ఏండ్ల తరబడి మగ్గాలపై కూర్చొని నాలుగుపదుల వయస్సులోనే అనారోగ్యం పాలవుతున్న నేతన్నకు సర్కార్ అండగా నిలుస్తున్నది. రోగాలబారిన పడి ప్రాణాలు కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉన్న కుటుంబానికి సీఎం కేసీఆర్ పెద్దదిక్కుగా మారారు. ఆర్థిక చేయూతనివ్వడానికి రైతుబీమా మాదిరి నేతన్న బీమా పథకాన్ని తీసుకొచ్చి బాధిత కుటుంబానికి భరోసానిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో జోగుళాంబ గద్వాల జిల్లాలో 6,948, నారాయణపేటలో 2000మంది చేనేత కార్మికులకు లబ్ధి చేకూరనున్నది.
నారాయణపేట/గద్వాల, ఆగస్టు 2 : చేనేత కార్మికులు నిత్యం మగ్గాలపై కూర్చొని కంటికి కనిపించని పోగులతో పనులుచేస్తూ 40 ఏండ్లకే అనారోగ్య బారిన పడుతున్నారు. జీవన ప్రమాణాలు తగ్గుతున్నాయి. దీనికితోడు అనారోగ్యానికి గురై ప్రాణాలు కోల్పోవడంతో బాధిత కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో జీవనం గడుపుతున్నారు. చేనేత కార్మికులకు ఆర్థిక చేయూతనివ్వాలని సీఎం కేసీఆర్ సంకల్పించారు. అచ్చం రైతుబీమా పథకం మాదిరిగానే చేనేత, పవర్లూమ్స్, అనుబంధ కార్మికులకు నేతన్న బీమా పథకాన్ని అమలు చేయనున్నది. 60 ఏండ్లలోపు అర్హత ఉన్న వారికి ఈ పథకం వర్తిస్తుంది. చేనేత, అనుబంధ కార్మికుడు మరణిస్తే నామినీ ఖాతాలో పది రోజుల్లోగా రూ.5 లక్షల డబ్బు చేరుతుంది. ఇందుకోసం ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. మొత్తం ఇన్సూరెన్స్ డబ్బులను రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. ఇందుకోసం లైఫ్ ఇన్స్రెన్స్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నది. ఈ నెల 7వ తేదీన జాతీయ చేనేత దినోత్సవం రోజున ఈ పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఈ నిర్ణయంతో జోగుళాంబ గద్వాల జిల్లాలో 6,948 మంది, నారాయణపేట జిల్లాలో దాదాపు 2 వేల మందికి లబ్ధి చేకూరనున్నది. అర్హులైన లబ్ధిదారుల జాబితా కోసం అధికారులు కసరత్తులు మొదలు పెట్టారు. కాగా, చేనేత కార్మికులను గత ప్రభుత్వాలు గుర్తించలేదు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుతో చేనేత కార్మికులకు మంచి రోజులు వచ్చాయి. త్రిఫ్ట్ పథకం, చేనేత కార్మికులకు రుణాలు తదితర వాటిని అందించి చేయూతనందిస్తున్నది.
‘చేనేత బీమా’ లక్ష్యం..
ఏ కారణం చేతనైనా చేనేత, అనుబంధ కార్మికులు మరణిస్తే.. బాధిత కుటుంబ సభ్యులకు సామాజిక భద్రత కల్పించడంతోపాటు ఆర్థిక ఉపశమనం కల్పించడమే చేనేతబీమా పథక లక్ష్యం. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అభివృద్ధి చేసిన ఆన్లైన్ పోర్టల్ ద్వారా ఈ పథకం అమలుకానున్నది. క్లెయిమ్ మొత్తాన్ని పరిష్కరించడానికి నామినీ ఏ కార్యాలయాన్ని సంప్రదించవలసిన అవసరం లేదు. మృతుడికి చెందిన నామినీ అధికారులకు వివరాలు సమర్పిస్తే.. వాటిని ఎల్ఐసీకి అధికారులే క్లెయిమ్ చేసి నామినీ ఖాతాలో డబ్బులు జమచేయనున్నారు. చేనేత కార్మికుడు చనిపోయిన పది రోజుల్లోగా వారి కుటుంబానికి రూ.5 లక్షల బీమా సొమ్ము అందజేయనున్నారు. ఈ పథకం పవర్లూమ్స్ కార్మికులకు కూడా వర్తించనున్నది. పూర్తిగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించనున్నారు.
నేతన్న బీమాకు వీరే అర్హులు..
18 నుంచి 59 ఏండ్ల మధ్య వయస్సు ఉన్న చేనేత కార్మికులు ఈ పథకం కింద నమోదు చేసుకోవడానికి అర్హులు. ఆధార్కార్డు, వీవర్స్ సర్టిఫికెట్ (గుర్తింపు కార్డు) కలిగి ఉండాలి. వీటితోపాటు పాస్పోర్టు ఫొటో, మొబైల్ నెంబర్ను జతపరిచి దరఖాస్తు చేసుకుంటే అధికారులు విచారించి పథకానికి ఎంపిక చేస్తారు.
జాబితా తయారు చేస్తున్నాం..
ఈనెల 7వ తేదీన చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రభుత్వం నేతన్న బీమా పథకం అమలు చేయనున్నది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అర్హుల జాబితా రూపొందిస్తున్నాం. ప్రభుత్వ నిర్ణయంతో చేనేత కార్మికుల ముఖాల్లో చిరునవ్వులు పూస్తున్నాయి. ఈ పథకం కింద జిల్లాలో 6,948 మందికి లబ్ధి చేకూరే అవకాశం ఉన్నది.
– గోవిందయ్య, చేనేత జౌళి శాఖ జిల్లా అధికారి, జోగుళాంబ గద్వాల
గతంలో ఎవరూ పట్టించుకోలేదు..
ప్రభుత్వాలు మారాయి. పాలకులు మారారు. కానీ చేనేత కార్మికుల బతుకులు మారలేదు. ఏ ప్రభుత్వాలు తమను పట్టించుకోలేదు. రా ష్ట్ర ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారిం చడంతో మాకు గుర్తింపు వచ్చింది. చేనేత కార్మికులను ప్రభుత్వం అన్ని రకాలుగా ఆ దుకుంటున్నది. ఇప్పుడు ప్ర వేశపెట్టిన నేతన్న బీమా పథకం హర్షణీయం. చేనేత కా ర్మికుల ఇబ్బందులను గుర్తించి వారి కుటుంబాలకు చే యూతనివ్వాలనే ఆలోచనతో రూ.ఐదు లక్షల బీమా కల్పించిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు. చేనేత సం క్షేమానికి కృషి చేస్తున్న మంత్రి కేటీఆర్ను గుండెల్లో పెట్టుకుంటాం. – దర్జి వీరేశ్, చేనేత కార్మికుడు, రాజోళి
స్క్రిప్ట్ అకౌంట్ ఆధారంగానే ఎంపిక..
ఏడు, ఎనిమిది నెలల కిందట స్క్రిప్ట్ అకౌంట్లో చేనేత, అనుబంధ కార్మికులు పేర్లను నమోదు చేసుకున్నారు. దీని ప్రకారం నారాయణపేట జిల్లాలో 2 వేల మంది ఉన్నారు. చేనేత కార్మికులకు స్థానికంగా గుర్తింపు కార్డులు ఇచ్చే అధికారం ఎవరికీ లేదు. స్థానిక గుర్తింపు కార్డుల ద్వారా ఆసరా పింఛన్ తీసుకుంటున్నారు. కానీ వారిని అసలైన చేనేత కార్మికులుగా గుర్తించడానికి వీలులేదు. హ్యాండ్లూం డెవలప్మెంట్ కమిషనర్ న్యూఢిల్లీ ద్వారా జారీ చేసిన కార్డులను వీవర్స్ సర్వీసెస్ సెంటర్, నాంపల్లి వారు మాత్రమే జారీ చేసే వీలు ఉంటుంది. ఆ కార్డుల ఆధారంగానే అసలైన లబ్ధిదారులను ఎంపిక చేస్తాం.
– దాసరి బాబు, అడిషనల్ డైరెక్టర్, హ్యాండ్లూం,
నారాయణపేట జిల్లా బీమా పథకం హర్షణీయం..
రాష్ట్ర ప్రభుత్వం చేనేత రంగ అభవృద్ధికి పెద్దపీట వేసింది. టీఆర్ఎస్ సర్కార్ అధికారంలోకి వచ్చాక దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా చేనేత కార్మికుల కోసం అనేక పథకాలను అమలు చేస్తున్నది. చేనేత కార్మికుల కోసం బీమా పథకం తీసుకురావడం హర్షించదగిన విషయం. చేనేత కార్మికుడు మృతి చెందితే వారి కుటుంబాలు రోడ్డున పడకుండా ఆర్థికంగా ఆదుకునేందుకు సంకల్పించింది. నిత్యం మగ్గంతో కుస్తీ పడుతూ చాలా మంది అనారోగ్యానికి గురవుతున్నారు. ఎవరికి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. మా లాంటి కార్మికులకు బీమాతో ఎంతో మేలు జరుగుతుంది. బీమా సౌకర్యం కల్పించిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు. 60 ఏండ్లు పైబడిన చాలా మంది చేనేత రంగంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. వారికి కూడా ఈ పథకం వర్తింపచేస్తే మేలు కలుగుతుంది.
– కవిత, చేనేత కార్మికురాలు, నారాయణపేట