Palamuru | మహబూబ్నగర్, మే 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కాంగ్రెస్ చేపట్టిన పీపుల్స్ మార్చ్ యాత్ర పాలమూరు జిల్లాలో జనం లేక వెలవెలబోయింది. నేతల హడావిడి తప్పా.. కార్యకర్తలే కనిపించలేదు. జిల్లాలోకి యాత్ర అడుగుపెట్టగానే పార్టీ నేతల మధ్య విభేదాలు గుప్పుమన్నాయి. ఎవరికి వారు తమ నాయకులకు జై కొట్టించుకోవడం.. తోపులాటలతో భట్టి అవాక్కయ్యారు. యాత్ర చేపట్టిన తన నాయకత్వాన్ని పక్కకు నెట్టి ఎవరికి వారు జేజేలు కొట్టించుకోవడంతో ఆయన ఖంగుతిన్నారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్మార్చ్ పేరిట చేపట్టిన పాదయాత్ర ఈనెల 17న మహబూబ్నగర్ జిల్లాలో అడుగుపెట్టింది. ఎటూ చూసినా పచ్చబడిన పొలాలు కనిపించడంతో.. ప్రాజెక్టులన్నీ తమ వల్లే వచ్చాయని చెప్పే ప్రయత్నం చేసినా జనం నమ్మలేదు. కార్నర్ మీటింగ్లు కూడా జనం లేక వెలవెలబోయాయి.
ఆ పార్టీ నాయకులు వర్గాలుగా విడిపోయి ఎవరికి వారు ఆధిపత్య ధోరణి ప్రదర్శించడంతో ఇది జనంకోసం చేపట్టిన యాత్రేనా? అని వారి కార్యకర్తలే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ మాట్లాడుతున్నప్పుడు జనం వెళ్లిపోవడం.. పాలమూరుకు వచ్చిన రెండ్రోజులకే భట్టికి వడదెబ్బ తగలడంతో బీఆర్ఎస్ నేతలు సెటైర్లు వేశారు. అబద్ధాలు మాట్లాడినందుకే యాత్రకు బ్రేక్ పడిందని.. ఇప్పటికైనా నిజాలు మాట్లాడాలని హితవు పలికారు. తెలంగాణ ఏర్పడ్డాక పాలమూరులో ముఖ్యమంత్రి కేసీఆర్ కాంగ్రెస్ నాయకుల పాపాన్ని కడిగి పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి బీడు భూములను సస్యశ్యామలం చేయడంతో విమర్శలు చేయడానికి వీలులేకుండా పోయిందని ఆ పార్టీ కార్యకర్తలే గుసగుసలాడుతున్నారు.
పీపుల్స్ యాత్ర అనుకున్న మేర సాగకపోవడంతో ఆ పార్టీ నేతలను కలవర పెడుతున్నది. టీపీసీసీ చీఫ్ రేవంత్ సొంతజిల్లాలో తనను కాదని భట్టి యాత్ర చేయడంపై ఆయన అనుచరులు ఆగ్రహంగా ఉన్నారు. రేవంత్ అనుచరులెవరూ మద్దతు ఇవ్వకపోగా.. యాత్రలో పాల్గొనవద్దని తమ అనుచరులకు చెప్పారట. యాత్ర సాగుతున్న జడ్చర్ల నియెజకవకర్గంలోనూ ముగ్గురు నేతల మధ్య ఆధిపత్యపోరు కనిపించింది. భట్టి, జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే మల్లు రవి అన్నదమ్ములు. అయినా కూడా రవి జన సమీకరణ చేయకపోవడం.. అంటిముట్టనట్లుగా ఉండటం చర్చనీయాంశమైంది.
యాత్ర ఖర్చును ఈ నియోజకవర్గానికి చెందిన ఎర్ర శేఖర్, అనిరుధ్రెడ్డి భరిస్తున్నారు. జనాలను, కార్యకర్తలను తీసుకొస్తున్నా భట్టి తమను పట్టించుకోవడం లేదని వారూ అసంతృప్తిలో ఉన్నారు. జడ్చర్ల టికెట్ ఆశిస్తున్న అనిరుధ్రెడ్డి.. కోమటిరెడ్డికి ప్రధాన అనుచరుడు. ఆయన టికెట్ ఇప్పిస్తారనే నమ్మకంతోనే పార్టీ ఖర్చులు మోస్తున్నారని అనచరులు అంటున్నారు. కాగా ఎర్ర శేఖర్ టీడీపీ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి.. పార్టీలన్నీ తిరిగి రేవంత్ పీసీసీ చీఫ్ అయ్యాక కాంగ్రెస్లో చేరి ప్రస్తుతం జడ్చర్ల నియెజకవర్గంపై దృష్టి పెట్టారు. ఇదివరకే ఉన్న నేతలు ఎర్ర శేఖర్ను వ్యతిరేకిస్తున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య పోరుతో పార్టీ నవ్వుల పాలవుతున్నది. మొత్తంపైన భట్టి పాదయాత్రకు రేవంత్రెడ్డి అడ్డుపడుతున్నాడనే టాక్ వినిపిస్తోంది.
55 ఏండ్ల పాటు కేంద్రం, రాష్ర్టాన్ని పాలించిన కాంగ్రెస్.. పాలమూరు జిల్లాపై తీవ్ర వివక్షత చూపించింది. రెండు జీవనదులు ప్రవహిస్తున్నా గుక్కెడు మంచినీళ్లు దొరకని పరిస్థితికి తీసుకొచ్చిందని విమర్శలూ ఉన్నాయి. సాగునీరు అందించే వీలున్నా జిల్లా ప్రజలను దగా చేశారు. 285 టీఎంసీల సామర్థ్యం ఉన్న శ్రీశైలాన్ని కాదని.. 9 టీఎంసీలు ఉన్న జూరాల ప్రాజెక్టుకు డిజైన్ చేసి ప్రజల నోళ్లల్లో మట్టిగొట్టారని బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. ప్రాజెక్టులన్నీ పెండింగ్లో పెట్టి ఆంధ్రాకు పోతిరెడ్డిపాడు ద్వారా అక్రమంగా నీళ్లు తీసుకుపోయినప్పుడు కాంగ్రెస్ నేతలు ఎందుకు నోరు మెదపలేదని ప్రశ్నిస్తున్నారు. ఏటా 14లక్షల మంది వలస పోతుంటే ఆపే ప్రయత్నం చేయకపోగా.. ఉపాధి, సాగునీరు లేక పొలాలన్నీ బీళ్లుగా మారినా పట్టించుకోకుండా వలస జిల్లాగా మార్చారని దుయ్యబట్టారు. ఆనాటి కాంగ్రెస్ నేతల పాపమే పాలమూరుకు శాపంగా మారిందని అంటున్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రా పాలకులకు భయపడి పాలమూరు జిల్లా ప్రాజెక్టుల గురించి మాట్లాడని కాంగ్రెస్ నేతలు.. ప్రారంభానికి సిద్ధమవుతున్న పాలమూరు ఎత్తిపోతలపై అనవసరంగా మాట్లాడుతుండడంతో బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. పీఆర్ఎల్ఐపై భట్టి అనవసర వ్యాఖ్యలు చేయడంతో మంత్రి నిరంజన్రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పాలమూరు చరిత్ర గురించి తెలుసుకొని మాట్లాడాలని హితవుపలికారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలలో భాగంగా ఉదండాపూర్ రిజర్వాయర్ వద్ద జరుగుతున్న పనులను చూసేందుకు వెళ్లిన భట్టికి.. 80శాతం పనులు పూర్తయ్యాయని.. మూడునెలల్లో రిజర్వాయర్ను నింపుతామని అధికారులు వివరించారు.
పాదయాత్ర సందర్భంగా జడ్చర్ల పట్టణంలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న నేతలంతా తామే సీఎం అభ్యర్థులమని ప్రకటించుకోవడంతో కార్యకర్తలు ఖంగుతిన్నారు. రేవంత్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఉత్తమ్కుమార్రెడ్డి వెంట వచ్చిన అనుచరులు బహిరంగ వేదిక వద్ద కాబోయే సీఎం అని నినాదాలు చేయించుకున్నారు. దీంతో భట్టి ఆ పార్టీ నేతల ముందు పార్టీ ఒకే అంటే తానే సీఎం అవుతానని అనడంతో మిగతా నేతలకు రుచించలేదు. వీహెచ్ జోక్యం చేసుకొని సీఎం ఎవరు కావాలో సోనియమ్మ, రాహుల్, ఖర్గే నిర్ణయిస్తారని అందరికీ చురక అంటించారు. మరోవైపు నేతలంతా మాట్లాడుతుండగానే కార్యకర్తలు సభ నుంచి వెళ్లిపోవడం కనిపించింది.