రక్షణ పోతుంది. భూములపై పట్వారీల అజమాయిషీ వస్తుంది. కౌలుదారు కాలంతో వ్యవసాయం చేయలేని రైతులు బీడుగా పెడతారే కానీ కౌలుకు మాత్రం ఇవ్వరు. కాంగ్రెస్ చెప్పే వాగ్దానాలు, హామీలు ఏదీ చూసినా ప్రజలను గందరగోళంలో పడేసేలా ఉన్నాయి. ఎంతో కష్టపడి సీఎం కేసీఆర్ సారథ్యంలో నిర్మించుకున్న వ్యవస్థ కుప్పకూలుతుంది. కరెంట్ను కుదించడంతో ఎత్తిపోతల మోటర్లు నడవడం కష్టమే.. సాగునీరు పారదు.. రైతులకు మళ్లా పాత కష్టాలే… కానీ తెలంగాణ వచ్చాక భూమి ధరలు పెరిగి రైతులు వృద్ధిలోకి వచ్చారు. ఆత్మహత్యలు నిలిచిపపోయాయి. బతుకుకు భరోసా ఏర్పడింది. అందుకే బీఆర్ఎస్ పథకాలకు మించినవి ఏవీ లేవని, ఈసారి తమ మద్దతు బీఆర్ఎస్కే అంటూ రైతులు ప్రకటిస్తున్నారు. కాంగ్రెస్కు ఓటుతో బుద్ధి చెబతామని హెచ్చరిస్తున్నారు.
స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి దశాబ్దాల పాటు కాంగ్రెస్ పాలించింది. వీరి హయాంలో వ్యవసాయ రంగం పూర్తిగా నీరుగారింది. దీంతో రైతులు ఎన్నో కష్టాలు పడ్డారు. కరెంట్ కోసం పొలాల వద్ద రాత్రిళ్లు జాగారం చేసేటోళ్లు. సాగునీరు లేక బోర్లన్నీ ఒట్టిబోయి కర్షకులెందరో ఆత్మహత్యలు చేసుకున్నారు. తెలంగాణ ఏర్పడ్డాక ఆ పార్టీకి ఓటర్లతో చెక్ పెట్టారు. తర్వాత సీఎం కేసీఆర్ పాలనలో వ్యవసాయ రంగం కొత్తపుంతలు తొక్కింది. 24 గంటల కరెంట్తోపాటు రైతు సంక్షేమ పథకాలు అమలు చేయడంతో రైతు రాజుగా మారాడు. అయితే ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లా కాంగ్రెస్ పార్టీ రైతులను మోసం చేయాలని చూస్తుంది. తెలంగాణ రైతులపై పగబట్టిన హస్తం పార్టీ నేతలు ఎలాగైనా అధికారంలోకి రావాలని కుట్ర పన్నుతున్నారు. అమలుకు సాధ్యంకాని హామీలన్నీ ఇస్తున్నది. వ్యవసాయానికి 3 గంటల కరెంట్ చాలని, రైతులు 10 హెచ్పీ మోటర్లు పెట్టుకోవాలని టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి ఉచిత సలహా ఇస్తున్నాడు. మళ్లా ఆ పార్టీ వస్తే తెలంగాణ ఆగమే.. వ్యవసాయ రంగంతోపాటు ఆహార భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉన్నది. భూముల ధరలు పడిపోనున్నాయి. ఉపాధి లేక జనం మళ్లా వలస బాట పట్టే అవకాశం ఉన్నది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమయ్యే అవకాశం ఉన్నది. అలాంటి పార్టీకి ఓటుతో తగిన బుద్ధి చెప్పాలి
సాగు విస్తీర్ణం తగ్గుతుంది
తెలంగాణలో కాంగ్రెస్ నాయకులు చెప్పే మాటలు నమ్మితే ఆగం కావాల్సిందే.. ఇప్పటికే వ్యవసాయానికి 24 గంటల కరెంట్ వద్దని, 3 గంటలే చాలని, 10 హెచ్పీ మోట ర్లు పెట్టుకోవాలని రేవంత్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. వీరి మాటలు నమ్మి అధికారం కట్టబెడితే రాష్ట్రం అధోగతి పాలు కావడం ఖాయం. సాగునీటి, కరెంట్ కష్టాలు మొదలవుతాయి. పంటలతోపాటు సాగు విస్తీర్ణం తగ్గిపోయే ప్రమాదం ఉన్నది. తెలంగాణ వచ్చాక పదేండ్లలో కష్టపడి సాధించిన గ్రామాల్లో ఆర్థిక వ్యవస్థ తగ్గిపోయే ప్రమాదం ఉన్నది. పల్లెల్లో 70 శాతం సాగునే నమ్ముకొని జీవిస్తున్న రైతుల పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారైతది. మళ్లీ వలసలు మొదలవుతాయి. భూముల ధరలు పడిపోతాయి. రాష్ట్రంలోని రైతులకు నిరంతర కరెంట్ అవసరం లేదని ప్రకటిస్తున్నారు. కరెంట్ కోతలు పెడితే ఎత్తిపోతల పథకాలను అంత కరెంట్ పెట్టి ఏం నడుపుతారు. ఇక సాగునీటికి కష్టకాలాలే.. ధరణి ఎత్తేసే కుట్ర జరుగుతున్నది. పక్కనే ఉన్న కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వంలో వ్యవసాయానికి 5 గంటలు మాత్రమే కరెంట్ ఇస్తున్నారు. రాష్ట్రంలో మాత్రం వ్యవసాయానికి 3 గంటలు కరెంట్ సరిపో తుందని పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి చెబుతున్నాడు. అది ఏ చేనుకు.. ఏ మూలకూ సరిపోదు. కర్ణాటకలో ప్రకటించిన ఐదు హామీలు ఒక్కటి కూడా సక్రమంగా నెరవేర్చడం లేదని అక్కడి రైతులు వాపోతున్నారు. మీరూ మాలాగా ఇబ్బందులు పడొద్దని హెచ్చరిస్తున్నారు. అందుకే 24 గంటల కరెంట్ అందించే సీఎం కేసీఆర్నే మరోసారి ఆశీర్వదించాలి.. రైతు సంక్షేమ ప్రభుత్వం మళ్లా రావాలె.
రైతులపై పగబట్టిన కాంగ్రెస్..
కాంగ్రెస్ రైతులపై పగబట్టింది. అలాంటి పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే బతుకులు ఆగమైతయి. రైతుబంధులో కౌలుదారులు, రైతుల పంచాయితీతో శాంతిభద్రతలకే ముప్పు వాటిల్లనున్నది. కరెంట్ను కోతల మయం చేసి భూమికి భద్రత లేకుండా చేస్తారు. రైతుబంధుకు గండం పెడితే సాగు విస్తీర్ణం పడిపోతది. కౌలుదారు కాలం వస్తే పంటలు పండించలేని వారు సైతం అవసరమైతే పొలాలను బీడుగా ఉంచుతారు. గ్రామీణ స్థాయిలో ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. కరెంట్ కష్టాతో లిఫ్ట్ మోటర్లు సాగునీరు పారించవు. కౌలుకు భూములు ఇవ్వరు.. రైతు ఆత్మహత్యలు పెరుగుతాయి. అదనపు ఆదాయం కోల్పోతారు. రైతుబంధు పెట్టుబడి సాయం పట్టాదారుడికి లేదా కౌలురైతుల్లో ఒకరికే ఇస్తామంటూ చెబుతుండడం సరికాదు. అలాగే ధరణికి బదులుగా భూమాతను పెడుతామని భట్టివిక్రమార్క చేస్తున్న కౌలుదారు కాలం పెడితే రైతుబంధు సాయం కేవలం పెట్టుబడి కౌలుదారుకు ఇస్తే పట్టాదారులు తమ భూములను బీళ్లుగాపెట్టుకోవడం ఖాయం. భూముల ధరలు పడిపోతయ్.. ఉపాధి కరువై మళ్లా వలసలు మొదలువుతాయి. ఈ ప్రాంతం బీడుబారిపోతుంది. కాంగ్రెస్ నాయకులు చెబుతున్నదంతా తన్నుక చావడానికే మరోటి లేదు. వారి వరుస ప్రకటనలు రైతులను గందరగోళానికి గురిచేస్తున్నాయి. ఇది మంచి పద్ధతి కాదు. సీఎం కేసీఆర్ పాలనే బాగుంది.. ఆయనే మరోసారి హ్యాట్రిక్ సీఎం కావాలని రైతులు కోరుతున్నారు. కాంగ్రెసోళ్లు ఎదుటి వారు బాగుపడితే తట్టుకోరు.