చేనేతకు తెలంగాణ సర్కారు చేయూత నందిస్తున్నది. కార్మికుల సంక్షేమం కోసం చేనేత మిత్ర పథకాన్ని అమలు చేస్తున్నది. ఇందులో భాగంగా జియో ట్యాగింగ్ ఉన్న మగ్గాలకు రూ.3 వేలు అందిస్తున్నది. నేతన్నకు రూ.2 వేలు, వారికి అనుబంధంగా పనిచేసే ఇద్దరికి రూ.500 చొప్పున చెల్లిస్తున్నది. సెప్టెంబర్ ఒకటో తేదీన సాయం వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేసింది. ఉమ్మడి జిల్లాలో 3,793 జియో ట్యాగింగ్ మగ్గాలు ఉన్నాయి. వారికి ఆర్థికంగా అండగా ఉండడంతో కార్మికుల సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి.
– గద్వాల, సెప్టెంబర్ 20
గద్వాల, సెప్టెంబర్ 20 : చేనేత మిత్ర పథకం ద్వారా చేనేత కార్మికులకు చేయూతనిచ్చింది తెలంగాణ ప్రభుత్వం. కార్మికుల ఖాతాల్లో సబ్సిడీని రూ.2వేల నగదు జమచేయడంతోపాటు అనుబంధ కార్మికులకు ఇద్దరికి రూ.500 చొప్పున ప్రభుత్వం వారి ఖాతాల్లో సెప్టెంబర్ ఒకటి నుంచి జమ చేయడంతో వారు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. గద్వాల చేనేత కార్మికులు నేచిన చీరలు ప్రపంచ ప్రఖ్యాతగాంచినవి. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా చేనేత కార్మికులు ఆదరణకు నోచుకోక కనుమరుగవుతున్న చేనేత వృత్తికి తెలంగాణ ప్రభుత్వం జీవం పోసింది. వృత్తిని వదిలి ఇతర రంగాలవైపు వెళ్లిన కార్మికులు ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ పథకాల వల్ల తిరిగి వారి కుల వృత్తులను కొనసాగిస్తున్నారు. పావలా వడ్డీ పథకం కింద చేనేత సహకార సంఘాలకు రుణాలు ఇవ్వడంతోపాటు రుణపరపతి పథకం కింద చేనేత కార్మికులకు చేయూతనిచ్చింది.
నేతన్నకు చేయూత పథకం, రుణమాఫీ, నేతన్నకు బీమాపథకం వంటివి ప్రవేశపెట్టింది. దీంతోపాటు చేనేత మిత్ర పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టగా, చేనేత కార్మికులకు 40శాతం నూలు రాయితీ ఇచ్చేది. అయితే ప్రతి 45రోజులకు ఒకసారి రాయితీ నిధులు విడుదల చేయాలి. ఆన్లైన్ ప్రక్రియ ఉండడం, జీఎస్టీ బిల్లులు తీసుకురావాల్సి ఉండడంతో ఇది చాలా మంది చేనేత కార్మికులకు ఇబ్బందిగా ఉండేది.
గ్రహించిన ప్రభుత్వం నేరుగా ప్రస్తుతం ఈ పథకం ద్వారా జియోట్యాగింగ్ కలిగిన ప్రతి చేనేత కార్మికుడి ఖాతాల్లో రూ.2వేలు జమచేయడంతోపాటు అనుబంధ కార్మికులకు ఇద్దరికి రూ.500 చొప్పున వారిఖాతాల్లో జమచేయడంతో ఉమ్మడి జిల్లాలో 3,793 జియోట్యాగింగ్ మగ్గాలు కలిగిన చేనేత కార్మికులకు లబ్ధి చేకూరనున్నది. ఆగస్టు 7వ తేదీన చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత జౌళిశాఖ మంత్రి కేటీఆర్ చేనేత మిత్ర పథకాన్ని సవరించి దళారుల ప్రమేయం లేకుండా ప్రతి జియోట్యాగింగ్ కలిగిన చేనేత కార్మికులకు రూ.3వేలు నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తామని చెప్పిన మాట నిలబెట్టుకున్నారు.
ఉమ్మడి పాలమూరు జిల్లా మొత్తం 3,793 జియోట్యాగింగ్ మగ్గాలు ఉన్నాయి. అందులో జోగుళాంబ గద్వాల జిల్లాలో 2,525, వనపర్తి జిల్లాలో 324, నారాయణపేట జిల్లాలో 622, మహబూబ్నగర్లో 311, నాగర్కర్నూల్లో జిల్లాలో 11 మంది చేనేత కార్మికులు జియోట్యాగింగ్ కలిగి ఉన్నారు. ఇందులో 3,793 మంది ప్రధాన కార్మికులు ఉండగా, వారికి అనుబంధంగా 7,088 మంది కార్మికులు ఉన్నారు. వీరందరి ఖాతాల్లో ప్రభుత్వం నగదు జమచేసింది. ఖాతాల్లో నగదు జమకావడంతో చేనేత కార్మికుల హర్షం వ్యక్తం చేస్తున్నారు.