అచ్చంపేటరూరల్, జూలై 1 : నల్లమల అటవీప్రాంతం మూరుమూల ఏజెన్సీ గ్రామం అక్కారం గ్రామ పంచాయతీ క్రీడాప్రాంగణంలో ప్లాట్లు వెలిసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామస్తుల కథనం మేరకు అక్కారం గ్రామ పంచాయతీలో సర్వేనెంబర్ 102లో రెండు ఎకరాల భూమి ప్రధాన రహదారికి దగ్గరలో ఉండగా కేసీఆర్ ప్రభుత్వ హయాంలో అందులో గ్రామ యువకుల కోసం క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు. అయితే కాంగ్రె స్ ప్రభుత్వం అధికారంలో రాగానే అధికార పారీ సర్పంచ్ కొర్ర లాలు గ్రామ పంచాయతీ తీర్మానం లేకుండానే అక్రమంగా క్రీడా ప్రాంగణాన్ని తొలగించి గ్రామ కంఠ భూమిని ప్లాట్లుగా మార్చి గుంటకు రూ.30వేల చొప్పున అమ్మకానికి పెడుతున్నారని గ్రామస్తులు ఆరోపించారు.
దీనిపై గ్రామస్తులంతా ఏకమై క్రీడా ప్రాంగణ స్థల విషయంపై సర్పంచ్ వ్యవహారంపై బుధవారం నిలదీశారు. దీంతో సర్పంచ్ నేను గత ఎన్నికల్లో భారీగా డబ్బులను ఖర్చు చేశానని ఆ నష్టాన్ని పూడ్చుకొనేందుకు నేను ప్రభు త్వ భూమిని ఒక్కొక్కరికి ఒక రేటున అమ్ము కుంటానని చెప్పినట్లు గ్రామస్తులు ఆరోపించారు. గ్రామ పంచాయతీ తీర్మానం లేకుండానే ఎలా క్రీడా ప్రాంగాణాన్ని తొలగిస్తారని రెండునెలలుగా పంచాయతీ కార్యదర్శి లేడని అధికారికంగా రెవెన్యూ, ఎంపీడీవో అధికారుల లిఖితపూర్వక హామీ పత్రం లేకుండా ఏకపక్ష నిర్ణయాలు ఎలా తీసుకుంటారనే చర్చ అక్కారం గ్రామంలో మొదలైంది. అసలైన లబ్ధిదారులకు ప్రభుత్వం స్థలంలో ఇండ్లు కేటాయించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
ప్లాట్ల అమ్మకం ఆరోపణలో వాస్తవం లేదు : సర్పంచ్
గ్రామంలోని 102 సర్వే నెంబర్ ప్రభుత్వ భూమిలో ప్లాట్ల విక్రయంలో డబ్బులు తీసుకోవడం అనేది అవాస్తవమని అక్కారం సర్పంచ్ కొర్రలాలు పేర్కొన్నారు. గ్రామంలో ఇల్లు లేని 70 మంది పేదలను గుర్తించామని పోటీ ఎక్కువ ఉండడంతో గ్రామసభలో లబ్ధిదారులను ఎంపిక చేస్తామన్నారు. కొంద రు కావాలనే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. క్రీడా ప్రాంగణంలో ఇండ్ల స్థలాల కోసం గ్రామ పంచాయతీ తీర్మానం చేశారా అని రెండునెలల కింద ట ఇక్కడ పనిచేసి బదిలీపై వెళ్లిన పంచాయతీ కార్యదర్శి సాయిరాంను వివరణ కోరగా తన హయాంలో ఎటువంటి తీర్మానం చేయలేదని ఫోన్లో సమాధానమిచ్చారు. క్రీడా ప్రాంగణాన్ని తొలగించి గ్రామ కంఠ భూమిలో ఇండ్ల ప్లాట్లను ఏర్పాటు చేసిన విషయంపై కలెక్టర్ తగు చర్యలు తీసుకొని అందరికీ న్యాయం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు,