నందిమల్ల.. ఆ పల్లె వాసులంతా కూరగాయల సాగులో నిష్ణాతులు.. చిన్న, సన్న కారు రైతులు మొదలు అందరికీ కూరగాయల సాగే జీవనాధారం. ఉన్న కొద్ది పాటి భూమిలో లాభాల పంటలు పండిస్తున్నారు. వాతావరణ మార్పులకనుగుణంగా ఆకుకూరలు, టమాట, వంకాయ, ఉల్లి, చిక్కుడు, బెండ, బీర, సొర, క్యారెట్, మిర్చితోపాటు వివిధ పంటలను సాగు చేస్తున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి కృషితో కృష్ణా జలాలు చేరడంతో గ్రామం సస్యశ్యామలమైంది. గ్రామంలో 120 కుటుంబాలు నివసిస్తుంటే.. మొత్తం 2 వేల ఎకరాల్లో వ్యవసాయం చేస్తూ వంద శాతం గుర్తింపుతో ఆదర్శంగా నిలిచింది.
– వనపర్తి, జనవరి 7
వనపర్తి, జనవరి 7 : వనపర్తి మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డుకు చెందిన నందిమల్లగడ్డ.. జిల్లా కేంద్రానికి సుమారు మూడు కిలోమీటర్ల దూ రంలో ఉన్నది. ఇక్కడ దాదాపుగా 120 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. అయితే, అన్ని కుటుంబాలు వ్యవసాయమే జీవనాధారంగా ముందుకుసాగుతున్నారు. దాదాపు 2 వేల ఎకరాల్లో కూరగాయలు, ఆకుకూరలు సాగుచేస్తున్నారు. జిల్లా కేంద్రంలో ప్రతి ఆదివారం జరిగే సంతతోపాటు నిత్యం మార్కెట్లో నందిమల్లగడ్డ ప్రాంతానికి చెందినవారే 90 శాతం మంది ఉంటున్నారు. నందిమల్లగడ్డ ప్రాంతానికి చెందిన ఈదుల చెరువులో గతంలో నీళ్లు లేక రైతులు ఇబ్బందులు పడేవారు. వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ప్రత్యేక చొరవతో ఈదుల చెరువును కృష్ణా జలాలతో నింపారు. దీంతో భూగర్భజలాలు పెరిగాయి. కాగా, 1,700 ఎకరాలకు మాత్రమే సాగునీరందేది. మిగిలిన 300 ఎకరాలకు నీరందడంలేదని రైతులు మంత్రి నిరంజన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో గతేడాది డిసెంబర్ 22వ తేదీన ఈదుల చెరువు నుంచి రూ.92 లక్షల సీఎస్ఆర్ నిధులతో ఐదు కిలోమీటర్ల మేర పైప్లైన్ వేయించారు.
ఐదు మినీలిఫ్ట్ల ద్వారా మెట్టప్రాంతాలకు సైతం నీరందుతున్నది. దీంతో ప్రస్తుతం 2వేల ఎకరాల్లో ఆకుకూరలు, కూరగాయలు సాగు చేస్తున్నారు. తాగునీరు కూడా లేక ప్రజలు ట్యాంకర్ల నీటిని వాడుకునేవారు. మంత్రి నిరంజన్రెడ్డి ప్రత్యేక పైప్లైన్లు వేయించి తాగునీటిని అందించారు. దీంతో గతంలో సమస్యల అడ్డాగా ఉన్న నందిమల్లగడ్డ నేడు అభివృద్ధికి చిరునామాగా మారింది. రైతులు కొన్ని ఎకరాల్లో వరి, వేరుశనగను పండిస్తూ.. మిగిలిన ఎకరాల్లో ఆకుకూరలు (పాలకూర, మెంతికూర, కొత్తిమీర, పుదీనా, పుంటికూర), టమాట, వంకాయ, ఉల్లిగడ్డ, చిక్కుడుకాయ, బీరకాయ, ఆనంకాయ, క్యారెట్, బెండకాయ, పచ్చిమిర్చి వంటి వాటిని పండిస్తున్నారు. ఇలా ఒక ప్రాంతమంతా కూరగాయలు, ఆకుకూరలు పండిస్తూ లాభాలు ఆర్జిస్తున్నారు. మిగిలిన ప్రాంత రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
రెండెకరాల్లో కూరగాయల సాగు..
మాకు నాలుగు ఎకరాలు ఉన్నది. అందు లో ఎకరా వరి, ఎకరా వేరుశనగ సాగు చేస్తు న్నాం. మిగిలిన రెండెకరాల్లో వంకాయ, చి క్కుడుకాయ, పాలకూర, టమాట, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కొత్తిమీర పండిస్తున్నాం. ప్రతి రో జూ కూరగాయలు, ఆకుకూరలను వనపర్తి మార్కెట్లో విక్రయించి డబ్బులు సంపాదిస్తు న్నాం. వ్యవసాయాన్ని నమ్ముకొని పని చేస్తున్నాం.
– చిట్టెమ్మ, మహిళా రైతు, నందిమల్ల గడ్డ
కూలికి పోవాల్సిన అవసరం లేదు..
మా పొలంలోనే వ్యవసాయం చేసుకుంటు న్నాం. ఉన్నదానిలో కొంత భాగం వరి, వేరుశనగ, మిగిలిన భూమిలో ఆకుకూరలు, కూరగాయలు పండించుకుంటున్నాం. నిత్యం ఉదయాన్నే వాటిని వనపర్తిలో అమ్ముకుంటు న్నాం. మళ్లీ వచ్చి పొలంలో పనులు చేసుకుంటున్నాం. దీంతో మేము ఎవరి వద్దకు కూలికి పోకుండా వ్యవసాయం చేసుకుంటున్నాం.
– భాగ్యలక్ష్మి, మహిళా రైతు, నందిమల్లగడ్డ
మస్తు నీళ్లు ఉన్నాయి..
తరతరాలుగా వ్యవసాయం చేసే కుటుం బం మాది. పొలానికి వెళ్లి ఆకుకూరలు, కూరగాయలను తెంపుకొని.. కట్టలు కట్టి మా ఇం ట్లో వాళ్లు వనపర్తికి తీసుకుపోయి అమ్ముతా రు. మాకు గతంలో నీళ్ల ఇబ్బంది ఉండేది. కానీ, ఇప్పుడు అమ్మ చెరువులో నీళ్లు నిం డుగా ఉన్నాయి. మంత్రి నిరంజన్రెడ్డి ఎత్తిపోతలను తేవడంతో సాగు చేసేందుకు మస్తుగా నీళ్లు అందుతున్నాయి. ఎలాంటి నష్టం లేకుండా ఆకుకూరలు, కూరగాయలు పండించుకుంటున్నాం.
– ఆరాధ్య, మహిళా రైతు
సస్యశ్యామలంగా నందిమల్లగడ్డ..
నందిమల్లగడ్డ ప్రాంతవాసులంతా వ్యవసాయమే జీవనాధారంగా ముందుకుసాగుతున్నారు. 120 కుటుంబాల్లో 100 శాతం ఆకుకూరలు, కూరగాయలు, వ్యవసాయం చేస్తున్నారు. ఇటీవల మంత్రి నిరంజన్రెడ్డి రూ. 92లక్షలతో 5 మినీ ఎత్తిపోతల ద్వారా 300 ఎకరాలకు సాగునీటిని అందించారు. దీంతో నందిమల్లగడ్డ సస్యశ్యామలంగా మారింది. ఈ ప్రాంత అభివృద్దికి కృషి చేసిన వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డికి ధన్యవాదాలు.
– వెంకటేశ్, కౌన్సిలర్