గండీడ్ వ్యవసాయ సహకార సంఘంలో గోల్మాల్ చోటు చేసుకున్నది. ఏడాది తిరిగినా కొత్త రుణాలను ఇవ్వని సిబ్బంది మృతి చెందిన వారి పేరు మీద రూ.లక్షల్లో లోన్లు తీసుకొని చేతివాటం ప్రదర్శించారన్న ఆరోపణలు ఉన్నాయి.దాదాపు రూ.64 లక్షల వరకు చేతులు మారినట్లు తెలిసింది. తీసుకున్న రుణాలు మాఫీ అవుతాయి.. మిమ్మల్ని నయా పైసా అడగమని దబాయిస్తున్నట్లు సమాచారం. దీంతో రెడ్డిపల్లి రైతులు ఆందోళన చెందుతున్నారు.
గండీడ్, జనవరి 6: రుణమాఫీని ఆసరాగా చేసుకొని కొత్త రుణాలకు ఏడాదిగా తిరిగినా ఇవ్వని సహకార సిబ్బంది మరణించిన వారి పేరుమీద రుణాలు తీసి రూ.లక్షల్లో అక్రమాలకు పాల్పడ్డారు. ఈ ఘటన గండీడ్ వ్యవసాయ సహకార సంఘంలో చోటుచేసుకున్నది. గండీడ్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సిబ్బంది అక్రమాలు అంతా ఇంత కాదు ఏకంగా మరణించిన వారి పేరుమీద లక్షల రూపాయల లోన్లు తీసుకొని రైతులు బకాయి ఉన్నట్లు చూపిస్తున్నారు.
ఇది చూసిన బాధిత రైతులు మా తండ్రులు ఎన్నడో చనిపోయారు.. చనిపొయిన వారు వచ్చి మీ వద్ద లోన్లు ఎప్పుడు తీసుకున్నారని అడిగితే బతికున్నప్పుడు తీసుకున్న రుణాలు అని, వారిని అడుగకుండా రెన్యూవల్ చేయడంతో మిగులు కనబడుతున్నాయని అంటున్నారు. మండలంలోని రెడ్డిపల్లి గ్రామంలోనే దాదాపు 10మంది మరణించిన వారి పేరుమీద లోన్లు తీసుకున్నారంటే మిగతా గ్రామాల్లో ఎంతమంది రైతుల పేరుమీద ఎన్ని రుణాలు తీసుకొని ఉంటారని పలువురు రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇక్కడ పనిచేస్తున్న సిబ్బంది అక్రమాలు ఒక్కొక్కటీ వెలుగులోకి వస్తున్నాయి.
సహకార సంఘం డెవలప్మెంట్ ఫండ్ దాదాపు రూ.64లక్షలు సహకార సంఘంలో పనిచేసే వ్యక్తి ఒక్కడే వాడుకున్నా ఇప్పటివరకు రికవరీ చేయలేదు. చిన్న చిన్న పొరపాట్లు జరిగితేనే సస్పెండ్ చేసి ఉద్యోగాలు తీసేసిన అధికారులు దాదాపు రూ.64లక్షలు ఫ్రాడ్ చేసిన వ్యక్తిని అదే హోదాలో ఉంచి విడుతల వారీగా డబ్బులు కట్టమని చెప్పి అదే ఉద్యోగంలో పెట్టడం ఎంతవరకు సమంజసమని రైతులు ఆరోపిస్తున్నారు. అదేవిధంగా సహకార సంఘం చైర్మన్లు కూడా రూ.లక్షల్లో వాడుకొని ఇప్పటివరకు కట్టలేదని ఆరోపణలు ఉన్నాయి. భవనం నిర్మాణం పేరిట బయటి వ్యక్తికి రూ.5 లక్షలు 2016లో ఇచ్చారు.
ఇప్పటివరకు బిల్డింగ్ లేదు.. తిరిగి చెల్లించలేదు. అలాగే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ద్వారా వరి, మొక్కజొన్న, కందులు కొనుగోలు చేపట్టారు. అందుకుగానూ ప్రభుత్వం ద్వారా దాదాపు రూ.19లక్షలు వచ్చాయి. వచ్చిన కొన్ని రోజులకు ఆ నిధులు కూడా ఎవరికీ తెలియకుండా గోల్మాల్ చేశారు. పాలకవర్గం ఏదైనా.. ఎవరు చైర్మన్గా ఉన్నా ఉద్యోగులు మాత్రం చైర్మన్లను వారి చేతుల్లో పెట్టకొని ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ఈ తతంగం జిల్లా అధికారులకు తెలిసినా పట్టించుకోకపోవడంతో అందులో వారికి వాటా ఉందేమో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రుణాల కోసం రైతులు చెప్పులరిగేలా తిరిగినా కుంటి సాకులు చెప్పి కాలయాపన చేస్తూ దాటవేస్తున్నారు. రైతులకు సహకార సంఘం నుంచి కొత్తగా రుణాలు ఇవ్వడం లేదని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు.
మా నాన్న ముసలిగారి నర్సింహారెడ్డి మరణించి పదేండ్లువుతుంది. 2013 జనవరి 15న మరణిస్తే 2017 మార్చి 31న రుణం తీసుకున్నట్లు చూపుతున్నారు. ఈ విషయమై అడుగగా తీసుకున్న వారి పేర్లు చెప్పకుండా అది మీకు వర్తించదని, మీరు కట్టనవసరం లేదని, మేము లెక్క చూపుకోవడానికే అని అంటున్నారు. రుణమాఫీలో పోతుందని చెబుతున్నారు. అసలు దొంగలను పట్టుకొని రుణమాఫీ వస్తే మాకు వర్తించేలా న్యాయం చేయాలి.
– రవీందర్రెడ్డి, రైతు, రెడ్డిపల్లి
మా నాన్న అప్పన్నపల్లి నర్సయ్య రిటైర్డ్ టీచర్ 2015 నవంబర్ 9న మరణిస్తే 2017 జనవరి 15న రుణం తీసుకున్నట్లు రికార్డులు చూపుతన్నారు. మరణించిన మా నాన్న వచ్చి రుణం తీసుకున్నాడా అని సిబ్బందిని అడిగితే విషయం చెప్పకుండా ముందు నీ పేరుమీద ఉన్న బాకీ కట్టమని చెప్పి డబ్బులు కట్టించుకున్నారు. మా నాన్న పేరుమీద రుణం తీసుకున్నవారు ఎవరని, వారి పేరు చెప్పండని కోరగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.
– మహేశ్, రెడ్డిపల్లి