నాగర్కర్నూల్, జూన్ 19 : విద్యార్థులకు విద్యతోపాటు ఉచితంగా పుస్తకాలు, నోట్ బుక్కులు, మధ్యాహ్నం భోజనం అందిస్తున్న ప్రభుత్వం ఇకపై అల్పాహారాన్ని కూడా అందించనున్నది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు ఉదయం ఏమీ తినకుండా పాఠశాలకు వస్తున్న విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా రాగిజావతో కూడిన అల్పాహారాన్ని అందించనున్నది.
దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం నిర్వహించే తెలంగాణ విద్యా దినోత్సవం సందర్భంగా నాగర్కర్నూల్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు అల్పాహారంగా రాగి జావను అందించనున్నారు. ప్రతిరోజూ ప్రార్థన సమయానికి ముందు విద్యార్థులకు 25 మిలీలీటర్ల రాగి జావ ఇవ్వనున్నారు. దీంతో జిల్లాలో 825 ప్రభుత్వ పాఠశాలల్లోని 69వేల మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగనున్నది. నాగర్కర్నూల్జిల్లాలో ‘మన ఊరు-మనబడి, మన బస్తి-మన బడి’ కింద సకల వసతులతో ఆధునీకరించిన 65 ప్రభుత్వ పాఠశాలలను మంత్రులు, ఎమ్మెల్యేలు నేడు ప్రారంభించనున్నారు.
ఈ సందర్భంగా జిల్లాలో 6-10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు సబ్జెక్టుకు ఒక్కో నోటుపుస్తకం చొప్పున అందించనున్నారు. అదేవిధంగా పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను పెంపొందించేందుకు, సమాచార బదలాయింపు కోసం జిల్లాలోని 609మంది ఉపాధ్యాయులకు ట్యాబ్లు పంపిణీ చేయనున్నారు. మన ఊరు-మన బడి కార్యక్రమం మొదటి విడుతలో 65 ఉన్నత పాఠశాలల్లో నిర్మించిన డిజిటల్ తరగతులను నేడు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేశారు. జిల్లావ్యాప్తంగా ఉన్న ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో సభలు, సమావేశాలు నిర్వహించి ర్యాలీలు, జాతీయ పతాకావిష్కరణ అనంతరం విద్యా రంగంలో నాగర్కర్నూల్ జిల్లా సాధించిన విజయాలను వివరించాలని జిల్లా విద్యాధికారి గోవిందరాజులు ఆదేశించిన నేపథ్యంలో విద్యాధికారులు ఏర్పాట్లు చేపట్టారు.
పాఠ్యపుస్తకాలు అందిస్తున్నాం
దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాల ను అందిస్తున్నాం. ఈ పుస్తకాలను ఇప్పటికే ఆయా పాఠశాలలకు తరలించాం. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 69వేల మంది విద్యార్థులకు ఒక్కో విద్యార్థికి రెండు జతల యూనిఫాం అందిస్తున్నాం. విద్యా దినోత్సవం సందర్భంగా మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ ప్రాంగణంలో ఉత్తమ హెచ్ఎంలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ఎస్ఎంసీ చైర్మన్లకు సన్మానం చేస్తాం. ఈ ఏడాది నుంచి అల్పాహారంగా విద్యార్థులకు రాగిజావ పంపిణీ చేయనున్నాం. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో విద్యార్థుల తల్లిదండ్రులు సంతోషిస్తున్నారు.
– గోవిందరాజులు, డీఈవో