పాలమూరుకు పండుగ రోజొచ్చింది. దశాబ్దాల కరువు కోరలను తరిమే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఉమ్మడి పాలమూరులో 10 లక్షలు, రంగారెడ్డి, నల్లగొండలో 2.30 లక్షల ఎకరాలకు సాగు, తాగునీటినీ, పరిశ్రమలకూ నీళ్లను అందిస్తూ దక్షిణ తెలంగాణ వరప్రదాయినిగా మారే పాలమూరు ఎత్తిపోతల పథకం శనివారం అపర భగీరథుడు, సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభం కానున్నది. దీంతో ఉమ్మడి పాలమూరు ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతుండగా కొల్లాపూర్లో నిర్వహించే భారీ బహిరంగ సభకు లక్షలాదిగా జనం తరలిరానున్నారు. ఫలితంగా ఉమ్మడి పాలమూరు పల్లెల్లో సంబురాలు అంబరాన్నంటనున్నాయి.
– నాగర్కర్నూల్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ)
దక్షిణ తెలంగాణ వరప్రదాయినిగా, ఉమ్మడి పాలమూరు జిల్లాను కోనసీమలా మార్చే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం శనివారం సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభం కానున్నది. ఈ పథకంలో భాగంగా కొల్లాపూర్ మండలం నార్లాపూర్, ఏదుల(వనపర్తి), వట్టెం(బిజినేపల్లి-నాగర్కర్నూల్), కరివెన(మహబూబ్నగర్), ఉదండాపూర్(మహబూబ్నగర్), రిజర్వాయర్లను దాదాపుగా 70 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించారు. వచ్చే నెలలో కరివెన రిజర్వాయర్ వరకు సాగునీరు అందించేలా ఇంజినీరింగ్ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. అనంతరం ఉదండాపూర్కు కృష్ణా జలాలు అందనున్నాయి. ఇందులో భాగంగా శనివారం సీఎం కేసీఆర్ నార్లాపూర్ వద్ద లిఫ్టు పనులను ప్రారంభిస్తారు. ఇలా 8.51 టీఎంసీల సామర్థ్యమున్న నార్లాపూర్ జలాశయం నుంచి రెండు వారాల్లో ఏదుల (5.91 టీఎంసీలు)కు అక్కడి నుంచి వట్టెం(16.74 టీఎంసీలు)కు నీటిని ఎత్తిపోస్తారు. ఇలా నార్లాపూర్ నుంచి కరివెనకు(17.34టీఎంసీలు) 45రోజుల్లో విడుతల వారీగా నీటి పంపింగ్ చేపట్టనున్నారు. ఈ ప్రాజెక్టులోను దాదాపుగా 70 టీఎంసీల సామర్థ్యంతో నిర్మాణం అవుతుండగా, యాసంగి నాటికి పాలమూరు ప్రజలకు కృష్ణా జలాలు అందుబాటులోకి రానున్నాయి.
35 మోటర్లు.. 90 టీఎంసీలు
పాలమూరు ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన లిఫ్ట్-1లో 8+1, ఏదుల, వట్టెం రిజర్వాయర్ల వద్ద 9+1, ఉదండాపూర్ రిజర్వాయర్ వద్ద 5+1 మోటర్లను ఏర్పాటు చేయనుండగా.. 8 మాత్రమే పంపింగ్కు వినియోగించనున్నారు. ఒకటి చొప్పున ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేస్తున్నారు. ఈ లిఫ్టుల్లో ఒక్కో మోటరు సామర్థ్యం 145 మెగావాట్లు కాగా నార్లాపూర్లో ఒక్కో మోటర్ 85 క్యూసెక్కులను, మిగిలిన లిఫ్టుల్లో 75 క్యూసెక్కుల చొప్పున నీళ్లను ఎత్తిపోయనున్నాయి. ఇలా రోజుకు 1.5 టీఎంసీల చొప్పున శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి 60 రోజుల్లో 90 టీఎంసీలను ఎత్తిపోసేలా ప్రాజెక్టు అందుబాటులోకి రానుండటం విశేషం. ఇక ప్రాజెక్టు పనులకు అవసరమైన విద్యుత్ కోసం నాలుగు 400 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్లను సైతం రూ.2 వేల కోట్లకుపైగా నిధులతో పూర్తి చేయడం, చార్జింగ్ ప్రక్రియ పూర్తయింది.
జాతికి అంకితం
నార్లాపూర్ వద్ద నీటిని ఎత్తిపోసేందుకు పంపును సిద్ధంగా ఉంచారు. ఈనెల 3వ తేదీన డ్రైరన్.. ఆ తర్వాత టెస్టింగ్ రన్ విజయవంతమైంది. సీఎం చేతులమీదుగా ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. శనివారం నార్లాపూర్ లిఫ్టు వద్దకు చేరుకొని సీఎం స్వయంగా మోటర్ను ప్రారంభిస్తారు. ఈ ప్రాజెక్టులో కాళేశ్వరాన్ని మించిన సామర్థ్యం గల మోటర్లను బిగించడంతో నీటి ఎత్తిపోతల శరవేగంగా జరగనున్నది. ఇక ఈ ప్రాజెక్టు అందుబాటులోకి రానుండటంతో పాలమూరు కోనసీమగా మారనున్నది. ఇప్పటికే ఉన్న ప్రాజెక్టులతో సాగునీరు అందని భూములకు ఈ ప్రాజెక్టు ద్వారా కృష్ణా జలాలు అందనున్నాయి. ఫలితంగా రాబోయే కాలంలో సాగునీటికి కష్టాలు శాశ్వతంగా తీరనున్నాయి. రిజర్వాయర్లతో పరిసర ప్రాంతాల్లోనూ భూగర్భ జలమట్టాలు పెరుగుతాయి. ఫలితంగా గ్రామాలు, పట్టణాల్లోనూ తక్కువ మట్టంలోనే బోర్లలో నీళ్లు వచ్చే అవకాశం ఉన్నది.
12.30 లక్షల ఎకరాలకు సాగునీరు
పాలమూరు ప్రజల సాగు,తాగునీటి కష్టాలను తీర్చేందుకు సీఎం కేసీఆర్ పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం చేపట్టారు. దీంతో ఉమ్మడి పాలమూరులో 10 లక్షల ఎకరాలకు, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలో 2.30 లక్షల ఎకరాలకు సాగునీరు అందించనున్నారు. అలాంటి బృహత్తర పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. కొల్లాపూర్ మండలం నార్లాపూర్లో 6.51 టీఎంసీల సామర్థ్యంతో ప్రాజెక్టులో భాగంగా మొదటి లిఫ్టుగా అంజనగిరిని రూ.5 వేల కోట్లతో నిర్మిస్తున్నారు. పనులు దాదాపుగా పూర్తయ్యాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా అమలు చేస్తున్న మిషన్ భగీరథ పథకంతో గ్రామాలు, పట్టణాల్లో ప్రజలకు శుద్ధజలం అందించనున్నారు. అలాంటి ఈ పథకానికి ప్రస్తుతం ఎంజీకేఎల్ఐలో భాగంగా నిర్మించిన ఎల్లూరు జలాశయం నుంచి నీటిని అందిస్తున్నారు. ఈ జలాశయం సామర్థ్యం కేవలం 0.35 టీఎంసీలు. కాగా ఇకపై అంజనగిరి రిజర్వాయర్ ద్వారా మిషన్ భగీరథకు నీళ్లు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. ఇందులో భాగంగా రూ.140 కోట్లతో ప్రత్యేకంగా పైపులైన్ పనులను చేపడుతున్నారు. ఇందుకోసం కొల్లాపూర్ మండలంలోని సున్నపుతండా దగ్గరున్న నార్లాపూర్ జలాశయం హెడ్రెగ్యులేటరీ నుంచి 1.20 కిలో మీటర్ల మేర భగీరథ పథకం ఇన్టేక్వెల్లోకి నీటిని తరలించడం జరుగుతున్నది.
ఈ పనుల కోసం ప్రభుత్వం రూ.140 కోట్లను మంజూరు చేసింది. దీంతో పైపులైన్ వేసే పనులను చేపడుతున్నారు. అలాగే ప్రత్యేకంగా తూం కూడా అందుబాటులోకి రానున్నది. డిసెంబర్ నాటికి ఈ పనులన్నీ పూర్తి చేసేలా ప్రభుత్వం ఇప్పటికే లక్ష్యం నిర్దేశించింది. దీంతో గడువులోగా పనులు పూర్తయ్యేలా ఇంజినీరుల చర్యలు తీసుకుంటున్నారు. కాగా వచ్చే వేసవి నాటికి పనులు పూర్తయ్యే అవకాశాలున్నట్లుగా తెలుస్తున్నది. నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి కాల్వల ద్వారా ఎల్లూరు రిజర్వాయర్కు నీటిని తరలించి అక్కడి నుంచి మిషన్ భగీరథ పథకంలోని ఇన్టేక్వెల్ని నింపనున్నారు. దీనివల్ల మిషన్ భగీరథకు నీటి సమస్య తీరనున్నది. ఎల్లూరు రిజర్వాయర్ సామర్థ్యం 0.35 టీఎంసీలే కాగా నార్లాపూర్ ఏకంగా 6.51 టీఎంసీలు కావడంతో తాగునీటి సమస్య ఇక పూర్తిగా కనుమరుగు కానున్నది. ప్రస్తుతం మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ మంచినీళ్లు అందడంలో అప్పుడప్పుడూ సమస్యలు తలెత్తుతున్నాయి. వర్షాభావ సమస్యలు ఏర్పడితే శ్రీశైలం బ్యాక్ వాటర్లో నీళ్లు లేక మిషన్ భగీరథకు ముఖ్యంగా ఎండాకాలంలో తాగునీటి సమస్య కలుగుతున్నది. దీనికోసం శ్రీశైలం బ్యాక్వాటర్ను రివర్స్ పంపింగ్ ద్వారా తిరిగి ఎత్తిపోస్తూ తాత్కాలికంగా మిషన్ భగీరథకు నీటి సమస్య లేకుండా ఏర్పాట్లు చేపడుతున్నారు. ఇప్పుడు పది రోజులకోసారి భగీరథకు నీటి సరఫరా జరుగుతోంది.
నార్లాపూర్ ద్వారా నీటి విడుదల ప్రారంభమైతే ఎప్పుడూ 2 టీఎంసీల నీళ్లు రిజర్వుగా నీళ్లు ఉండటంతో ఉండటంతో మిషన్ భగీరథకు నీటి లభ్యత పెరుగనున్నది. వేసవిలో రివర్స్ పంపింగ్ చేపట్టాల్సిన అవసరం ఉండదు. దీనివల్ల ఎండాకాలంలో కూడా తాగునీటి సమస్యకు ఢోకా తీరనున్నది. మొత్తం మీద పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో సాగునీటితో పాటుగా తాగునీటికి శాశ్వత చెల్లుచీటి ఇవ్వనుంది. ఫలితంగా ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రజలకు నిరంతరం స్వచ్ఛమైన నీళ్లు సరఫరా అవుతూనే ఉంటాయి. ఇక పరిశ్రమలకు సైతం 3టీఎంసీలకుపైగా నీటిని అందించేలా ఏర్పాట్లు తీసుకోవడం గమనార్హం. ఫలితంగా ఎంజీకేఎల్ఐ వల్ల సాగు, తాగునీటి సమస్యతో పాటుగా పరిశ్రమలకూ లబ్ది చేకూరనుంది. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా నార్లాపూర్ లిఫ్టు ప్రారంభం కానుండటంతో వచ్చే నెల చివరి నాటికి కరివెన వరకు కృష్ణా జలాలు పరుగులు పెడుతాయి. మొత్తం మీద ఈ యాసంగికే పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు ద్వారా సాగునీళ్లు పాలమూరు భూములను తాకనుండటం విశేషం. దీంతో పాలమూరు ప్రజలంతా సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలుపుతున్నారు.
సీఎం కేసీఆర్ వల్లే పూర్తి
సీఎం కేసీఆర్కు పాలమూరు ప్రజలపై ఉన్న ప్రేమ వల్లే పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తవుతోంది. కరువుకు నిలయమై, ముంబయి. పుణె, దేశంలోని మారుమూలల్లో వలస కూలీలుగా పేరుబడ్డ పాలమూరు దశ-దిశను మార్చేందుకు ఉద్యమ కాలంలో ఇచ్చిన హామీ మేరకు ఈ ప్రాజెక్టును సీఎం కేసీఆరే స్వయంగా డిజైన్ చేశారు. తెలంగాణ ఏర్పడటం, అధికారంలోకి వచ్చిన ఏడాదిలో 2015లోనే ప్రాజెక్టుకు సీఎం కేసీఆర్ రూ.35 వేల కోట్లతో శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత మారిన ధరల ప్రకారం భారమైనా చివరికి రూ.52 వేల కోట్ల బడ్జెట్తోనూ ప్రాజెక్టును పూర్తి చేయిస్తుండటం విశేషం. ఈ ప్రాజెక్టు పనులను స్వయంగా నాలుగేళ్ల కిందట సీఎం కేసీఆర్ పరిశీలించారు. ప్రత్యకంగా సీఎంవో, ఇరిగేషన్ అధికారులను, మంత్రులకు ఆదేశాలిస్తూ పనుల్లో వేగం పెంచేలా పర్యవేక్షించారు. కాంగ్రెస్తో పాటుగా ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టును ఆపేందుకు వేసిన 40 కేసులను అధిగమించేలా స్వయంగా సీఎం ప్రధాన భూమిక పోషించారు. ఈ ప్రాజెక్టును గడువులోగా పూర్తి చేయించేందుకు సీఎం కేసీఆర్ తీసుకున్న చర్యల ఫలితమే నార్లాపూర్ రిజర్వాయర్ ప్రారంభానికి సిద్ధం కావడం నిదర్శనం. కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి ఇవ్వకున్నా ప్రభుత్వ నిధులతో ప్రాజెక్టు పూర్తి చేయడం జిల్లా ప్రజలపై సీఎం కేసీఆర్కు ఉన్న ప్రేమను చాటి చెబుతున్నది.
నేడు భారీ బహిరంగ సభ
నార్లాపూర్ రిజర్వాయర్ను సీఎం కేసీఆర్ శనివారం ప్రారంభిస్తుండటంతో కొల్లాపూర్లోని బొంగురాల మిట్ట వద్ద భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభకు ఉమ్మడి పాలమూరు నుంచి లక్షన్నరకుపైగా ప్రజలు తరలిరానున్నారు. పాలమూరు జిల్లా ప్రజలకు ఇది పండుగ రోజుగా భావిస్తున్నారు. కొల్లాపూర్ సమీపంలోని సింగోటం రోడ్డులో జరిగే సభను విజయవంతం చేసేందుకు మంత్రులు సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, శ్రీనివాస్గౌడ్తో పాటుగా స్థానిక శాసన సభ్యులు బీరం హర్షవర్ధన్రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకొన్నారు. సభకు తరలివచ్చే ప్రజలకు, అధికారులు, నాయకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేపట్టారు. వారం రోజుల నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు పనులను నిత్యం స్వయంగా పరిశీలిస్తున్నారు. పాలమూరు ప్రాజెక్టుపై కాంగ్రెస్, బీజేపీలు చేసిన దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేలా ఈ సభ రాష్ట్రంలోనే ప్రత్యేకంగా నిలవనున్నది. ప్రాజెక్టుకు ప్రభుత్వం చేపట్టిన కృషిని ఈ సభ ద్వారా ప్రజలకు వివరించనున్నారు. ఇక సీఎం కేసీఆర్ ఈ సభలో చేసే ప్రసంగంపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొన్నది.
సీఎం కేసీఆర్ వల్లే సాధ్యం : బీరం హర్షవర్ధన్రెడ్డి, ఎమ్మెల్యే, కొల్లాపూర్
సీఎం కేసీఆర్ పట్టుదలతోనే పాలమూరు ఎత్తిపోతల పథకం పూర్తయ్యింది. పాలమూరు ప్రజలపై సీఎం కేసీఆర్కు ఎంతో ప్రేమ ఉంది. పాలమూరు ప్రజల ఓట్లను చెప్పుకొని నాటి పాలకులు అధికారంలోకి వస్తే సీఎం కేసీఆర్ మాత్రం జిల్లాలోని కరువును దూరం చేశారు. కృష్ణానది పక్కనే ఉన్నా కొల్లాపూర్కు కనీసం గుక్కెడు తాగునీళ్లు అందని పరిస్థితులు ఉంటే ఇప్పుడు హైదరాబాద్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలకు సైతం సాగునీళ్లు, పరిశ్రమలకూ నీటిని అందించేలా ప్రాజెక్టును తీర్చిదిద్దిన ఘనత ఆయనదే.. రాబోయే కాలంలో కొల్లాపూర్ నియోజకవర్గం రాష్ట్రంలోనే ప్రత్యకంగా నిలవడం ఖాయం. నార్లాపూర్ లిఫ్టును శనివారం సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారు. అనంతరం జరిగే సభకు ఏర్పాట్లు పూర్తి చేశాం. లక్షలాది మంది ప్రజలు స్వచ్ఛందంగా ప్రాజెక్టును చూసేందుకు, సీఎం కేసీఆర్ మాటలను వినేందుకు ఉమ్మడి పాలమూరు నుంచి కొల్లాపూర్కు తరలి వస్తున్నారు.
పాలమూరు ప్రజలకు పండుగ : మర్రి జనార్దన్రెడ్డి, ఎమ్మెల్యే నాగర్కర్నూల్
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రారంభమవుతున్న రోజు పాలమూరు ప్రజలకు పండుగ రోజు. చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో అద్భుతంగా ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకోవడం గర్వకారణం. సీఎం కేసీఆర్ కృతనిశ్చయం వల్లే ప్రాజెక్టు ప్రారంభమవుతోంది. 2.50 టీఎంసీల ఎంజీకేఎల్ఐ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు నాటి పాలకులు దశాబ్దానికిపైగా సమయం తీసుకుంటే అంతకంటే తక్కువ వ్యవధిలోనే 40 కేసులను అధిగమించి 70 టీఎంసీల ప్రాజెక్టు పూర్తి చేయించడం సీఎం కేసీఆర్ దార్శనికతకు నిదర్శనం. పాలమూరు ప్రజలు సీఎం కేసీఆర్ను తరతరాలుగా గుర్తుంచుకుంటారు.
వేసవి నాటిని పనులు పూర్తి : సుధాకర్సింగ్, ఈఈ , కొల్లాపూర్
పాలమూరు ఎత్తిపోతల పనుల్లో భాగంగా నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి ఎల్లూరు రిజర్వాయర్కు నీటిని తరలించి అక్కడి నుంచి మిషన్ భగీరథ ప్లాంట్కు నీటిని అందించే పనులు చేపడుతున్నాం. దీనికోసం ప్రభుత్వం రూ.140 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో ప్రత్యేకంగా పైపులైన్ పనులు చేపడుతున్నాం. వచ్చే వేసవి నాటికి ఈ పనులు పూర్తవుతాయి. ఈ పనులు పూర్తయితే ఎండాకాలంలో శ్రీశైలం నుంచి రివర్స్ పంపింగ్ చేయాల్సిన అవసరం ఉండదు. మిషన్ భగీరథకు నీళ్లు పుష్కలంగా లభిస్తాయి. తాగునీటి సమస్య శాశ్వతంగా తీరనున్నది.