ఊరూరా పండుగలా కంటి వెలుగు కొనసాగుతున్నది. పల్లె, పట్నం అన్న తేడా లేకుండా నేత్ర పరీక్షల సందడే నెలకొన్నది. రెండ్రోజులుగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 46,025 మందికి పరీక్షలు నిర్వహించగా.. 18,492 మందికి కంటి అద్దాలు పంపిణీ చేశారు. శిబిరాల వద్ద ఉదయం నుంచే ప్రజలు బారులుదీరారు. స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించిన అనంతరం కంటి సమస్యలున్న వారికి మందులు, అద్దాలు పంపిణీ చేశారు. లోపాలున్న వారిని ఆపరేషన్లకు రెఫర్ చేశారు. పెబ్బేరు, పెద్దమందడిలో మంత్రి నిరంజన్రెడ్డి క్యాంపులను పరిశీలించగా.. ఆయా జిల్లాల కలెక్టర్లు తనిఖీలు నిర్వహించారు. అద్దాలు అందుకున్న వారు ఆనందం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్కు రుణపడి ఉంటామని కృతజ్ఞతలు తెలిపారు.
– మహబూబ్నగర్ జనవరి 20 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి)
మహబూబ్నగర్ జనవరి 20 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కంటివెలుగు కార్యక్రమం రెండోరోజు విజయవంతమైనది. ఆయా జిల్లాలో వైద్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బృందాలు వైద్య శిబిరాలకు వెళ్లి పరీక్షించారు. కంటి చూపు మందగించిన వారితోపాటు చూపు సమస్యలు ఉన్న వారందరికీ పరీక్షలు నిర్వహించారు. అవసరం ఉన్నవారికి ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేసిన కండ్లద్దాలను అందజేశారు. శుక్రవారం వనపర్తి జిల్లా పెబ్బేరులో వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి కంటి వెలుగు కేంద్రాన్ని పరిశీలించారు. వచ్చిన వారితో ముచ్చటించారు.
ప్రభుత్వం సరఫరా చేసే కండ్లద్దాలు చాలా బాగున్నాయని ప్రశంసలు కురిపించారు. అదేవిధంగా ఆయా జిల్లా కేంద్రాలతోపాటు మండలకేంద్రాల్లో కలెక్టర్లు తనిఖీలు చేశారు. వైద్యసిబ్బందికి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. కంటి శిబిరాలకు వచ్చే వారందరి ప్రొఫైల్స్ను జాగ్రత్తగా ఎంట్రీ చేయాలని ఆదేశించారు. కంటి సమస్యలు తీవ్రంగా ఉన్నవారికి శస్త్రచికిత్స నిమిత్తం సిఫార్సు చేస్తున్నారు. ఒకటికి రెండుసార్లు క్షుణ్ణంగా పరీక్షించాలని వైద్యులను సూచించారు. జిల్లా వైద్యశాఖ అధికారులు కూడా వైద్య శిబిరాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన మందులు, కంటి అద్దాలను సిద్ధంగా ఉంచుతున్నారు.
శిబిరాలకు వచ్చే వారికి ప్రభుత్వమే మంచినీళ్లు తదితర సౌకర్యాలు కల్పించడంతో వృద్ధులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు క్యూలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వైద్య శిబిరాలకు వచ్చేవారిని పంచాయతీ కార్యదర్శులు ఇతర సిబ్బంది దగ్గరుండి పరీక్షలు చేయించి పంపిస్తున్నారు. మరికొన్నిచోట్ల శిబిరాలకు రావడానికి బీఆర్ఎస్ నాయకులు రవాణా సౌకర్యం కూడా కల్పిస్తున్నారు. ప్రతి గ్రామంలో, మండలకేంద్రంలో కంటి వైద్యశిబిరాలు నిరంతరంగా పనిచేస్తాయని ఆయా జిల్లాల కలెక్టర్లు వెల్లడించారు. కంటిచూపు సమస్య ఉన్న ప్రతిఒక్కరూ కంటి వెలుగు కార్యక్రమం ఉపయోగించుకోవాలని కోరుతున్నారు. మరోవైపు ప్రజాప్రతినిధులు కూడా కంటి వైద్య శిబిరాలను సందర్శించి కార్యక్రమం విజయవంతం చేయాలని గ్రామాల్లో కోరుతున్నారు.
మంచి కార్యక్రమం
రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి కంటి అద్దాలు, మం దులివ్వడం హర్షణీయం. మా గ్రామంలో ఏర్పాటు చేసిన కంటివెలుగు శిబిరంలో కంటి పరీక్షలు చేయించుకున్నాను. చాలా మంచి కార్యక్రమం.
– శ్రీశైలం, బాలానగర్
దేశం మొత్తం చేయాలి
సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ఈ పథకం దేశమంతా ఉంటే బాగుంటది. ఇంతకుమునుపు నాకు దగ్గరగా చూడడానికి చూపు లేకుండే.. అప్పుడు కండ్లద్దాలు ఇచ్చిండ్రు. కంటి పరీక్షలు చేసిండ్రు. ఆపరేషన్కు రాసిండ్రు. కంటివెలుగు పథకం బాగుంది.
– తెలుగుకుక్క గోపాల్, కొల్లాపూర్
చాలా బాగా చూస్తున్నారు
డాక్టర్లు చాలా బాగా చూస్తున్నారు. పైసలు తీసుకోకుండా మందులిస్తున్నారు. సీఎం కేసీఆర్ సారు చాలా మంచి నిర్ణయం తీసుకున్నాడు. అడగకముందే అన్నీ ఇస్తున్న సారు రుణం తీర్చుకోలేం.
– గొల్ల లక్ష్మమ్మ, హస్నాపూర్
20 ఏండ్లుగా బాధపడుతున్న..
20ఏండ్లుగా కంటి సమస్యతో బాధపడుతున్నాను. నాలుగేండ్ల కిందట ప్రైవేట్ దవాఖానాలో చూపించాను. డబ్బులు లేక మళ్లీ దవాఖానకు వెళ్లలేకపోయాను. సీఎం కేసీఆర్ కంటి వెలుగు శిబిరం పెట్టడంతో డాక్టర్లు కంటి పరీక్ష చేసి అద్దాలు ఇచ్చారు. మాలాంటి పేదోళ్లకు కంటి పరీక్షలు చేయించి చూపు కల్పిస్తున్న గవర్నమెంట్ మంచి కార్యక్రమం చేపట్టింది. ఇప్పుడు కండ్లు బాగా కనిపిస్తున్నాయి. సీఎం కేసీఆర్ సారు సల్లంగా ఉండాలి.
– హఫీజాబేగం, కావేరమ్మపేట
ఖర్చు లేకుండా అద్దాలు
కంటి వెలుగు శిబిరంలో కంటి పరీక్షలు చేయించుకున్నాను. ఖర్చు లేకుండా పరీక్షలు చేసి అద్దాలు ఇచ్చారు. ఉచితంగా పరీక్షలు చేయించి అద్దాలు అందిస్తున్న సర్కార్కు కృతజ్ఞతలు
– మంద కోదండరాంరెడ్డి, గోపాల్పేట
సద్వినియోగం చేసుకోవాలి
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కంటి పరీక్షలు నిర్వహిస్తున్నది. ప్రజలు కంటివెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రతిరోజూ వార్డుల వారీగా ఉదయం 9నుంచి సాయంత్రం 4గంటల వరకు పరీక్షలు చేస్తున్నారు.
– సూర్యప్రకాశ్రెడ్డి, సర్పంచ్ ఊట్కూర్
మెరుగుపడుతుంది
ప్రభుత్వం చేపట్టిన కంటివెలుగు కార్యక్రమం ద్వారా ప్రజలకు కంటిచూపు మెరుగుపడుతుంది. ఎలాంటి ఖర్చు లేకుండా కంటి పరీక్షలు నిర్వహించి ఉచితంగా కంటి అద్దాలు అందిస్తున్న సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం.
– వన్నె శంకర్, మక్తల్
మంచి పనిచేస్తున్నారు
కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి సీఎం కేసీఆర్ సారు మంచి పనిచేశాడు. లేకుంటే మాలాంటోళ్లు చాలా ఇబ్బందిపడేవారు. అద్దాలు, మందులు ఉచితంగా ఇస్తుండు. ఇంతకంటే ఏం కావాలి.
– హుస్సేన్పీర్, గద్వాల