నవాబ్పేట, మే 1 : మండలంలోని కొల్లూరు, దేపల్లి, కేశవరావుపల్లి గ్రామాల్లో కురిసిన వడగండ్ల వాన రైతులకు కడగండ్లను మిగిల్చింది. ఆదివారం అర్ధరాత్రి కురిసిన వడగండ్ల ధాటికి వరిచేనుల్లో ధాన్యం నేలపాలైంది. ఉదయం పంట పొలాలకు వెళ్లి చూసిన రైతులు ఒక్కసారిగా నివ్వెరపోయారు. సుమారు 300 ఎకరాల్లో వరిపంటకు నష్టం వాటిల్లినట్లు రైతులు పేర్కొన్నారు. సోమవారం వ్యవసాయశాఖ అధికారులు దెబ్బతిన్న పంటలను పరిశీలించి, పంటనష్టం అంచనాలను తయారు చేశారు. పంటనష్టం నివేదికను త్వరలోనే ప్రభుత్వానికి సమర్పిస్తామని ఏవో కృష్ణకిశోర్ తెలిపారు.
28.4 మి.మీ. వర్షపాతం నమోదు
నాగర్కర్నూల్, మే 1: నాగర్కర్నూల్ జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. దాదాపు రెండున్నర గంటలపాటు కురిసిన వర్షంతో 28.4 మి.మీ వర్షపాతం నమోదైంది. అటవీ ప్రాంతమైన పదర మండలంలో అత్యధికంగా 77.0 మి.మీ, తిమ్మాజిపేటలో అత్యల్పంగా 1.0 మి.మీ. వర్షపాతం నమోదైంది.
పెబ్బేరు మండలంలో..
పెబ్బేరు, మే 1 : పెబ్బేరు మండలంలో భారీ వర్షం కురిసింది. గంటకుపైగా వాన కురవడంతో రోడ్ల మీదుగా, కాల్వ లు పొంగిపొర్లాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. 38.08 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు చెప్పారు. వర్షంతో కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసిపోయింది. అలాగే పంటలు దెబ్బతిన్నాయి.
కేటీదొడ్డి మండలంలో..
కేటీదొడ్డి, మే 1 : మండలంలోని పలు గ్రామాల్లో వర్షం బీభత్సం సృష్టించింది. తీవ్రమైన గాలులతోకూడిన మోస్తరు వర్షం కురువడంతో వరిపంట దెబ్బతింది. వర్షానికి దెబ్బతిన్న పంటలను ఎంపీపీ మనోరమ పరిశీలించి రైతులకు ధైర్యం చెప్పారు. మండలంలో సుమారు 20మి.మీ. వర్షపాతం నమోదు అయినట్లు అధికారులు తెలిపారు. ఇటీవల కురిసిన వర్షాలతో వెంకటాపురం చెరువు నిండింది.
తెగిన కేఎల్ఐ కాల్వ
వెల్దండ, మే 1 : మండలంలోని బండోన్పల్లి చెర్కూర్ రెవెన్యూ శివారులో కేఎల్ఐ డీ-821 కాల్వకు గండి పడింది. ఇటీవల కురిసిన వర్షాలకు కాల్వ ఇన్నర్ ఫ్లాంట్ దెబ్బతింది. దీంతో కాల్వ నీరు సర్వేనెంబర్ 291లోని పొలంలోకి భారీగా చేరడంతో పంట దెబ్బతిన్నదని రైతు శేఖర్రెడ్డి తెలిపారు.
అమరచింత మండలంలో..
అమరచింత, మే 1 : మండలంలోని పలు గ్రామాల్లో గాలివాన బీభత్సం సృష్టించింది. అమరచింత, సింగంపేట గ్రామా ల్లో ఈదురుగాలలుకు చెట్లు వేర్లతోసహా నేలకొరిగాయి. గాలివానకు ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం జరగలేదని తాసిల్దార్ షేక్ చంద్పాషా తెలిపారు.