టింగ్.. టింగ్.. మంటూ పంట పెట్టుబడి పైసలు పడినట్లు ఫోన్లకు వచ్చిన మెసేజ్లతో రైతన్నలు సంబురపడ్డారు. సోమవారం నుంచి రైతుబంధు సాయం పంపిణీ ప్రారంభ మైంది. తొలి రోజు ఎకరా పొలం ఉన్న కర్షకుల ఖాతాల్లో
సాయం జమ చేశారు. గద్వాల, వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో రూ.48.90 కోట్లను విడుదల చేయగా.. 1,36,465 మంది రైతులకు లబ్ధి చేకూరింది. సాగు కోసం వడ్డీ వ్యాపారుల వద్దకు పరుగులు పెట్టే కాలం పోయిందని పలువురు సంతోషం వ్యక్తం చేశారు. రైతుబంధు డబ్బు రాకకు తోడు రుతుపవనాల ప్రభావంతో వర్షాలు కురు స్తుండడంతో వ్యవసాయం మరింత జోరందుకున్నది. పంటల సాగులో రైతు కుటుంబాలు బిజీబిజీగా నిమగ్నమయ్యాయి. సాయం అందుకున్న హలదారుల మోములో ఆనందం వెల్లివిరుస్తున్నది. సీఎం కేసీఆర్ రైతుబాంధవుడని, ఆయనకు తమ కష్టాలు తెలుసని రైతులు కృతజ్ఞతలు తెలిపారు.
మహబూబ్నగర్, జూన్ 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ప్రభుత్వం రైతుబంధు సాయాన్ని సోమవారం నుంచి రైతుల ఖాతాల్లో వేయడం ప్రారంభించింది. ఉమ్మడి జిల్లాలోని రైతుల ఖాతాల్లో నేరుగా నగదు జమ అవుతూ.. ఫోన్లకు మెసేజ్లు వస్తుండడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా, మండల వ్యవసాయ అధికారులు రైతుబంధు అర్హుల జాబితాను సిద్ధం చేశారు. దీంతో 11వ విడుత రైతుబంధు కింద ఎకరాకు రూ.5వేలు అందించే ప్రక్రియను ప్రారంభించి దశలవారీగా పెట్టుబడి సాయాన్ని అందించేందుకు ప్రభుత్వం సంసిద్ధమైంది. ఆయా ట్రెజరీలకు పంపించగా.. ట్రెజరీల నుంచి రైతుల ఖాతాల్లోకి నగదు జమ అవుతున్నది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 11,24,633 మంది రైతులకు పెట్టుబడి సాయం కింద రూ.1,250 కోట్లను విడుదల చేశారు. కాగా ఎకరాలోపు ఉన్న రైతుల ఖాతాల్లో రూ.5వేలు జమ అవుతతున్నాయి. దశలవారీగా మిగతా రైతులకు ప్రభుత్వం రైతుబంధు డబ్బులు జమ చేస్తుందని అధికారులు చెబుతున్నారు. ఈసారి పోడు రైతులకు కూడా రైతుబంధు సాయం అందుతున్నది. ఉమ్మడి జిల్లాలో 5,377 ఎకరాలకు సంబంధించి 2,289 మంది గిరిజన రైతులకు ఇటీవలే పట్టాలు అందించారు. ఇందులో దరఖాస్తు చేసుకున్న వారికి లబ్ధి చేకూరనుంది. వానకాలం ప్రారంభమై.. తొలకరి పలుకరించిన తరుణంలో ప్రభుత్వం పెట్టుబడి సాయం అందిస్తుండడంతో అన్నదాతల ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. వ్యవసాయ పనులు ప్రారంభ సమయంలో ప్రభుత్వం రైతుబంధు నగదు ఖాతాల్లో జమ చేయడంతో తమకు బాగా కలిసొచ్చిందని వారు అభిప్రాయపడుతున్నారు. గతేడాది జూలైలో ఇస్తే.. ఈసారి నెల ముందుగానే రైతుబంధు అందిస్తున్నది.
తొలిరోజు ఎకరా లోపు భూమి ఉన్న రైతుల ఖాతాల్లోకి రైతుబంధు నగదు జమ అవుతున్నది. నారాయణపేట జిల్లాలో సోమవారం 43,225మంది రైతుల ఖాతాల్లో ప్రభుత్వం రూ.21.61కోట్లు జమ చేసింది. నాగర్కర్నూల్, మహబూబ్నగర్, వనపర్తి, జోగుళాంబ గద్వాల జిల్లాలోని రైతుల ఖాతాల్లోనూ నగదు జమ అయ్యింది. ఈ నగదు ఎరువులు, విత్తనాల కొనుగోలుకు ఉపయోగపడుతుందని.. ముఖ్యమంత్రి కేసీఆర్ చల్లంగా ఉండాలని అన్నదాతలు దీవిస్తున్నారు. కాగా దశలవారీగా ఈ ప్రక్రియ కొనసాగుతుందని, అందరికీ రైతుబంధు అందుతుందని పాలమూరు జిల్లా వ్యవసాయశాఖ అధికారి వెంకటేశ్ తెలిపారు.
ఈసారి కొత్తగా దరఖాస్తు చేసుకున్న రైతులకు కూడా ప్రభుత్వం రైతుబంధు జమ చేస్తోంది. పొలాలు మారిన వాళ్లు, పొలాలు కొనుగోలు చేసిన వారు దరఖాస్తు చేసుకోగా.. వాటిని తాసీల్దార్లు రికార్డులతో సరిచూసి అర్హుల జాబితాను సిద్ధం చేశారు. వివిధ కారణాలతో రైతుబంధు పొందని వాళ్లు కూడా ఈసారి దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించారు. జిల్లాలో కొత్తగా వచ్చిన దరఖాస్తులను మండల వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. అన్ని సరి చూసుకున్నాకే రైతుబంధు సాయానికి అర్హుల జాబితాను సిద్ధం చేస్తున్నారు. మార్గదర్శకాలు రాగానే వారికి కూడా ఈ వానకాలం నుంచి రైతుబంధు అందేలా చర్యలు తీసుకుంటున్నారు.
రిజర్వు ఫారెస్ట్ ప్రాంతాల్లో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న గిరిజన రైతులకు కూడా ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాల వేళ తీపి కబురు అందించింది. దశాబ్దాల పోరాటం అనంతరం ఏ ప్రభుత్వం తీసుకోని సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకున్నది. అటవీ శాఖ అధికారుల నిబంధనలతో వ్యవసాయానికి దూరమైన గిరిజనులు ఆందోళన బాట పట్టగా.. ఎన్నో ప్రభుత్వాలు మారినా వారి సమస్యకు పరిష్కారం చూపలేదు. అధికారంలో ఉండి ఏం చేయాలని నేతలు విపక్షంలో ఉండి కారుకూతలు కూశారు. దీంతో పోడు రైతులకు కూడా పట్టాలివ్వాలని ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నది. దీంతో ఉమ్మడి జిల్లాలో 2,289మంది పోడు భూముల రైతులకు 5,377 ఎకరాలకు పట్టాలు చేసి అందించింది. ఇలా పట్టాలు అందుకున్నారో లేదో వారికి కూడా రైతుబంధు సాయం అందించడంతో వారు సంబురపడిపోతున్నారు. తమకు సాయం అందించిన సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటామని గిరిజన సంఘాలు అంటున్నాయి. మొత్తంగా రైతుబంధు విడుదలతో ఉమ్మడి జిల్లాలోని రైతాంగం సంతోషం వ్యక్తం చేస్తోంది.