రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు సంబురంగా సాగుతున్నాయి. శుక్రవారం ఉమ్మడి జిల్లాలో నిర్వహించిన పట్టణ ప్రగతి పండుగలా సాగింది. పలు చోట్ల ట్రాక్టర్లతో ర్యాలీలు తీశారు. బ్యాండ్ బాజా మోతల మధ్య బోనాలు, బతుకమ్మల ఊరేగింపు ఆకట్టుకున్నది. పరిశుభ్రతకు కృషి చేస్తున్న పారిశుధ్య కార్మికుల సేవలను ప్రశంసించారు. వనపర్తిలో సఫాయన్నా.. నీకు సలాం అంటూ జెడ్పీ చైర్మన్ లోకనాథ్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ కార్మికులకు పాదపూజ చేశారు. పాలమూరులో మంత్రి శ్రీనివాస్గౌడ్ హాజరై పట్టణాల్లో ప్రగతి బాటలు పడ్డాయని స్పష్టం చేశారు. ఆయా చోట్ల ఎమ్మెల్యేలు, అధికారులు వేడుకల్లో పాల్గొన్నారు.
– నెట్వర్క్, మహబూబ్నగర్, జూన్ 16
తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు సంబురంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం పట్టణప్రగతి దినోత్సవాన్ని ఘనంగా జరుపుకొన్నారు. మున్సిపల్ కార్యాలయాలపై జాతీయ పతాకం ఎగురవేసి ర్యాలీలు నిర్వహించారు. ప్రధాన కూడళ్లలో మానవహారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ సిబ్బంది, కార్మికులు ఆడి పాడారు. ఉత్సవాల్లో మంత్రి శ్రీనివాస్గౌడ్తోపాటు ఎంపీ, ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొని పట్టణాల్లో చేపట్టిన ప్రగతిని వివరించారు. అనంతరం మున్సిపల్ కార్మికులకు పాదపూజ చేయడంతోపాటు దుస్తులు, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.