గద్వాల, అలంపూర్, మార్చి 6: పేద విద్యార్థులకు ఉచితంగా కార్పొరేట్స్థాయిలో విద్యనందించాలనే ఆలోచనతో సీఎం కేసీఆర్ గురుకుల పాఠశాలలు స్థాపించి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిస్తూ విద్యనందిస్తుంటే కొన్ని పత్రికలు గురుకుల పాఠశాలలపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయి. గోరంత సమస్యను కొండత చేసి చూపిస్తూ లేని సమస్యలను ఉన్నట్లుగా చిత్రీకరిస్తూ విద్యార్థినులతోపాటు వారి తల్లిదండ్రులను ఆయోమయానికి గురిచేస్తున్నారు. అలంపూర్ నియోజకవర్గంలోని ఉండవెల్లి మండలం పుల్లూరులోని జ్యోతిరావుపూలే గురుకుల పాఠశాలలో విదార్థినులకు అవసరమైన వసతులు ఉన్నప్పటికీ అక్కడ వసతులు లేవని ఒంటికి, రెంటికి విద్యార్థినులు అవస్థలు పడుతున్నారని ఓ పత్రిక అవాస్తవాలను ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేస్తుంది.
గురుకుల పాఠశాల, కళాశాలలో ఉన్న బోరుకు మరమ్మతులు వస్తే దానిని రిపేర్ చేయించడానికి ఒకరోజు సమయం పడితే ఆ సమయంలో విద్యార్థినులకు నీటి ఇబ్బందులు ఎదురు కాకుండా ఉండాలనే ఆలోచనతో ప్రిన్సిపాల్ దేవానందం సర్పంచ్తో మాట్లాడి ట్యాంకర్ ఏర్పాటు చేసి గురుకుల పాఠశాల, కళాశాల విద్యార్థులకు నీటి సౌకర్యం కల్పిస్తే అక్కడ విద్యార్థులు భోజనం చేసిన తర్వాత నీటి ట్యాంకు వద్ద తిన్న ప్లేట్లు కడుగుతుంటే అది చూసిన అంధ్రజ్యోతి విద్యార్థినులు వారం రోజులుగా ఒంటికి, రెంటికి నీటివసతి లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారని కట్టు కథ అల్లి వార్త ప్రచురించడంతో విద్యార్థినుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గురుకుల పాఠశాలల్లో తమ బిడ్డలను సొంత బిడ్డలుగా చూసుకుంటూ అన్ని సౌకర్యాలు కల్పిస్తుంటే ఇలా విద్యార్థినులకు ఇబ్బందులను కలిగేలా రాయడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు.
ఇంటిని మరిపించేలా సౌకర్యాలు
పుల్లూరులోని జ్యోతిరావుపూలే బీసీ గురుకుల పాఠశాల, కళాశాలలో విద్యార్థినులు ఇంటిని మరిపించేలా ప్రభుత్వం సౌకర్యాలు కల్పిస్తున్నది. 5వ తరగతి నుంచి పదో తరగతి వరకు 471మంది విద్యార్థినులు ఉన్నారు. కళాశాలలో 243మంది విద్యార్థినులు విద్యనభ్యసిస్తున్నారు. గతేడాది ఇంటర్లో వందకు వందశాతం ఉత్తీర్ణత రాగా పదో తరగతిలో 10/10 నలుగురు విద్యార్థినులు సాధించారు. 50 తరగతి గదులు ఉండడంతోపాటు 32మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. 80టాయిలెట్స్ ఉన్నాయి. త్రీఫేజ్, సింగిల్ ఫేజ్ బోర్లు ఉన్నాయి. స్వచ్ఛమైన తాగునీరు అందించడానికి ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేశారు. డైనింగ్హాల్ ఉండడంతోపాటు ప్లేట్లు శుభ్రం చేసుకోవడానికి గురుకుల పాఠశాల బయట నల్లాలు ఏర్పాటు చేశారు. అన్ని వసతులున్న పాఠశాల, కళాశాలలో వసతులు లేవని ఆసత్యాలు ప్రచురించడంపై విద్యార్థినులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
విద్యుత్ కనెక్షన్లో జాప్యం
గురుకుల పాఠశాలకు త్రీఫేజ్ విద్యుత్ సరఫరా లేకపోవడంతో ప్రైవేట్ నుంచి విద్యుత్ కనెక్షన్ పొందారు. అయితే విద్యుత్ అధికారులు గురుకుల పాఠశాల ఆవరణలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసిన ఇంటీరియర్ పనులు చేయకపోవడంతో విద్యుత్ కనెక్షన్ ఇవ్వడంలో జాప్యం జరిగింది. అయితే నాలుగు రోజుల కిందట మూడు గ్రామాలకు విద్యుత్ సరఫరా చేసే ట్రాన్స్ఫార్మర్ మరమ్మతులకు నోచుకోవడంతో విద్యుత్ సమస్యలో అంతరాయం ఏర్పడింది. విద్యుత్ అధికారులు సరిచేయడంతోపాటు గురుకుల పాఠశాలకు మూడు రోజుల కిందటే త్రీఫేజ్ విద్యుత్ సౌకర్యం కల్పించినట్లు అలంపూర్ విద్యుత్శాఖ ఏడీ సయ్యద్ మక్బూల్ తెలిపారు.
విద్యుత్ కనెక్షన్ ఇవ్వడంలో మా నిర్లక్ష్యం లేదని చెప్పారు. పాఠశాలలో నీటి సమస్య లేదని, రెండు బోర్లు ఉండడంతో నీరు పుష్కలంగా ఉందని ప్రిన్సిపాల్ దేవానందం అన్నారు. నాలుగు రోజుల కిందట బోరు మరమ్మతులకు ఇచ్చామని, నీటి ఇబ్బందులు లేకుండా సర్పంచ్ సహకారంతో ట్యాంకర్లతో నీటిని తీసుకున్నామన్నారు.