ఆరుగురు బాలికలు నీట మునిగి మృతి చెందిన సంఘటనలు వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో చోటు చేసుకున్నాయి. శ్రీరంగాపూర్ మండలం తాటిపాముల గ్రామ సమీపంలోని చెరువు వద్దకు బట్టలు ఉతికేందుకు వెళ్లిన ముగ్గురు ఆక్కాచెల్లెళ్లు ఈత రాక ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయారు. అలాగే మరికల్ మండలం రాకొండలో పెండ్లి వేడుకకు హాజరైన ఇద్దరు అక్కాచెల్లెళ్లు, వధువు సోదరితో కలిసి గ్రామ సమీపంలోని చెక్డ్యాం వద్దకు స్నానానికి వెళ్లి మృత్యువాత పడ్డారు. దీంతో రెండు గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.
– శ్రీరంగాపూర్/మరికల్, మే 8
శ్రీరంగాపూర్/మరికల్, మే 8 : వేర్వేరు చోట్ల నీట మునిగి ఆరుగురు బాలికలు మృతి చెందిన సంఘటనలు వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో చోటు చేసుకున్నాయి. కుటుంబ సభ్యులు, స్థానికుల కథనం మేరకు.. శ్రీరంగాపూర్ మండలం తాటిపాముల గ్రామానికి చెందిన రైతు కురుమయ్య, భాగ్యమ్మ దంపతులు. వీరికి తిరుపతమ్మ(14) పదో తరగతి), సంధ్య(12, ఆరో తరగతి), దీపిక(10, నాలుగో తరగతి) ముగ్గురు కూతుళ్లతోపాటు కుమారుడు ఉన్నాడు. సోమవారం దంపతులు ఇద్దరు ఉపాధి పనులకు వెళ్లారు. వేసవి సెలవులు కావడంతో ఇంటి వద్దే ఉన్న అక్కాచెల్లెళ్లు గ్రామ సమీపంలోని వీరసముద్రం చెరువు వద్దకు బట్టలు ఉతికేందుకు వెళ్లారు.
చెరువు గట్టుపై తిరుపతమ్మ బట్టలు ఉతుకుతుండగా.. సరదాగా నీటిలోకి దిగిన దీపిక ప్రమాదవశాత్తు నీటిలో మునుగుతుండగా.. గమనించిన సంధ్య కాపాడేందుకు వెళ్లి ప్రమాదంలో పడింది. వెంటనే తేరుకున్న తిరుపతమ్మ చెల్లెళ్లను కాపాడేందుకు నీటిలోకి దిగడంతో ఈత రాక ముగ్గురూ నీట మునిగారు. స్థానికులు గమనించి మృతదేహాలను బయటకు తీశారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతదేహాలకు గ్రామంలోనే పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఎస్సై మల్లేశ్ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు.
మంత్రి తీవ్రదిగ్బ్రాంతి :
శ్రీరంగాపూర్, మే 8 : తాటిపాములలో చెరువులో పడి మృతి చెందిన ఘటన మంత్రి నిరంజన్రెడ్డి తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు. గ్రామ సర్పంచ్ ద్వారా విషయం తెలుసుకున్న ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు.