దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం మరింత ‘ఆసరా’ కల్పించనున్నది. పింఛన్ను రూ.వెయ్యి పెంచడంతో ఇప్పటివరకు అందుతున్న రూ.3,016కు బదులు ఇక నుంచి రూ.4,016 అందుకోనున్నారు. అడగకముందే పింఛన్ను పెంచడంతో వారి మోములో ఆనందం వెల్లివిరుస్తున్నది. తమను మరింత అక్కున చేర్చుకొని ఆర్థిక భరోసా కల్పిస్తున్న ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్ అని, బీఆర్ఎస్ సర్కారుకు జీవితాంతం రుణపడి ఉంటామని ముక్తకంఠంతో చెబుతున్నారు. పెరిగిన పింఛన్తో మహబూబ్నగర్ జిల్లాలో 13,777 మందికి లబ్ధి పొందుతుండగా.. వారికి ప్రతి నెలా రూ.5.53 కోట్లను సర్కారు చెల్లించనున్నది. కాగా, పింఛన్ ప్రొసీడింగ్ కాపీలను మంత్రులు, ఎమ్మెల్యేలు దివ్యాంగులకు అందజేస్తున్నారు.
– మహబూబ్నగర్, ఆగస్టు 27
మహబూబ్నగర్, ఆగస్టు 27 : దివ్యాంగుల జీవితాల్లో తెలంగాణ ప్రభుత్వం వెలుగులు నింపుతున్నది. వారికి ఇప్పటికే రూ.3,016 పింఛన్ ఇస్తుండగా.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల రూ.4,016కు పెంచిన విషయం తెలిసిందే. నిత్యావసరాల ధరలు పెరగడంతోపాటు వారి ఖర్చుల నేపథ్యంలో పింఛన్ను లబ్ధిదారులు అడగకముందే సీఎం వెయ్యి అదనంగా పెంచారు. దీంతో దివ్యాంగుల మోములో ఆనందం వెల్లివిరుస్తున్నది.
తెలంగాణ సర్కారు ప్రజల సౌకర్యార్థం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఉద్యమంలా ముందు కు తీసుకెళ్తున్నది. ఈక్రమంలో ప్రతి ఇంటికీ ఏదో ఒక రూపంలో లబ్ధి చేకూరుతున్నది. మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా 1,04,698 మందికి పింఛన్లు అందుతున్నాయి. వితంతువులు, బీడీ కార్మికులు, వృద్ధులకు ప్రభుత్వం రూ.2,016 పింఛన్ ఇస్తున్న విషయం తెలిసిందే. దివ్యాంగులకు రూ.3,016 నుంచి రూ.4,016కు పెంచి ఆర్థిక భరోసానిస్తున్నది. జిల్లా వ్యాప్తంగా ఉన్న లబ్ధిదారులకు ప్రభుత్వం ప్రతి నెలా రూ.26.04కోట్లు అందిస్తున్నది.
జిల్లాలోని 13,777మంది దివ్యాంగులు పింఛన్ తీసుకుంటున్నారు. ఇందుకుగానూ రూ.3,016 చొప్పున రూ.4.15 కోట్లు అందజేస్తూ వచ్చింది. ఈ నెల నుంచి రూ.వెయ్యి పెంచడంతో రూ.5.53కోట్లకు పెరిగింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు నిండాయి. దివ్యాంగులకు అవసరమైన సదుపాయాలను అందుబాటులో ఉంచుతూ వారి జీవితాలకు ప్రభుత్వం భరోసా కల్పిస్తున్నది.
దివ్యాంగులు దైవంతో సమానమని ఇటీవల పెంచిన పింఛన్ల ప్రొసీడింగ్స్ అందజేసే కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్న విషయం విధితమే. ప్రతిక్షణం ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారికి ఏ కష్టమొచ్చినా ప్రభుత్వం అండగా నిలిచి భరోసా కల్పిస్తున్నది. జిల్లా కేంద్రంలోని క్రిస్టియన్పల్లిలో వారి కోసం కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి మంత్రి రూ.10లక్షలు మంజూరు చేయగా.. అవసరమైతే మరో రూ.10లక్షలు ఇస్తామని ప్రకటించారు.
కేటీదొడ్డి, ఆగస్టు 27 : దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. ఇటీవల ముఖ్యమంత్రి దివ్యాంగులకు రూ.వెయ్యి పెంచుతామని ప్రకటించడంపై రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రకటనతో కేటీదొడ్డి మండలంలో 495మందికి లబ్ధి చేకూరనున్నది. మండలంలోని లబ్ధిదారులు మఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడడు బండ్ల కృష్ణమోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. గత ప్రభుత్వాలు తమను ఓటుబ్యాంక్గా వాడుకున్నారే తప్పా.. అభివృద్ధిని గాలికొదిలేశారని విమర్శిస్తున్నారు. పక్కన ఉన్న కర్ణాటకలో వికలాంగులకు రూ.వెయ్యిలోపే పింఛన్ ఇస్తున్నదన్నారు.
దివ్యాంగులను ప్రభుత్వం కడుపులో పెట్టుకుని చూసుకుంటోంది. గిఫ్ట్ ఏ స్మైల్తోపాటు అనేక స్కీంల ద్వారా దివ్యాంగులకు త్రిచక్ర స్కూటీలు కూడా అందించాం. వారికి ఎప్పుడు ఏ ఆపద వచ్చినా ప్రభుత్వం నేనున్నాననే భరోసానిస్తున్నది. దివ్యాంగులెవరూ తమ పింఛన్ పెంచాలని అడగకపోయినా సీఎం కేసీఆర్ వారి ఇబ్బందులు గుర్తించి రూ.4,016కు పెంచారు. మున్ముందు మరిన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ముందుకు సాగుతాం. దివ్యాంగుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నాం. నేడు జరుగుతున్న అభివృద్ధిని గతంతో పోల్చి చూడాలి. ఎల్లప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి క్షేమం కోసం కృషి చేస్తున్నాం.
– శ్రీనివాస్గౌడ్, ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి
మా బాధను చూసి ఇంత మొత్తంలో పింఛన్ పెంచిన సీఎం కేసీఆర్ సార్కు జీవితాంతం రుణపడి ఉంటాం. ఇంతకుముందు మమ్మల్ని ఏ సర్కారు పట్టించుకోలేదు. కేసీఆర్ సారు వచ్చిన తర్వాతనే మా బతుకులు మారాయి. పెంచిన పింఛన్ మా కుటుంబ అవసరాలకు ఆసరాగా నిలుస్తున్నది. సీఎం కేసీఆర్, బండ్లకు కృతజ్ఞతలు.
– విష్ణువర్ధన్, దివ్యాంగుడు, వెంకటాపురం, గద్వాల
గిప్పటి దాకా ఎవరన్నా వచ్చి ఏదో సహాయం చేస్తే బాగుంటుందని అనుకునేటోళ్లం. సీఎం కేసీఆర్ మా ఆవేదనను గుర్తించి అప్పుడు రూ.3,016 పింఛన్ ఇచ్చిండు. దీంతో మాకు జర ధైర్యం వచ్చింది. గిప్పుడు రూ.4,016కు పెంచిండు. అందరి మంచి కోరుకునే వ్యక్తి సీఎం కేసీఆర్. ఆయనకు మా ధన్యవాదాలు.
– చాకలి కవిత, గండీడ్ మండలం
గింతకంటే ఇంకేం కావాలి. మాతోపాటు రాష్ర్టానికి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి మాటల్లో చెప్పలేం. మేనిఫెస్టోలో పెట్టిన, పెట్టని పథకాలు ఎన్నో అమలు చేసిండ్రు. గిప్పుడు ఇతర పార్టీలోళ్లు మేము అది చేస్తాం.. ఇది చేస్తాం అటుండ్రు. పార్టీలు కాదు ప్రజలకు మంచి జరుగుతుందా? లేదా? అనేదే ముఖ్యం. నా జీవితంలో ఇంత అభివృద్ధిని ఎప్పుడూ చూడలేదు. మా పింఛన్ పెంచాలని ప్రభుత్వానికి వినతిపత్రం కూడా ఇవ్వలేదు. అడకముందే రూ.4,016కు పింఛన్ పెంచడం చాలా సంతోషంగా ఉంది. మా జీవితాంతం సీఎం కేసీఆర్కు అండగా ఉంటాం. ఈయన మాయమాటలు చెప్పి కాలం వెల్లదీసే వ్యక్తి కాదు.. ప్రజలకు మంచి చేయాలనే గొప్ప మనస్సు ఉన్న వ్యక్తి.
– గిరమోని రాజేందర్, సల్కర్పేట, గండీడ్ మండలం