గద్వాల అర్బన్, ఏప్రిల్ 8 ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రలో జీవాలను కొనుగోలు చేసి లబ్ధిదారులకు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు జీవాలను రవాణా చేసేందుకు టెండర్ల ప్రక్రియను కూడా చేపట్టింది. మొదటి విడుతగా 10,525 యూనిట్లు పంపిణీ చేయగా, రెండో విడుతలో 8,354 యూనిట్లను ఏప్రిల్ నుంచి ఆగస్టులోగా అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గతంలో యూనిట్ విలువ రూ.1.25లక్షలు ఉండగా లబ్ధిదారుడు రూ.31,250 చెల్లిస్తేప్రభుత్వం రూ.93,750 సబ్సిడీ అందించేది. ఈసారి యూనిట్ విలువ రూ.1.75 లక్షలకు పెంచడంతో లబ్ధిదారుడు రూ.43,750 డీడీ రూపంలో చెల్లిస్తే ప్రభుత్వం రూ.1,31,250 సబ్సిడీ అందించనున్నది.
రెండో విడుత పంపిణీకి ప్రభుత్వం ఇతర రాష్ర్టాల నుంచి గొర్రెల రవాణాకు టెండర్ల ప్రక్రియ చేపట్టింది. ఈక్రమంలో ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ల నియామకానికి నోటిఫికేషన్ జారీ చేయనున్నది. ఏప్రిల్లో మొదలు పెట్టి ఆగస్టులోగా పూర్తి చేయాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కాగా అధికారులు జిల్లాలో లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేశారు. గొర్రెల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతుండడంతో వీరు ఆదాయాన్ని పొందుతున్నారు.
8,354 మందికి పంపిణీ
మొదటి విడుత గొర్రెల పంపిణీ సమయంలో అధికారులు జిల్లాలో గొర్రెల పెంపకందారులను గుర్తించి మొదటి విడతలో 10,525 మందికి పంపీణి చేశారు. అలాగే రెండో విడుతలో 8,354 మందికి పంపిణీ చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు వీరికి ఆగస్టు చివరి నాటికి యూనిట్లను అందచేసేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. కరోనా తర్వాత గొర్రెల ధర పెరిగినందున ప్రభుత్వం యూనిట్ ధరను రూ.1,25,000 నుంచి రూ.1,75,000కు పెంచింది.
టెండర్లకు నోటిఫికేషన్
రెండో విడుత లబ్ధిదారులకు పంపిణీ చేసే సబ్సిడీ గొర్రెలను ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయిచింది. ఈ నేపథ్యంలో సదరు రాష్ర్టాల్లో కొనుగోలు చేసే గొర్రెలను జిల్లాకు రవాణా చేయడానికి ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లను టెండర్ల ద్వారా నియామక ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలు రెండు, మూడురోజుల్లో వెల్లడించునున్నట్లు అధికారులు పేర్కొన్నారు.