జడ్చర్ల పట్టణంలోని ఇంటిగ్రేటెడ్ హాస్టల్లో తొమ్మిదో తరగతి విద్యార్థిని టెన్త్ విద్యార్థి చితకబాదిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాలిలా.. అచ్చంపేట మండలం చెన్నారం గ్రామానికి చెందిన విద్యార్థి జడ్చర్ల ఇంటిగ్రేటెడ్ హాస్టల్లో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు.
9వ తరగతి విద్యార్థిని చితకబాదిన టెన్త్ విద్యార్థి
విచారణ చేపట్టిన అధికారులు
జడ్చర్ల టౌన్, మార్చి 20 : జడ్చర్ల పట్టణంలోని ఇంటిగ్రేటెడ్ హాస్టల్లో తొమ్మిదో తరగతి విద్యార్థిని టెన్త్ విద్యార్థి చితకబాదిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాలిలా.. అచ్చంపేట మండలం చెన్నారం గ్రామానికి చెందిన విద్యార్థి జడ్చర్ల ఇంటిగ్రేటెడ్ హాస్టల్లో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. జడ్చర్ల మండలం కోడుగల్కు చెందిన మరో విద్యార్థి అదే హాస్టల్లో ఉంటూ పదో తరగతి చదువుతున్నాడు. ఈక్రమంలో టెన్త్ విద్యార్థి పెత్తనం చెలాయించేవాడని.. తాను చెప్పినట్లు అందరూ వినాలని, జూనియర్ విద్యార్థులతో పనులు చేయించేవాడని బాధిత విద్యార్థి తల్లిదండ్రులు తెలిపారు. శనివారం రాత్రి నిద్ర లేపి డ్యాన్సు చేయాలని బెదిరించాడని, ఒప్పుకోనందుకు తమ కుమారుడిని కొట్టాడని బాధిత విద్యార్థి తల్లిదండ్రులు తెలిపారు. తమ కుమారుడిపై దాడి చేసిన సదరు విద్యార్థిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం హాస్టల్ ఎదుట బైఠాయించారు.
సదరు విద్యార్థిపై చర్యలు తీసుకోవాలని హాస్టల్ వార్డెన్కు చెబితే నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడని వారు వాపోయారు. ఘటనపై విద్యార్థి తల్లిదండ్రులు కలెక్టర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయడంతో సోషల్ వెల్ఫేర్ ఏఎస్డబ్ల్యూవో అధికారిణి విజయలక్ష్మి, సీఐ రమేశ్బాబు, ఎస్సై లెనిన్ హాస్టల్ వద్దకు చేరుకొని విచారణ చేపట్టారు. బాధిత విద్యార్థితోపాటు తల్లిదండ్రుల సమక్షంలోనే సదరు విద్యార్థి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. హాస్టల్ వార్డెన్ విష్ణు నిర్లక్ష్యంపై జిల్లా అధికారులకు నివేదిక సమర్పించనున్నట్లు ఏఎస్డబ్ల్యూవో విజయలక్ష్మి తెలిపారు. హాస్టల్లో ర్యాగింగ్కు పాల్పడకుండా విద్యార్థులందరికీ కౌన్సెలింగ్ ఇస్తున్నామని ఆమె పేర్కొన్నారు.