పంటల సాగు సాంకేతిక దిశగా సాగుతున్నది. అడ్వాన్స్డ్ టెక్నాలజీని జోడించి వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే మిషనరీ వ్యవస్థను ప్రవేశపెట్టి ఈ రంగాన్ని ముందుకు నడిపిస్తున్నది. దీనికి తోడు సాంకేతికను ఇక్కడ అమలు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నది. అక్కడి వాతావరణ పరిస్థితులు, మనదేశ పరిస్థితులు దాదాపు ఒకేలా ఉంటాయి. అందుకే ఆ దేశంలో పండే పంటలు.. ఇక్కడ సాగు చేయడంతోపాటు అక్కడి టెక్నాలజీని వినియోగించి క్వాలిటీతో పాటు క్వాంటిటీ పెంచాలనే ఆలోచనతో సర్కారు అడుగులు వేస్తున్నది. ఈ నేపథ్యంలో ఈనెల 5 నుంచి 11వతేదీ వరకు 29 మందితో కూడిన ప్రత్యేక బృందాన్ని ఇజ్రాయిల్కు పంపించింది. అధికారులు అక్కడ పంటల సాగు విధానంపై పూర్తిస్థాయిలో విశ్లేషణ చేశారు. అందుకు సంబంధించిన నివేదికను సిద్ధ్దం చేసి ప్రభుత్వానికి నివేదించనున్నారు. వారి విధానాన్ని ముందుగా ఉద్యాన శాఖలో అమలు చేసి.. ఆ తర్వాత ఆహార, వాణిజ్య పంటల్లో వినియోగించేలా ప్రణాళికలు రూపొందించనున్నారు.
– వనపర్తి, ఆగస్టు 25
వనపర్తి, ఆగస్టు 25 : ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయమే దండుగ అని ఆ రంగాన్ని పట్టించుకోకపోవడంతో పొలాలన్నీ బీడు భూములుగా మారగా.. ప్రజలు వలస పోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. స్వరాష్ట్ర పాలనలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి చొరవతో వ్యవసాయ రంగంలో పలు మార్పులు తీసుకొచ్చారు. రైతులకు అన్ని రకాలుగా అండదండగా నిలుస్తూ సాగును పండుగలా మార్చారు.
వ్యవసాయ రంగంపై ప్రత్యేక దృష్టి ..రాష్ట్రంలో వ్యవసాయరంగం బలోపేతం చేసేందుకు సంక్షేమ పథకాలను అమలు చేస్తూ సీఎం కేసీఆర్, మంత్రి నిరంజన్రెడ్డి ముందుకు సాగుతున్నారు. ప్రపంచంలోని కొత్త వంగడాలు, నాణ్యవంతమైన పంటలను అధ్యయనం చేసేందుకు కమిషన్ ఆఫ్ హార్టికల్చర్ హనుమంతరావు(ఐఏఎస్) ఆధ్వర్యంలో 29మందితో కూడిన ప్రత్యేక బృందాన్ని ప్రభుత్వం ఇజ్రాయిల్కు పంపింది. ఈనెల 5 నుంచి 11వ తేదీ వరకు రోజుకో వంగడం, సాగు విధానం వంటి అంశాలపై హనుమంత్రావు, అదనపు అగ్రికల్చర్ స్పెషల్ కమిషన్ సభ్యులు హనుమంత్(ఐఏఎస్), హార్టికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ నీరజాప్రభాకర్, జగిత్యాల ఏడీఆర్ శాస్త్రవేత్త శ్రీనివాసరావు, ఐఐహెచ్ఆర్ టీఎస్ రాష్ట్ర కన్సెలెంట్ శ్రీనివాసరావుతోపాటుగా రాష్ట్రవ్యాప్తంగా 29 మంది అధ్యయనం చేయనున్నారు. బృందంలో 20 మంది అధికారులు, 9మంది రైతు సమన్వయ సమితి సభ్యులు ఉండగా అందులో వనపర్తి జిల్లా నుంచి హార్టికల్చర్ పట్టుపరిశ్రమ శాఖ అధికారి సురేశ్ కూడా ఉన్నారు. 6 నుంచి 10వ తేదీ వరకు రోజు వారీగా దేశంలో ఒక్కో ప్రదేశంలోని పంటల సాగుపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి వచ్చారు.
అధ్యయనం చేసిన అంశాలు..
1) ఫిజికల్ మెథడ్ : ఫిజికల్ మెథడ్ ద్వారా పురుగు కనిపిస్తుందా? ఆ పురుగు ఏ దిశగా వస్తుంది? ఎన్ని సంవత్సరాలుగా ఈ దిశ గుండా వస్తుంది? అనే అంశాలపై పూర్తి స్థాయిలో విచారించి ఫిజికల్గా వేడిగాలి, నీరు ద్వారా తీసివేస్తారు.
2) మెకానికల్ మెథడ్ : పంటలో పురుగులు ఆశించిన మొక్కలను తొలగించి (రోగం వచ్చిన మొక్కలు) భూమిలో ఒక దగ్గర పాతి పెడతారు.
3) పురుగు జీవన విధానాన్ని బ్రేక్ చేయడం : పంటను ఆశించిన పురుగులు ఆడ, మగ వాటిని గుర్తించి పురుగు జీవన విధానాన్ని బ్రేక్ చేయడం ద్వారా సంపర్కం జరగకుండా చేస్తారు. దీనివల్ల పురుగుల ఉత్పత్తి తగ్గి పంట నష్టం కాకుండా చూస్తారు.
4) హార్టి ఫిజియల్ : హార్టిఫిజియల్ ఇంటిలెజెన్స్ను పంట మధ్యలో ఒక బుట్ట కింద ఏర్పాటు చేసి పురుగులు మొత్తం అందులోకి చేరేలా చేస్తారు. అందులో పడిన వెంటనే పురుగులు మరణిస్తాయి. బుట్టలో ఏర్పాటు చేసిన సెన్సార్ ద్వారా ఏ పురుగులు ఏ కాలంలో అత్యధికంగా పడ్డాయో తనిఖీ చేసి సామూహిక స్ప్రే చేస్తారు. దీనివల్ల పంట నష్టం జరుగకుండా క్వాలిటీగా ఉంటుంది. ఇలా వ్యవసాయ పంటలు, కూరగాయలు, పత్తి, పొద్దుతిరుగుడు, హైడ్రోఫోనిక్స్, క్యాప్సికమ్, లెట్పూస్, ఆలీవ్ ఆయిల్, భూమికి పైభాగంలో పెంచే పంటలు, పాల డైరీలు వంటి వాటిపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేశారు.
సాగుపై పూర్తి విశ్లేషణ కల్పించారు..
ఇజ్రాయిల్ రైతులు నాణ్యవంతంగా, విన్నూత రీతిలో పంటలను పండిస్తున్నారు. అక్కడ ఎలాంటి పంటలు సాగు చేస్తున్నారు? ఏ రకమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు? వంటి అంశాలను పూర్తిస్థాయిలో గమనించాం. అత్యాధునిక ప్రమాణాలు పాటిస్తూ, సామూహికంగా పంటలు చేయడం వల్లనే ఇది సాధ్యమవుతుంది. రాష్ట్రం నుంచి 29 మందిమి అక్కడికి వెళ్లి ఎన్నో కొత్త విషయాలను నేర్చుకున్నాం.
– సురేశ్, ఉద్యానవన, పట్టు పరిశ్రమశాఖ జిల్లా అధికారి, వనపర్తి