ఉండవెల్లి, మార్చి 25 : ఆరుగాలం కష్టిం చి పండించిన పప్పుశనగను విక్రయించేందుకు రైతన్న అవస్థలు పడుతున్నాడు. కేంద్ర ప్రభుత్వం రోజుకో నిబంధన విధిస్తూ కొర్రీ లు పెడుతుండడంతో ఆందోళనకు గురవుతున్నాడు. సకాలంలో నాఫెడ్ కొనుగోలు చేయకపోవడంతో కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నాడు. రైతుల పక్షాన నిలవాల్సిన ప్రతిపక్ష పార్టీలు రాష్ట్ర ప్రభుత్వంపై నిందలు వేస్తూ ఉనికిని చాటుకుంటున్నాయే తప్ప.. కేంద్ర ప్రభుత్వ సంస్థ నాఫెడ్ అవలంబిస్తున్న విధానాలపై మాట్లాడకపోవడం విడ్డూరం. రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా ప్రతిపక్ష నాయకులు కొనుగోలు కేంద్రాలకు వెళ్లి రైతులతో మాట్లాడుతున్నారే తప్ప నాఫెడ్ సంస్థ ను ఎక్కడా ప్రశ్నించడంలేదు. దీనిపై పలువురు రైతులు విస్మయం చెందుతున్నారు.
కేంద్ర ప్రభుత్వం నాఫెడ్తో పప్పుశనగ ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చినప్పటికీ రోజుకో నిబంధన విధిస్తూ రైతులను ముప్పుతిప్పలు పెడుతున్నది. పప్పుశనగ కొనుగోలు కేంద్రా ల ప్రారంభంలో గన్నీబ్యాగుల్లో ధాన్యాన్ని నింపి క్యూఆర్ కోడ్ టోకెన్ జారీ చేయడం, మిషన్తో కుట్టు వేయించేవారు. ఈ నిబంధన మేరకు 10రోజులపాటు ధాన్యం కొనుగోలు చేశారు. ఆ తర్వాత మరో కొత్త నిబంధనను తీసుకొచ్చారు. గన్నీబ్యాగులకు నాఫె డ్ కొనుగోలు చేసినట్లు కలర్ ఫ్రింట్తో లాట్నెంబర్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ నిబంధన మేరకు పీఏసీసీఎస్ అధికారులు పప్పుశనగను కొనుగోలు చేస్తున్నారు. అయితే రాష్ట్రంలో పండించిన పప్పుశనగను 25శాతం మాత్రమే కొనుగోలుకు నాఫెడ్ అనుమతులు ఇవ్వడంతో రైతులు ఇ బ్బందులకు గురవుతున్నారు. కేంద్ర ప్రభు త్వ కొర్రీలతో పప్పుశనగ కొనుగోలు నిలిచిపోయాయి. దీంతో పప్పుశనగ రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తూ అవస్థలు పడుతున్నారు.
అలంపూర్ నియోజకవర్గంలో నల్లరేగడి భూములు అధికంగా ఉండడంతో పప్పుశనగ పెద్దఎత్తున సాగవుతున్నది. మొత్తం 4,838మంది రైతులు 15,135 ఎకరాల్లో సాగు చేయగా, వాతావరణం అనుకూలించడంతో ఎకరాకు 10నుంచి 12క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. అలంపూర్ మండలంలో 1,966మంది రైతులు 6,265ఎకరాలు, ఇటిక్యాలలో 520మంది 1,496 ఎకరాలు, మానవపాడులో 148మంది 516 ఎకరాలు, ఉండవెల్లిలో 1,487మంది 4,310 ఎకరాలు, అయిజలో 189మంది 530 ఎకరాలు, రాజోలిలో 160మంది 368 ఎకరాలు, వడ్డేపల్లిలో 366 మంది 1,259 ఎకరాల్లో పప్పుశనగను సాగు చేశారు. జిల్లాలో ఎక్కడా లేనంతగా అలంపూర్ నియోజకవర్గంలో పప్పుశనగను రైతులు సాగు చేస్తుండడంతో మార్క్ఫెడ్ అధికారులు పీఏసీసీఎస్ ఆధ్వర్యంలో ఏడు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. క్వింటాకు రూ.5,335 మద్దతు ధర నిర్ణయించి కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు పప్పుశనగ కొనుగోలు చేపట్టారు. అయితే పండించిన పంటలో 25శాతం మాత్రమే కొనుగోలు చేస్తామని కేంద్ర ప్రభుత్వ సంస్థ నాఫెడ్ నిర్ణయించడంపై రైతులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.