ప్రతి ఏడాది జనవరి మాసంలో రావాల్సిన వేరుశనగ పంట ఈ సారి నెల ముందుగానే చేతికొచ్చింది. దీనికితోడు పంట కూడా పుష్కలంగా పండడం, ధర కూడా అధికంగా ఉండడంతో రైతులు ఖుషీ అవుతున్నారు. ప్రస్తుతం క్వింటాకు రూ.6,377 మద్దతు ధర ఉండగా.. మార్కెట్లో దాదాపు రూ.వెయ్యి వరకు అధికంగా పలుకుతున్నది. రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశముందని రైతులు చెబుతున్నారు. రూ.7 వేల నుంచి రూ.8 వేల వరకు ధర పలుకుతుండడంతో అన్నదాతలు సంబురంగా ఉన్నారు. వనపర్తి జిల్లాలో మొత్తం 30,133 ఎకరాల్లో వేరుశనగ సాగు చేయగా, పక్షం రోజుల్లోనే దాదాపు 15వేల క్వింటాళ్ల వరకు విక్రయానికి వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. స్థానికంగా ఉండే మిల్లర్లు మాత్రమే టెండర్లలో పాల్గొంటున్నారు. మార్కెట్కు నిత్యం పది వేల బస్తాలు వస్తే.. బయటి ప్రాంతాల నుంచి వ్యాపారులు వచ్చే అవకాశం ఉన్నది. అలా జరిగితే ధర భారీగా రానున్నది. వేరుశనగ తోపాటు వరి పంట కూడా వస్తుండడంతో ధాన్యపురాసులతో మార్కెట్ యార్డు కళకళలాడుతున్నది.
వనపర్తి, డిసెంబర్ 10, (నమస్తే తెలంగాణ) : వేరుశనగ ఈఏడాది మార్కెట్కు అనుకున్న సమయానికి ముందే వస్తున్నది. సాధారణంగా జనవరిలో వచ్చే వేరుశనగ పంట ఈపాటికే మార్కెట్లలో నిండుకుంటుంది. జిల్లాలో 30,133 ఎకరాల్లో వేరుశనగ పంటను రైతులు సాగు చేసినట్లు వ్యవసాయశాఖ అంచనా ఉంది. ముందుగా ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో వేసిన వేరుశనగ పంట చేతికి రావడంతో మార్కెట్ యార్డు కళకళలాడుతున్నది. ఈ ఏడాది వర్షాల ప్రభావం అంతంత మాత్రమే ఉన్నా ప్రాజెక్టుల నీళ్లు గళగళా పారుతుండటంతో ఎటూచూసినా పంటల రాసులు కనబడుతున్నాయి. ఒకవైపు వానాకాలం వరికోతలు నెల రోజులుగా సాగుతున్నది. మరో నెల రోజుల వరకు వరిధాన్యం కేంద్రాలకు వస్తుందని అంచనా వేస్తున్నారు.
నెల రోజులు ముందుగానే ప్రారంభమైన వేరుశనగ పంట విక్రయాలు జోరందుకుంటున్నాయి. ఇప్పటి వరకు ఈ పక్షం రోజుల్లోనే దాదాపు 15వేల క్వింటాళ్ల వరకు వేరుశనగ విక్రయాలు జరిగినట్లు మార్కెటింగ్ అధికారులు చెబుతున్నారు. దీన్ని బట్టి వచ్చే జనవరి నుంచి మరింత భారీగా వేరుశనగ పంట విక్రయాలు జరుగుతాయని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం రోజుకు 2వేల క్వింటాళ్ల చొప్పున మార్కెట్కు వేరుశనగ పంట వస్తున్నది. ప్రభుత్వ ఎంఎస్పీ ప్రకారం క్వింటాకు రూ.6,377 ధర ఉన్నది. అయితే, బహిరంగ మార్కెట్లో విక్రయాలను పరిశీలిస్తే ప్రభుత్వ ఎంఎస్పీ కంటే దాదాపు రూ.వెయ్యి వరకు అటు, ఇటుగానే విక్రయాలు అవుతున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో క్వింటా వేరుశనగకు మద్యస్త ధర రూ.7వేల పైబడి విక్రయాలు సాగుతున్నాయి. స్థానికంగా ఉండే మిల్లర్లు మాత్రమే టెండర్లలో పాల్గొంటున్నారు. అమ్మకాలు పెరిగితే బయటి ప్రాంతాల నుంచి వ్యాపారులు వచ్చే అవకాశం ఉంది. వనపర్తి మార్కెట్ నుంచి ముంబయి, ఢిల్లీ, యూపీ, బీహార్, చెన్నైవంటి రాష్ర్టాలకు వేరుశనగ వెళ్లే అవకాశం ఉంది.
జిల్లాలో దాదాపు యాసంగిలో 30,133 ఎకరాల్లో వేరుశనగ సాగు చేసినట్లు వ్యవసాయశాఖ అంచనా ఉన్నది. జిల్లాలోని 14 మండలాల్లో వేరుశనగను రైతులు సాగు చేశారు. కొన్ని మండలాల్లో ముందుగానే వేరుశనగ సాగుచేశారు. వానాకాలం సీజన్లో పూర్తిగా వేరుశనగ సాగును మానివేసిన రైతులు, ఈ రెండేండ్లలో ముందస్తుగా వేరుశనగ సాగుకు ప్రాధాన్యతనిస్తున్నారు. గతంలో కేవలం వర్షాధారాలపైనే ఆధారపడి వేరుశనగ సాగు ఉండేది. యాసంగిలో కొంత మాత్రమే ఉన్నప్పటికీ ఎక్కడా కనిపించకపోయేది. గడచిన ఐదేండ్లుగా ఎటుచూసినా రోడ్డు వెంట పచ్చని పైర్లతో కళకళలాడుతున్నాయి. ఇదిలా ఉండగా, వరి, వేరుశనగలకు ధీటుగా ఇటీవలే ఆయిల్పాం తోటల పెంపకంపై రైతులకు మక్కువ చూపిస్తున్నారు. అడవి పందు, కోతుల సమస్యలు లేకుండా ఉన్న ఆయిల్పాం తోటలకు ప్రభుత్వం 85శాతం సబ్సిడీ ఇస్తున్నందునా అటువైపు కూడా రైతులు అడుగులు వేస్తున్నారు.
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 17 వ్యవసాయ మార్కెట్ యార్డులుంటే, ప్రస్తుతం వనపర్తి మార్కెట్కు మాత్రమే వేరుశనగ పంట వస్తున్నది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మహబూబ్నగర్, నాగర్కర్నూల్, కల్వకుర్తి, అచ్చంపేట, బాదేపల్లి, వనపర్తి రోడ్, గద్వాల, వనపర్తి వ్యవసాయ మార్కెట్లకు మాత్రమే వేరుశనగ పంట వచ్చే అవకాశం ఉంది. వీటిలో ప్రస్తుతం గద్వాల మార్కెట్కు సైతం కొంత మేర వేరుశనగ వస్తున్నది. మిగిలిన ప్రాంతాల్లో మరో పక్షం రోజులు గడిస్తే తప్పా వేరుశనగ వచ్చే అవకాశం లేదు. ఇదిలా ఉండగా, గతంలో గద్వాల మార్కెట్కు ఎక్కువ ప్రాధాన్యత ఉండేది. క్రమంగా అన్ని ప్రాంతాల్లోనూ మార్కెట్ యార్డులు అభివృద్ధి చెందడం, పంటలు పుష్కలంగా పండటంతో మార్పులు వచ్చాయి.