నాగర్ కర్నూలు : రాష్ట్ర ప్రజానికానికి హామీలిచ్చి మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మున్సిపల్ ఎన్నికల్లో ( Municipal Elections ) బొందపెట్టాలని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ( Marri Janardhan Reddy) పిలుపునిచ్చారు. బుధవారం మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలోని 2, 13, 12 వార్డులలో బీఆర్ఎస్ ( BRS ) పార్టీ అభ్యర్థుల తరపున ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిపాలనను గాలికొదిలేసి రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. గతంలో జరిగిన అభివృద్ధి, రెండేళ్లలో జరిగిన అభివృద్ధిని ఆలోచించి ఓటు వేయాలని కోరారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో నాగర్ కర్నూల్ పట్టణంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, వాటిని ప్రజలకు వివరిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు చేస్తున్న మోసాలను బాకీ కార్డు ద్వారా ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో ఆయా వార్డుల పార్టీ అభ్యర్థులు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.