ఇన్నాళ్లపాటు సామాన్యుల ఇంట్లో ‘గ్యాస్’మంట రేపిన కేంద్ర ప్రభుత్వం.. ఎన్నికల వేళ కొత్త స్టంట్ ప్రదర్శిస్తున్నది. రూ.400 ఉన్న సిలిండర్ ధర మోదీ సర్కారు అధికారంలోకి వచ్చాక ఆకాశమే హద్దుగా పెరిగిపోయింది. ఆయన హయాంలో గ్యాస్ ధర 13 సార్లు పెరిగింది. 2014లో రూ. 410గా ఉన్న 14.2 కేజీల గ్యాస్ సిలిండర్ ధర ప్రస్తుతం రూ.1200కు చేరువైంది. ఎలక్షన్లు సమీపిస్తున్న నేపథ్యంలో కేవలం రూ.200 మాత్రమే తగ్గించి చేతులు దులుపుకొంటున్నది. ఇప్పటికే సబ్సిడీకి మంగళం పాడగా.. కేవలం రూ.40 మాత్రమే లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తున్నది. ఎన్నికలు ముగిసిన వెంటనే మళ్లీ భారం వేస్తుందని, బీజేపీ సర్కారును నమ్మే పరిస్థితిలో లేమంటూ మహిళలు చెబుతుండడం విశేషం. ఇప్పటివరకు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను ఇష్టం వచ్చినట్లు పెంచి.. ఇప్పుడేమో తగ్గిస్తున్నట్లు కొత్త నాటకాలకు తెరలేపిందని మండిపడుతున్నారు.
మహబూబ్నగర్, ఆగస్టు 30 : పేదల బతుకులు మార్చుతామని ప్రగల్బాలు పలికిన కేంద్రంలోని బీజేపీ సర్కారు వారి బతుకుల్లో మంటపెట్టింది. కాంగ్రెస్ హయాంలో రూ.400 ఉన్న సిలిండర్ ధర అమాంతంగా రూ.1158లకు పెంచేశారు. ప్రస్తుతం పట్టణ ప్రాంతాల్లోనే కాకుండా గ్రామాల్లోనూ సిలిండర్ వినియోగం అంతకంతకు పెరిగిపోయింది. దీనికి తోడు నిత్యావసర సరుకుల ధరలన్నీ విపరీతంగా పెరగడంతో పేద, మధ్య తరగతి ప్రజల నెత్తిన ధరలు గుదిబండలా మా రాయి. ఇన్నాళ్లు పేదల నుంచి ముక్కుపిండి వసూలు చేసిన కేంద్రం పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో సిలిండర్ ధరను రూ.200 తగ్గింపు చేస్తున్నట్లు ప్రకటన చేసింది. మూడింతలు ధరలు పెంచి నేడు మసిపూసి మారెడు కాయ అన్నచందంగా తూతూమంత్రంగా ధరలు తగ్గింపు చేయడంపై వినియోగదారులు పెదవి విరుస్తున్నారు.
ఉన్న సబ్సిడీలు ఎత్తేసి..
జిల్లా వ్యాప్తంగా 1,51,191 గ్యాస్ కనెక్షన్లు ఉం డగా, జిల్లా వ్యాప్తంగా హెచ్పీ, ఇండియన్, భారత్ కంపెనీలకు సంబంధించి 23 ఏజెన్సీల ద్వారా వినియోగదారులకు గ్యాస్ సరఫరా చేస్తున్నారు. గడిచిన తొమ్మిదేండ్లలో సిలిండర్ ధరను అంతకంతకూ పెంచుకుంటూ పోవడమే కాకుండా ఉన్న సబ్సిడీని కూడా ఎత్తివేసింది. సిలిండర్ ధర రూ.1,158 ఉండగా, ఇంటికి చేరవేయడానికి సిబ్బంది అదనంగా వసూలు చేస్తుండడంతో రూ.1,200 వరకు ఒక సిలిండర్ కొనుగోలు చేస్తున్నారు. కేవలం రూ.40.20 పైసలు మాత్రమే సబ్సిడీ లబ్ధిదారుల ఖాతాలో కేంద్రం జమ చేస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తగ్గింపు చేసి ఎన్నికల ప్రకియ ముగిసిన వెంటనే తిరిగి ధరలను పెంచే యోచనలో కేంద్ర సర్కారు ఉన్నట్లు పలువురుపలువురు అభిప్రాయపడుతున్నారు.