మహబూబ్నగర్, డిసెంబర్ 26 : అహర్నిశలు శ్రమిస్తూ దేశానికి అన్నం పెట్టే రైతన్నకు మేలు చేయాలనే తపన కేంద్ర ప్ర భుత్వానికి లేకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వ్యవసాయానికి ఉపాధి హామీ పథకం అనుసంధానం చేయడం వల్ల రైతులకు పంట పొలాల్లో మేలు కలుగుతుందని రైతు సంఘా లు, రైతులు, రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నది. ఈ విషయంలో ఎన్నోమార్లు కేంద్ర ప్రభుత్వానికి వినతిపత్రాలను అందించిన విషయం విదితమే. ఈ తరుణంలో కేంద్రప్రభుత్వం మరోసారి రైతుల పాలిట విషం కక్కింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపాధి హామీని వ్యవసాయానికి అనుసంధానం చేయడం కుదురదని చెప్పడంతో రైతుల ఆశలు ఆవిరైపోయాయి. కేంద్రం నిర్ణయంపై రైతన్నలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అనుసంధానం చేయాలన్న నీతి అయోగ్
వ్యవసాయ పనులకు ఖర్చు పెరిగింది.. దిగుబడి మాత్రం అంతంత మాత్రమే ఉన్నది. ఈ తరుణంలో ఉపాధిహామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని నీతిఆయోగ్ నివేదిక సమర్పించింది. నీతిఆయోగ్ నివేదిక రైతులకు పాలిట వరంలా.. మారినా కేంద్రప్రభుత్వం పరిగణలోకి తీసుకోకపోవడంతో రైతన్నల ఆశలు సన్నగిల్లాయి. ప్రజలకు మంచి చేయాలనే తపన తమకే ఉందంటూ అధికారంలోకి వచ్చిన కేంద్రం నిత్యావసర ధరలు ఇష్టానుసారంగా పెంచుతూ మంచి చేసే సమయం ఉన్నప్పటికీ అటు వైపు చూడటం లేదు. దీంతో రైతులు, రైతు సంఘాల నాయకులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
అనుసంధానం చేస్తే 30శాతం మేలు
వ్యవసాయ పనులకు ఉపాధిహామీ పథకం అనుసంధానం చేస్తే రైతులకు 30శాతం మేలు జరుగుతుందని మేధావులు, రాజకీయ అనుభవజ్ఞులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అవసరమైన సదుపాయాలను అందుబాటులో ఉంచుతూ రైతు వెన్నంటే ఉంటుంది. రైతుబంధు, రైతుబీమాతోపాటు సబ్సిడీ వ్యవసాయ పనిముట్లు తదితర సదుపాయాలను అందుబాటులో ఉంచింది. కూలీల కొరత, నకిలీ విత్తనాలు, తెగుళ్లు, ప్రకృతి వైపరీత్యాలు, పెరిగిన పెట్టుబడులతో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఎన్నో ఉన్నాయి. వీటన్నింటినీ తట్టుకొని సాగు చేస్తున్న రైతులకు కేంద్రప్రభుత్వం మాత్రం సాయం చేయడంలో ససేమిరా అంటుందని పలువురు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా కేంద్రం స్పందించి పునరాలోచన చేయాల్సి అవసరం ఉందని రైతులు అభిప్రాయపడుతున్నారు.
కేంద్రం ఆలోచించాలి
పదిమందికి అన్నం పెట్టే రైతులకు మంచి చేస్తే తప్పు ఏముంటుంది. మంచి చేస్తామని చెప్పి మరిచిపోతే ఏంచేస్తాం. కేంద్ర సర్కారు కాస్తయినా అలోచన చేయాలి. రైతులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కృషిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
– గోవర్ధన్, రైతు, హన్వాడ
రైతులకు మేలు చేయాలి
ప్రజలకు అందిస్తున్న ఫలాల్లో వ్యవసాయానికి ఉపాధి హామీ పథకం వర్తింపజేస్తే తప్పేముంది. ఎలాగైనా రైతులకు మేలు చేయాలనే తపన కేంద్ర ప్రభుత్వానికి లేదు. మాయమాటలు చెప్పి కాలం వెల్లదీస్తుంది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం రైతుల పక్షానా నిలబడాల్సిన అవసరం ఉంది.
– వీరన్న, పెద్దదర్పల్లి, హన్వాడ