పెబ్బేరు, జూన్ 2 : ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నది. విద్యార్థులకు అన్ని రకాల మౌలిక వసతులు కల్పించడంతోపాటు నాణ్యమైన విద్యాబోధన అందించేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మన ఊరు-మన బడి కార్యక్రమం ద్వారా పాఠశాలల్లో ఇప్పటికే మరమ్మతులు, కొత్త భవనాల నిర్మాణం, మౌ లిక సదుపాయాలు తదితర అభివృద్ధి పనులపై దృష్టి సారించింది. అంతేకాకుండా విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరే లా ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. బడిబాట కార్య క్రమం ద్వారా విద్యార్థులు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించనున్నారు.
వేసవి సెలవులు ముగింపు దశకు చేరడంతో ప్రభుత్వం పాఠశాలల పునఃప్రారంభంపై దృష్టి సారించింది. విద్యార్థులకు లోటు రాకుండా అన్ని వసతులు కల్పిస్తూ.. ఉత్తమ ఫలితాలు సాధించే దిశగా చర్యలు చేపట్టింది. ప్రైవేటు పాఠశాలల్లో పెద్ద ఎత్తున ఫీజులు వసూలు చేస్తుండడంతో మధ్యతరగతి కుటుంబాలు ఆ భారాన్ని మోయలేక పోతున్నాయి. ప్రభుత్వ బడులపై ఉన్న అపోహను తొలగించి, తామూ కార్పొరేట్కు తీసిపోమని నిరూపించాలన్న పట్టుదలతో బడిబాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. శనివారం నుంచి 17వ తేదీ వరకు అధికారులు ప్రత్యేక కార్యాచరణతో కదలనున్నారు. ఇందుకు విద్యాశాఖ కార్యక్రమాలను ఖరారు చేసింది. విద్యాభోదనలో ప్రైవేటు పా ఠశాలలకు ధీటుగా ప్రభు త్వ పాఠశాలలను తీర్చిదిద్దాలన్న సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే మన ఊరు-మన బడి, మన పట్టణం-మన బడి కార్యక్రమం ద్వారా కృషి చేస్తోంది. ఇందుకు పాఠశాల భవనాల రూపురేఖలు మార్చి, విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి సౌకర్యాలు కల్పిస్తోంది. ఈ నేపథ్యంలో జూన్ 12 నుంచి పాఠశాలల పునఃప్రారంభం ఘనంగా ఉండాలని యోచిస్తోంది. ప్రణాళికాబద్ధ్దంగా ఈ నెల 1న ఉపాధ్యాయుల సన్నాహక సమావేశం నిర్వహించింది. 3వ తేదీ నుంచి 17 వరకు వివిధ కార్యక్రమాల ద్వారా ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థులను ఆకర్శింపజేసి, వారు చేరేలా చర్యలు చేపట్టింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 893 ప్రాథమికోన్నత పాఠశాలలు, 1,008 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో సదుపాయాలను, నిష్ణాతులైన ఉపాధ్యాయులతో విద్యాభోదన, మధ్యాహ్న భోజనం, ఉచిత పాఠ్యపుస్తకాలు, ఏకరూప దుస్తులు అందించడం వంటి విషయాల గురించి ప్రచారం చేయాలి. విస్తృత ప్రచారానికి కరపత్రాలను సైతం సిద్ధం చేశారు. మొత్తానికి ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాల సంఖ్యను పెంచాలన్న లక్ష్యంతో అందరూ కృషి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.