వనపర్తి, జూన్ 9 : సబ్బండ వర్గాల అభివృద్ధే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తున్నదని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టర్ కార్యాలయ ఆవరణంలో జెడ్పీ చైర్మన్ లోకనాథ్రెడ్డి, కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్తో కలిసి సంక్షేమ దినోత్సవ కా ర్యక్రమానికి హాజరయ్యారు. కల్యాణలక్ష్మి, ఒంటరి మహిళ, ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీల వర్గాలకు చెందిన లబ్ధిదారుల కు చెక్కులను అందజేశారు. అదేవిధంగా ఐదుగురికి గొర్రెల పంపిణీ యూనిట్ పథకం, 10 మందికి రూ.లక్ష చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఎంతో అన్యాయానికి గురైందని తెలిపారు. ఉద్యమ నాయకుడు సీఎం కేసీఆర్ తెలంగాణ పట్టుబట్టి సాధించి అదే స్ఫూర్తితో సబ్బండ వర్గాల అభ్యున్నతికి పాటుపడుతున్నారన్నారు. సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి దేశంలోనే తెలంగాణను నెంబర్వన్ స్థానంలో నిలిపారని కొనియాడారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా సంక్షేమ పథకాలను తెలంగాణలో అమలవుతున్నాయన్నారు. పేదింట్లో ఆడపడుచు పెండ్లి చెయ్యడానికి పడే ఇబ్బందులకు గుర్తించిన సీఎం కేసీఆర్ కుటుంబ పెద్దగా మారి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్తో అండగా నిలుస్తున్నారన్నారు.
అలాగే రైతుబంధు, రైతుబీమా, కులవృత్తులకు ప్రోత్సాహం, కేసీఆర్ కిట్టు, మహిళా సంఘాలకు చేయూత వంటి ఎన్నో సంక్షేమ పథకాలతో ప్రజలంతా సుభిక్షంగా ఉన్నారని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ఉన్నత చదువులు చదువలేక మరుగున పడవద్దనే ఉద్దేశంతో వారికి విదేశి స్కాలర్షిప్, గురుకులాలను ఏర్పాటు చేసి రాష్ట్రవ్యాప్తంగా ఒక విద్యార్థిపై ఏడాదికి రూ.లక్షా 20వేలు ఖర్చు పెడుతూ మెరుగైన విద్య, భోజనం అందిస్తున్నామన్నారు. వనపర్తిలో 600 పడకల దవాఖానను నిర్మించుకొని భవిష్యత్లో పేదలు వైద్యం కోసం హైదరాబాద్ వంటి నగరాలకు వెళ్లకుండా ఇక్కడే వైద్యం అందించనున్నట్లు వెల్లడించారు. ప్రతి రెండు, మూడు గ్రామాల మధ్య ఒక పల్లె దవాఖానను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. స్వరాష్ట్ర పాలనలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను దిశలవారీగా అమలు చేస్తున్నామని తెలిపారు. సామాజిక అసమానతలను రూపుమాపేందుకు సంక్షేమ పథకాలతో చేయూతనందిస్తున్నామని మంత్రి చెప్పారు. పేదల సంక్షేమానికి పథకాలు ప్రభుత్వం అమలు చేస్తున్నదని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి దిశగా ముందుకెళ్తున్నాయని, పథకాల అమలులో మధ్యవర్తుల ప్రమేయం లేకుండా పారదర్శకంగా అందిస్తున్నామని తెలిపారు.