మహబూబ్నగర్, డిసెంబర్ 17 : అంగన్వాడీ టీచర్లు, ఆయాలు తలెత్తుకునేలా వేతనాలు పెంచుతామని ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం.. దానిని ఆచరణలో చూపించింది. వారికి కూడా పీఆర్సీని వర్తింపజేసింది. దీంతో రాష్ట్ర ఏర్పాటు తరువాత వారికి ఊహించని విధంగా జీతాలు పెరిగాయి. టీఆర్ఎస్ సర్కార్ అధికారంలోకి వచ్చాక అంగన్వాడీ కార్యకర్త నుంచి టీచర్గా పేరు మార్చిన విషయం విదితమే. దీంతో వారికి సరైన గుర్తింపుతోపాటు గౌరవాన్ని కల్పించింది. ఉమ్మడి రాష్ట్రంలో అంగన్వాడీ టీచర్లు, ఆయాల ఆర్థిక పరిస్థితులు ఇబ్బందికరంగా టీచర్లకు రూ.4500, ఆయాలకు రూ.2 వేల వేతనం అందించేవారు. మూడు, నాలుగు నెలలకోసారి నెల జీతం అందించే రోజులుండేవి. కానీ, నేడు ప్రతి నెలా వేతనాలు అందుకుంటూ హాయిగా గడుపుతున్నారు. టీఆర్ఎస్ సర్కార్ ఏర్పాటైన ఏడేండ్లలో అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు మూడుసార్లు జీతాలు పెంచి చిత్తశుద్ధిని చాటుకున్నది. మొదటిసారి అంగన్వాడీ టీచర్లకు రూ.4,500 నుంచి రూ.7,500, ఆయాలకు రూ.2 వేల నుంచి రూ.4,500లకు పెంచింది. రెండో సారి టీచర్లకు రూ.7,500 నుంచి రూ.10,500, ఆయాలకు రూ.4,500 నుంచి రూ.6 వేలకు పెంచింది. తాజాగా పీఆర్సీ వర్తింపజేయడంతో టీచర్లకు రూ.13,650, ఆయాలకు రూ.7,800 వేతనాలు అందుతున్నాయి. ఖాతాల్లో పెరిగిన జీతం డబ్బులు జమకావడంతో అంగన్వాడీ టీచర్లు, ఆయాలు హర్షం వ్యక్తం చేస్తూ సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్నారు.
రుణపడి ఉంటాం..
టీఆర్ఎస్ సర్కార్ అన్ని వర్గాల ఉద్యోగులకు సముచిత స్థానం కల్పిస్తున్నది. అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు సరైన గుర్తింపు ఇవ్వడంతోపాటు వేతనాలను పెంచారు. సీఎం కేసీఆర్, మంత్రి శ్రీనివాస్గౌడ్లకు ప్రత్యేక ధన్యవాదాలు.