రైతు సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు రాష్ట్రంలో సాగును పండుగలా మార్చాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో రైతులకు వినూత్న పథకాలు అమలవుతున్నాయి. ఈ క్రమంలో రైతు కుటుంబాలను ఆదుకునేందుకు తీసుకొచ్చిన రైతుబీమా కొండంత అండగా నిలిచింది. వ్యవసాయాన్ని నమ్ముకున్న కర్షకుల కుటుంబానికి సీఎం కేసీఆర్ చేయూతనందిస్తున్నారు. కుటుంబానికి పెద్దదిక్కును కోల్పోయినా బీమా ఆర్థిక భరోసానిస్తున్నది. 2018 ఆగస్టు 15న ప్రారంభమైన ఈ పథకం మృతి చెందిన రైతు కుటుంబానికి ప్రభుత్వం రూ.5 లక్షల పరిహారం అందిస్తున్నది. దళారీలు, ఇతరుల ప్రమేయం లేకుండా వారం, పది రోజుల్లోనే అందుతున్న ఆర్థిక సాయం రైతు కుటుంబాల్లో కష్టాలను తీరుస్తున్నది. ఇప్పటికే ఈ పథకం సత్ఫలితాలు ఉమ్మడి జిల్లాలోని 16,601 రైతు కుటుంబాలకు అందాయి. మొత్తం రూ.830.35 కోట్లు పరిహారంగా అందడంతో వారి కుటుంబాలకు ఈ పథకం ఆపన్నహస్తంలా నిలిచింది.
గద్వాల, మే 24 : రైతుబీమా పథకం అన్నదాతల కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నది. రైతు వ్యవసాయంలో ఎన్ని ఒడిదుడుకులను ఎదుర్కొని.. పంట పండిస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాడు. అటువంటి అన్నదాత అకస్మాత్తుగా మరణిస్తే ఆ కుటుంబం ఆర్థికంగా చితికిపోకుండా.. వారికి ఆర్థిక చేయూతనివ్వాలనే ఆలోచనతో సీఎం కేసీఆర్ సెంటు భూమి ఉన్న రైతుకు కూడా బీమా సౌకర్యం కల్పించారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని భావించిన ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నదాతలకు అండగా నిలిచాడు. వ్యవసాయాన్ని నమ్ముకున్న రైతు ఎప్పటికీ నష్టపోకూడదని అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి వారి ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం తోడ్పాటునందిస్తున్నది. పెట్టుబడి సహాయం కింద వానకాలం, యాసంగి పంటలకు ఎకరాకు రూ.10వేలు ఖాతాలో జమచేస్తూ పంటలు ఎంపోకుండా నిరంతరం ఉచిత విద్యుత్ను అందిస్తున్నది. పంటను సైతం దళారులకు అమ్మి మోసపోకుండా ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నది. ఇలా రైతుకు ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలుస్తూనే రైతుబీమా పథకం ద్వారా ఆర్థిక చేయూతనిస్తుండడంతో ఆ కుటుంబాలు ధీమాతో బతుకుతున్నాయి. సెంటు భూమి ఉన్న వారికి సైతం బీమా వర్తింపజేస్తుండడంతో సీఎం కేసీఆర్కు రైతులు జేజేలు కొడుతున్నారు. ఈ పథకంలో ప్రభుత్వమే ప్రీమియం చెల్లిస్తున్నది.
రైతుబీమా పథకాన్ని 2018 ఆగస్టు 14న ప్రభుత్వం ప్రారంభించింది. కాగా ఇప్పటివరకు ఉమ్మడి పాలమూరు జిల్లాలో 16,601 రైతు కుటుంబాలకు రూ.830.35కోట్ల పరిహారం అందింది. జోగులాంబ గద్వాల జిల్లాలో 2,467 కుటుంబాలకు రూ.123.35కోట్లు, మహబూబ్నగర్ జిల్లాలో 3,653 కుటుంబాలకు రూ.182.95కోట్లు, నారాయణపేట జిల్లాలో 3,415 రైతు కుటుంబాలకు రూ.170.75, నాగర్కర్నూల్ జిల్లాలో 4,323 కుటుంబాలకు రూ.216.15కోట్లు, వనపర్తి జిల్లాలో 2,743 కుటుంబాలకు రూ.137.15కోట్లను వారి నామినీ ఖాతాల్లో జమ చేసింది. పట్టదారు పాసుపుస్తకం ఉన్న 59 ఏండ్ల లోపు రైతు కుటుంబాలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది.
నా భర్త సూరి నాగయ్య.. మాకు ఇద్దరు కొడుకులు, ఓ కూతురు. ఎకరా పొలం ఉన్నది. పంటలు సాగు చేస్తూ ఆనందంగా బతికెటోళ్లం.. ఉన్నంతలో అప్పులు లేకుండా జీవిస్తున్న తరుణంలో ఒక రోజు మా ఇంటి ఎదుట ఉన్న సంపులో పడి నా భర్త మృతి చెందాడు. దీంతో మా కుటుంబానికి పెద్ద దిక్కు లేకుండాపోయింది. ఎదుగుతున్న ముగ్గురు పిల్లలను ఎలా బతికించుకోవాలో దిక్కు తోచలేదు. బతుకు బండి లాగేందుకు చేయిచాపి ఎవరినైనా పైసలడగాలంటే భయమైంది. ఏం పని చేసి కుటుంబాన్ని పోషించాలో అర్థం కాలేదు. నా భర్త పేరుపై భూమి ఉండడంతో సర్కార్ నుంచి రైతుబీమా సాయం అందుతుందని కొందరు చెప్పారు. మా ఊరి లీడర్లు నా పరిస్థితిని ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి సార్కు చెప్పిండ్రు. తర్వాత పది, పదిహేను రోజుల్లోనే బీమా సాయం రూ.5 లక్షలు ఖాతాల్లో పడ్డాయి. నా భర్త చనిపోయిన సర్టిఫికెట్, నా ఆధార్, బ్యాంక్ పాస్ బుక్కు అందజేశాను.. ఎవరికీ ఒక్క రూపాయి ఇవ్వకుండానే నాకు బీమా పైసలు వచ్చాయి. డబ్బుతో ఎకరం భూమికొన్నా.. పంటలు పండిస్తున్నా.. మిగతా సమయంలో ఊళ్లోనే చిన్నపాటి దుకాణం నిర్వహిస్తూ నెలకు ఐదారు వేల నుంచి పదివేల రూపాయలు సంపాదిస్తున్నా.. నా కూతురిని ఇంటర్ చదివిస్తున్నా.. మూడు పూటలా నాతోపాటు నా బిడ్డలకు కడుపునింపుతున్నా.. నా భర్త మరణించిన సమయంలో ఎలా బతకాలోనని భయపడ్డా.. సీఎం కేసీఆర్ సార్ బీమా పథకంతో మా కుటుంబానికి అండగా నిలిచారు. ముఖ్యమంత్రికి జీవితాంతం రుణపడి ఉంటాను.. ఎమ్మెల్యే మర్రి సాయం మరిచిపోలేనిది..
– సూరి ఇందిరమ్మ, ఉయ్యాలవాడ, నాగర్కర్నూల్ జిల్లా
గతంలో ప్రభుత్వ పథకాలన్నీ మధ్యవర్తుల ప్రమేయం లేకుండా లబ్ధిదారులకు అందేవి కాదు. ఎక్కువ శాతం వాళ్లే తీసుకొని లబ్ధిదారులకు ఎంతో కొంత అందేంచేవారు. రైతు కుటుంబాలకు అన్యాయం జరుగొద్దనే ఉద్దేశంతో మధ్యవర్తుల ప్రమేయం లేకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ నేరుగా చనిపోయిన రైతు కుటుంబానికి చెందిన నామినీ ఖాతాలోనే డబ్బు జమచేసేలా చర్యలు తీసుకున్నారు. దీంతో ప్రభుత్వ సహాయం లబ్ధిదారులకు నేరుగా అందుతున్నది. ఇలా పారదర్శకంగా బాధితుల ఖాతాలోకి నగదు చేరడంతో వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
నా భర్త అనారోగ్యంతో పదినెలల కిందట మరణించాడు. భర్తలేడన్న బాధ ఉన్నా.. కుటుంబ భారం పడడంతో గుండె ధైర్యంతో కుటుంబాని పోషిస్తూ వచ్చా. మాకు ఎకరా పొలం ఉంది. వ్యవసాయం చేసుకుంటూ సాఫీగా జీవిస్తున్న సమయంలో భర్త చనిపోవడంతో నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. నాకు ముగ్గురు సంతానం. ఆడపిల్లలిద్దరికీ పెండ్లిళ్లు కాగా కొడుకు డిగ్రీ చదువుతున్నాడు. నా భర్త కోసం డబ్బులు బాగా ఖర్చు చేసినా ప్రాణాలు దక్కలేదు. వైద్యం కోసం రూ.3లక్షల దాక ఖర్చు చేశా. ప్రభుత్వం రైతుబీమా ఇవ్వడంతో వైద్యం కోసం చేసిన అప్పు తీర్చిన్నా. మిగిలిన డబ్బు కుటుంబ ఖర్చులకు ఉపయోగిస్తునా. రైతుబీమా మా కుటుంబాకి కొండంత అండనిచ్చింది.
సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతుబీమా పథకం మా కుటుంబానికి కొండంత అండనిచ్చింది. నా భర్త ఐదేండ్ల కిందట చనిపోయాడు. రైతుబీమా నగదు రావడంతో నా బిడ్డ పెండ్లి చేసి కొంత డబ్బుతో ఇల్లు కట్టుకునా. మిగిలిన డబ్బుతో అప్పులు తీర్చేశా. మాకు ఉన్న మూడెకరాల్లో పంటలు సాగుచేస్తున్నా. ఆర్థికంగా చితికిపోయిన మా కుటుంబంలో ఈ పథకం వెలుగులు నింపింది. ఇలాంటి మంచి పథకం ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్కు రైతులతోపాటు మా కుటుంబం కూడా ఎల్లప్పుడూ రుణపడి ఉంటుంది.
– సుశీలమ్మ, జమ్మిచేడ్, గద్వాల
జోగుళాంబ గద్వాల
రైతులు : 2,467
సాయం : రూ.123.35 కోట్లు
పాలమూరు
రైతులు : 3,653
సాయం : రూ.182.65 కోట్లు
నారాయణపేట
రైతులు : 3,415
సాయం : రూ.170.75 కోట్లు
నాగర్కర్నూల్
రైతులు : 4,323
సాయం : రూ.216.15 కోట్లు
వనపర్తి
రైతులు : 2,743
సాయం : రూ.137.15 కోట్లు