కల్వకుర్తి, మార్చి 30 : క్యాష్ కటింగ్.. ఇది రైతులకు సుపరిచితమైన పదం. క్యాష్ కటింగ్ బారినపడని రైతు ఉండడంటే అతిశయోక్తి లేదు. రైతులు పండించిన ధాన్యాన్ని మార్కెట్లో వ్యాపారికి విక్రయిస్తే.. సదరు వ్యాపారి రైతుకు వెంటనే డబ్బులు ఇవ్వకుండా 15 నుంచి నెలరోజుల గడువు విధిస్తాడు. వెంటనే డబ్బులు కావాలంటే క్యాష్ కటింగ్ చేసుకొని ఇస్తానని షరతు పెడతారు. అవసరాలకు డబ్బులు కావాలంటే క్యాష్ కటింగ్ అయినా సరే డబ్బులు ఇవ్వమంటారు. అప్పుడు సదరు వ్యాపారి నూటికి మూడు రూపాయల చొప్పున డబ్బులు పట్టుకొని చెల్లిస్తాడు. అంటే ఉదాహరణకు రైతు విక్రయించిన ధాన్యానికి రూ.లక్ష వస్తే.. క్యాష్ కటింగ్ పేరుతో రూ.3వేలు పట్టుకొని రూ.97వేలు రైతు చేతిలో పెడుతారు.
కమీషన్ ఏజెంట్లు, ట్రేడర్లు..
ధాన్యం మార్కెట్లో వ్యాపారస్తులు రెండు రకాలుగా ఉంటారు. కమీషన్ ఏజెంట్లు, ట్రేడర్లు.. కూరగాయల మార్కెట్లో కమీషన్ ఏజెంట్లు ఉంటారు. కూరగాయల మార్కెట్ విషయానికొస్తే రైతులు పండించిన కూరగాయలు, ఆకుకూరలను మార్కెట్కు తీసుకొస్తారు. ఇక్కడ కమీషన్ ఏజెంట్లదే కీలక పాత్ర. మార్కెట్ లైసెన్లు కలిగిన కమీషన్ ఏజెంట్ల వద్దకు కూరగాయలు కొనుగోలు చేస్తే వ్యాపారస్తులు వస్తారు. రైతుల కూడా తమ కూరగాయలను అమ్మించాలని కమీషన్ ఏజెంట్ వద్దకు వెళ్తాడు. ఇక్కడ ఒపెన్ టెండర్ విధానం ఉంటుంది.
రైతు తీసుకొచ్చిన కూరగాయలకు వ్యాపారులు ధర నిర్ణయిస్తూ వేలంపాట పాడుతారు. ఉదాహరణకు రైతు 100 కిలోల టమాటాలను మార్కెట్లో కమీషన్ ఏజెంట్ వద్దకు తీసుకొస్తాడు. ఇక్కడ టమాటాకు వ్యాపారులు ధర నిర్ణయిస్తూ వేలంపాట పాడుతారు. ఎవరు ఎక్కువ ధర పాడితే వారికి టమాటను అప్పగిస్తారు. ఈ విధానం ద్వారా వ్యాపారులు సిండికేట్గా మారి రైతులను నట్టేట ముంచిన సందర్భాలు ఉన్నాయి. ఇక అసలు విషయానికి వస్తే 100కిలోల టమాటాలకు రూ.వెయ్యి వస్తే అందులో కమీషన్ ఏజెంట్ తన కమీషన్ను రూ.30 నుంచి రూ.60 వరకు తీసుకుంటారు. మిగతా రూ.970ని వెంటనే ఇవ్వడు. దీనికి 10 నుంచి 20 రోజుల గడువు ఉంటుంది. వెంటనే డబ్బులు ఇవ్వాలంటే క్యాష్ కటింగ్. మళ్లీ నూటికి మూడు రూపాయల కటింగ్. కమీషన్ ఏజెంట్ విధానంలో రైతుకు, వ్యాపారికి సంబంధం ఉండదు. కమీషన్ ఏజెంట్ మధ్యన ఉంటాడు.
మార్కెట్కు ధాన్యం తీసుకొస్తే..
ధాన్యం మార్కెట్లో ట్రేడర్లు, కమీషన్ ఏజెంట్లు ఉంటారు. రైతు ధాన్యాన్ని ట్రేడర్ వద్దకు లేదా కమీషన్ ఏజెంట్ వద్దకు తీసుకెళ్లవచ్చు. ట్రేడర్లకు మిల్లులు (బియ్యం, వేరుశనగ) ఉంటాయి. కాకపోతే ధాన్యం మార్కెట్లో రహస్య టెండర్ విధానం ఉంటుంది. ధాన్యం రాశులకు నెంబర్లు కేటాయిస్తూ బోర్డును ఏర్పాటు చేస్తారు. క్రమ సంఖ్య ఆధారంగా ఎక్కువ ధర వేసిన వ్యాపారి, లేదా కమీషన్ ఏజెంట్ కొనుగోలు చేస్తాడు. ధాన్యం ఎక్కువగా వచ్చినప్పుడు వ్యాపారులు సిండికేట్గా మారుతారు. ధాన్యం కమీషన్ ఏజెంట్ వద్దకు తీసుకెళ్తే ఏజెంట్కు కమీషన్ ఇవ్వాల్సి ఉంటుంది.. వెంటనే డబ్బు కావాలంటే క్యాష్ కటింగ్ ఉంటుంది. ట్రేడర్ వద్దకు తీసుకెళ్తే కమీషన్ ఉండదు.. కానీ, క్యాష్ కటింగ్ ఉంటుంది.
మార్కెట్లో ప్రతి ఖర్చు రైతుదే..
మార్కెట్లో ధాన్యం ఎండబెట్టినా.. తుకాలు వేసినా ప్రతి ఖర్చు రైతు చెల్లించాల్సిందే. రవాణా, హమాలీ ఇలా.. ఖర్చుల భారమంతా రైతులపైనే. వ్యాపారి ధాన్యాన్ని తుకాం వేసుకొని పట్టి ఇచ్చేవరకు బాధ్యతంతా రైతుపైనే ఉంటుంది. వ్యాపారుల తీరే గమ్మత్తుగా ఉంటుంది. ధర నిర్ణయించి ధాన్యం కొనుగోలు చేసిన వ్యాపారి సదరు ధాన్యానికి సంబంధించి రైతులకు వెంటనే డబ్బులు చెల్లించాలి. అలా కాకుండా క్యాష్ కటింగ్ పేరుతో మూడు నుంచి నాలుగైదు శాతం డబ్బులను మినహాయించుకొని రైతులకు ఇవ్వడంలో వ్యాపారం ఎక్కడుంది.. బ్రోకరిజం తప్ప అని రైతు సంఘం నాయకులు అంటున్నారు.
20 రోజులుగా 50 వేల బస్తాలు
20 రోజులుగా కల్వకుర్తి వ్యవసాయ మార్కెట్ యార్డుకు లేదా, నేరుగా మిల్లుల వద్దకు దాదాపు 50 వేల బస్తాల వేరుశనగను రైతులు తీసుకొచ్చారు. 50 వేల బస్తాలు అంటే దాదాపుగా 15 వేల క్వింటాళ్ల వేరుశనగ ధాన్యాన్ని ట్రేడర్లు, కమీషన్ ఏజెంట్లు కొనుగోలు చేశారు. 20 రోజులుగా వేరుశనగ ధర రూ.7,800 వేసుకున్నా.. దాదాపుగా రూ.11కోట్ల 70లక్షలను వ్యాపారులు రైతులకు చెల్లించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన క్యాష్ కటింగ్ను లెక్కిస్తే.. దాదాపుగా రూ.34లక్షలు అవుతుంది. రైతులకు పంట అమ్మిన తర్వాత చాలావరకు డబ్బులు అవసరమవుతాయి.దీంతో చాలామంది క్యాష్ కటింగ్ అయినా సరే డబ్బులు తీసుకుంటారు. ఆర్థికంగా ఉన్న పెద్ద రైతులు మాత్రం గడువు తర్వాత డబ్బులు తీసుకుంటారు.
సీఎం ఆలోచనకు ఆశయాలు సిద్ధిస్తే..
సీఎం కేసీఆర్ ఆలోచనకు ఆశయాలు సిద్ధించి కార్యరూపం దాలిస్తే రైతులు మోసాలనుంచి గట్టెక్కే అవకాశాలు మెండుగా ఉంటాయని రైతు సంఘం నాయకులు పేర్కొంటున్నారు. స్వయంగా రైతు అయిన సీఎం కేసీఆర్కు మార్కెట్ గురించి, రైతుల కష్టాలు తెలుసు. అందుకే రైతులకు ప్రతిగ్రామంలో రైతువేదికలను కట్టించారు. రైతువేదికల ఉద్దేశం ఏమిటంటే రైతులు ఐక్యంగా ఉండడం, పండించిన ధాన్యానికి రైతులూ ధర నిర్ణయించడం. వ్యాపారులే రైతుల వద్దకు వచ్చి డబ్బు చెల్లించి ధాన్యాన్ని కొనుగోలు చేయాలనేదే సీఎం కేసీఆర్ ఆశయం. అందులో మెట్టులో భాగంగా ఏర్పాటు చేసినవే రైతు వేదికలని, సంఘం నాయకులు అంటున్నారు.
రూ.50వేలకు వెయ్యి కటింగ్
పదెకరాల్లో పత్తిపంట చేశాను. గ్రామ సమీపంలోని పత్తి జిన్నింగ్ మిల్లులో విక్రయించాను. ఆరు కింటాళ్ల 70 కిలోలయింది. రూ.7,400 ధర పలికింది. రూ.49 వేలు వచ్చాయి. డబ్బులు వెంటనే ఇవ్వాలంటే క్యాష్ కటింగ్ రూ.వెయ్యి పట్టుకొని రూ.48 వేలు ఇచ్చారు. నష్టంలో ఇదో నష్టమని డబ్బులు తీసుకున్నాను.
– కాయితి శశిపాల్రెడ్డి, రైతు, కల్వకుర్తి