ఎన్నికల నగారా మోగడంతో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో వేడి మొదలైంది. బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఇప్పటికే రేసుగుర్రాల జాబితాను ప్రకటించారు. సిట్టింగులకే సీట్లు ఇవ్వడంతోప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఈ నెల 15వ తేదీన బీఫాంలను అందించి..మ్యానిఫెస్టో విడుదల చేయనున్నారు.
విపక్షాలు ఇంకా అభ్యర్థుల వేటలోనే ఉన్నాయి. సీఎం కేసీఆర్ ఈ నెల 18వ తేదీ నుంచి ఉమ్మడి జిల్లాలో సమర శంఖం పూరించనున్నారు. 18న జడ్చర్ల, 26న అచ్చంపేట, నాగర్కర్నూల్, వచ్చే నెల 6వ తేదీన గద్వాల, మక్తల్, నారాయణపేటలో సభలు ఉండనున్నాయి. జడ్చర్లలో తొలి సభ నిర్వహించనున్న నేపథ్యంలో సుమారు 50 ఎకరాల్లో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. రణగర్జనకు కనీవినీ ఎరుగని రీతిలో జనాన్ని సమీకరించేందుకు బీఆర్ఎస్ శ్రేణులు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అలాగే పర్యటన ఖరారైన నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు కూడా ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు.
మహబూబ్నగర్, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఎన్నికల షెడ్యుల్డ్ ప్రకటించగానే ఉమ్మడి జిల్లాలో రాజకీయ వేడి మొదలైంది. విపక్షాల్లో టికెట్ల లొల్లి ఇంకా నడుస్తుండగానే బీఆర్ఎస్ ఒక అడుగు ముందుకేసి ఎన్నికలకు సమరశంఖం పూరించింది. పార్టీ అధినేత సీఎం కేసీఆర్ ఉమ్మడి జిల్లాలో ఆరు బహిరంగ సభల్లో పాల్గొంటూ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు. మహబూబ్నగర్, గద్వాల, నాగర్కర్నూల్, నారాయణపేట జిల్లాల్లో సీఎం ప్రచార సభలు ఖరారయ్యాయి. ఈనెల 18 నుంచి వచ్చే నెల 6వ తేదీ వరకు ఆరు చోట్ల భారీ బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల, నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట, నాగర్కర్నూల్, గద్వాలలో, నారాయణపేట జిల్లా మక్తల్, నారాయణపేటల్లో ఎన్నికల ప్రచారాన్ని చేపట్టనున్నారు.
ఈ సభలకు ఏకంగా పార్టీ అధినేత పాల్గొంటుడడంతో ఉమ్మడి జిల్లాలో రాజకీయం రసవత్తరంగా మారింది. సీఎం పర్యటన ఖరారు కావడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో కొత్త జోష్ మొదలైంది. బీఆర్ఎస్ రథచక్రాలు కదులుతున్నాయి. ఇక కాచుకోండంటూ కాంగ్రెస్, బీజేపీలకు సవాల్ విసురుతున్నారు. ఉమ్మడి జిల్లాలో గత ఎన్నికల్లో క్లీన్స్వీప్ చేసిన వాళ్లకే మళ్లీ టికెట్లు దక్కడంతో ఆయా నియోజకవర్గాల్లో క్యాడర్ ఫుల్జోష్లో ఉంది. కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థుల మెజార్టీపై పందెం కాస్తున్నారు. టికెట్లు ప్రకటించి విపక్షాలకు షాక్ ఇచ్చిన కేసీఆర్ ఈనెల 15న తెలంగాణ భవన్లో సమావేశం నిర్వహించి టికెట్లు దక్కించుకున్న సిట్టింగ్లకు ఏకంగా బీఫాంలను అందిస్తారు. ఈ సమావేశం తర్వాత జిల్లాల్లో ఎన్నికల ప్రచారపర్వం ప్రారంభించనున్నారు.
ఉమ్మడి జిల్లాలో 12 నియోజకవర్గాల్లో తొలివిడుత ఆరు నియోజకవర్గాల్లో జరిగే బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. కాగా, తెలంగాణ ఉద్యమ సమయంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన జడ్చర్ల ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు చర్లకొల ల క్ష్మారెడ్డి నియోజకవర్గం నుంచి సెంటిమెంట్గా ప్రచారం ప్రారంభిస్తున్నారు. రణగర్జనకు కనీవిని ఎరుగని రీతిలో జనాన్ని సమీకరించేందుకు బీఆర్ఎస్ శ్రేణులు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.
విపక్షాల వ్యూహలను చిత్తుచేస్తూ బీఆర్ఎస్ ప్రచార పర్వానికి తెరతీయడంతో గుబులు ప్రారంభమైంది. ఏకంగా సీఏం కేసీఆర్ ఉమ్మడి జిల్లాలో ప్రచారాన్ని ప్రారంభిస్తుండటంతో ఒక్కసారిగా జోష్ పెరిగింది. పులి వస్తుంది.. కాచుకోండంటూ సోషల్మీడియా వేదికగా పోస్టులు ట్రోలింగ్ అవుతున్నాయి. దీంతో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. వచ్చే నెల 3న నోటిఫికేషన్ వస్తుండటంతో బీఆర్ఎస్ అధినేత అస్ర్తాలు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పేరుతో బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు నియోజకవర్గంలోని ప్రజలతో మమేకమయ్యారు.
షెడ్యూల్ రాకముందే మంత్రులు, ఎమ్మెల్యేలు సుడిగాలి పర్యటనలు చేపట్టి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. రాత్రి ఒంటిగంట వరకు అన్ని గ్రామాలను చుట్టివచ్చారు. అగస్టు 21న టికెట్లు ఖరారు చేశారు. 14 మంది ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలకు మళ్లీ టికెట్లు కేటాయించారు. దీంతో అన్ని నియోజకవర్గాల్లో సంబురాలు అంబరాన్ని అంటాయి. బీఆర్ఎస్ క్యాడర్ అంతా సిట్టింగ్లకే జై కొట్టారు. పక్కావ్యుహంతో ఎన్నికల సమరానికి సై అంటుడంతో కాంగ్రెస్, బీజేపీలకు ఓటమి భయం పట్టుకుంది.
ఎన్నికల సమరానికి బీఆర్ఎస్ సంసిద్ధమైంది. పార్టీ అధినేత ప్రచారానికి వస్తుండడంతో ఉమ్మడి జిల్లాలో క్యాడర్ ఫుల్జోష్లో ఉంది. ప్రస్తుతం 12 నియోజకవర్గాల్లో తొలివిడుత ఏకంగా కేసీఆర్ ఆరు నియోజకవర్గాల్లో బహిరంగసభల్లో పాల్గొంటున్నారు. ఈనెల 18న జడ్చర్ల నుంచి ముహూర్తం ఖరారు చేశారు. 26న అచ్చంపేట, నాగర్కర్నూల్, నవంబర్ 6వ తేదీన గద్వాల, మక్తల్, నారాయణపేటల్లో జరిగే భారీ బహిరంగ సభల్లో గులాబీ బాస్ పాల్గొననున్నారు. దీంతో ఆయా చోట్ల పార్టీ నేతలు జనసమీరణకు సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో రెండు నెలలుగా మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, మహమూద్అలీ వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
ఉమ్మడి జిల్లాలో పార్టీ అధినేత కేసీఆర్ ఎన్నికల ప్రచారానికి వస్తుండడంతో భారీగా జనాలను సమీకరించేందుకు ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు పార్టీ నేతలతో సమావేశమవుతున్నారు. ఈనెల 18న జడ్చర్లలో జరిగే ఎన్నికల ప్రచార సభకు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పార్టీ నేతలతో కలిసి జడ్చర్ల మండలం రంగాపూర్ గ్రామశివారులోని శివాలయం వద్ద సీఎం సభకు స్థలాన్ని పరిశీలించారు. సుమారు 50 ఎకరాల్లో సభా స్థలాన్ని చదును చేస్తున్నారు. భారీ ఎత్తున జన సమీకరణ కోసం నియోజకవర్గ నేతలతో సమావేశయ్యారు. సభను విజయవంతం చేసేందుకు నడుంబిగించాలని పార్టీ క్యాడర్కు పిలుపునిచ్చారు. 26న సీఎం అచ్చంపేటలో జరిగే సభలో పాల్గొననున్నారు.
ప్రభుత్వ విప్, బీఆర్ఎస్ నాగర్కర్నూల్ జిల్లా అధ్యక్షుడు, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు సభ స్థలాన్ని ఎంపిక చేసేందుకు సమాలోచనలు చేస్తున్నారు. పార్టీక్యాడర్తో సమావేశాలు నిర్వహిస్తున్నారు. పండుగ తర్వాత వస్తుండటంతో జనాలను తరలించి మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను అడిగి హమీ తీసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. నాగర్కర్నూల్ జిలా ్లకేంద్రంలో ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి, గద్వాలలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి, మక్తల్లో ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి, నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి సీఎం కేసీఆర్ సభకు ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు.