పెంట్లవెల్లి మండలం జటప్రోలు వద్ద 16వ శతాబ్దంలో సురభిరాజుల కాలంలో నిర్మించిన చెక్డ్యాం (కత్వ) మండుటెండలోనూ మత్తడి దుంకుతున్నది. ఎగువన కొండలు, గుట్టల నుంచి జాలువారుతున్న నీటితోపాటు సింగవట్నం రిజర్వాయర్, శ్రీశైలం బ్యాక్వాటర్ కత్వకు చేరుకుంటున్నాయి. నిరాటంకంగా అలుగు పారుతుండడంతో ప్రజలు అక్కడకు చేరుకొని సంబురంగా గడుపుతున్నారు. ఈత కొడుతూ, సెల్ఫీలు దిగుతూ ఉల్లాసంగా.. ఉత్సాహంగా గడుపుతున్నారు. రైతులు చెక్డ్యాం కింద ఎలాంటి ఢోకా లేకుండా పంటలు సాగు చేస్తున్నారు.
– కొల్లాపూర్, మే 15
కొల్లాపూర్, మే 15 : మండు వేసవిలోనూ ఉమ్మడిజిల్లాలో కొన్ని ప్రాంతాలు పర్యాటకుల మనుస్సును దోచుకుంటు న్నాయి. నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ సమీపంలోనూ పురాతన చెక్డ్యాం ఉన్నట్లు చుట్టుపక్కల వారికి తప్పా బయటి ప్రపంచానికి తెలియదు. వేసవిలో ఈనోటా ఆనోటాపడి వెలుగులోకి వచ్చింది. పెంట్లవెల్లి మండలం జటప్రోలు గ్రామపంచాయతీ శివారులో కృష్ణానది పరీవాహక ప్రాంతంలో రెండు గుట్టల మధ్య వాగుపై సురభిరాజులు 16వ శతాబ్దంలో ’కత్వ’ను సున్నంగచ్చు, నాపరాయితో నిర్మించారు. ఏటా వానకాలంలో శ్రీశైలం బ్యాక్వాటర్తో మునకకు గురై.. ఫిబ్రవరి చివరన ఇది బయపడుతుంది. ఆ ప్రాంతంలో యాసంగిలో రైతులు వరి సాగు చేస్తుంటారు.
ఎగువన ఉన్న కొండలు, గుట్టల నుంచి జాలువారుతున్న నీరంతా ఈ కత్వకు చేరి నిండుకొని నిరాటంకంగా దిగువకు అలుగు పారుతూ చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటున్నది. ఇరువైపులా ఎత్తైన గుట్టలు.. చుట్టూ పచ్చని చెట్లతో పర్యాటకులకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందిస్తున్నది. ఈ కత్వను పంట పొలాల మధ్య బైక్లు, కార్లల్లో వెళ్లి చూడవచ్చు. కొల్లాపూర్, పెంట్లవెల్లి మండలాలతోపాటు ఇతర ప్రాంతాల నుంచి సందర్శకులు ఇక్కడికి చేరుకొని ఈత కొడుతూ, సెల్ఫీలు దిగుతూ సరదాగా గడుపుతుంటారు.
కొంతమంది స్నేహితులతో కలిసొచ్చి పుట్టినరోజు, పెళ్లిరోజు వేడుకల్లో భాగంగా కేకులు కట్ చేసి సంతోషంగా గడుపుతారు. కాననీ ఇక్కడ ఎలాంటి భోజన, వసతి సౌకర్యం ఉండదు కాబట్టి ఏదైనా పర్యాటకులు తమవెంట తీసుకెళ్లాల్సిందే. ఉరుకులు, పరుగుల జీవితంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలకు ఇక్కడి ప్రకృతి అందాలు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. జటప్రోలులో పర్యాటకుల విడిది కోసం తెలంగాణ సర్కార్ హరిత హోటల్ను నిర్మించింది. ఈ ప్రాంతాన్ని పర్యాటకకేంద్రంగా తీర్చిదిద్దాలని ఇటీవల ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డిని కోరగా ఆయన సానుకూలంగా స్పందించినట్లు పెంట్లవెల్లి సర్పంచ్ ఎస్కే ఖాజా తెలిపారు.