జడ్చర్ల టౌన్, జనవరి 21 : తపాలా శాఖ నుంచి ప్రజలకు చేరాల్సిన ఆధార్ కార్డులు, ఏటీఏం కార్డులు, వాహనాలకు సంబంధించిన చలానాలు, ఇతర ఉత్తరాలను చెరువునీటిలో పడేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. రూ.వందలు ఖర్చు చేసి ఆధార్కార్డులకు దరఖాస్తు చేసుకున్న వారందరూ ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న తపాలాశాఖ సిబ్బంది మాత్రం నిర్లక్ష్యం వహించారనడానికి ఈ ఘటనే నిదర్శనం.. వీటన్నింటినీ చెరువులో పడేయటంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వివరాలు ఇలా.. మున్సిపాలిటీలోని నాగసాల గ్రామ శివారులోని ఉన్న కుంట చెరువు వద్ద పోస్టల్శాఖకు సంబంధించిన ఆధార్ కార్డులు, ఏటీఏం కార్డులు, లైసెన్సులు, ఇతర ఉత్తరాలు వందలాదిగా కట్టలు.. కట్టలుగా పడ్డాయి. గుర్తించిన స్థానికులు వెంటనే పోలీస్, రెవెన్యూ శాఖ అధికారులకు సమాచారం అందజేశారు. విషయం తెలుసుకున్న తాసిల్దార్ లక్ష్మీనారాయణ చెరువు వద్దకు చేరుకొని వాటిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నాగసాల గ్రామ పంచాయతీ కార్యాలయ గదిలో భద్రపరిచారు.
రెండేండ్ల కిందటి నుంచి ఆధార్ కార్డులు, విలువైన పత్రాలను ప్రజలకు చేరవేయకుండా పోస్టల్ సిబ్బంది నిర్లక్ష్యం వహించారు. వీటిలో కాలం చెల్లినవి, కాలం చెల్లనివి వందల కొద్దీ ఉన్నాయి. తపాలాశాఖ సిబ్బంది తీరుతో ఎందరో నష్టపోయారని పలువురు పేర్కొన్నారు. ఇందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు. కాగా కలెక్టర్ వెంకట్రావు స్పందించి వెంటనే విచారణకు ఆదేశించారు. పోస్టల్శాఖ అసిస్టెంట్ సూపరింటెండెంట్ రవికుమార్ శనివారం నాగసాల గ్రామాని కి వెళ్లి, పోస్టాఫీసులో దర్యాప్తు మొ దలు పెట్టారు. పూర్తి స్థాయి విచారణ చేపడుతున్నట్లు ఆయన విలేకరులకు వెల్లడించారు. రిజిస్టర్, స్పీడ్ పోస్టులకు సంబంధించిన వివరాలు రోజువారీగా ఉంటుందని, ఆర్డినరీ పోస్టు వివరాలు ఉండవన్నారు. బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు.