అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన ఘట్టమైన ప్రచార పర్వానికి ఇంకా నాలుగు రోజులే మిగిలింది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో ప్రచారం ఊపందుకున్నది. ఎక్కడ చూసినా మైకులు హోరెత్తుతున్నాయి. అందరికంటే ముందుగానే బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించడంతోపాటు క్యాంపేయిన్ ప్రారంభించింది. ఇప్పటికే ఐదు జిల్లాల పరిధిలోని 12 నియోజకవర్గాల్లో సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలు గ్రాండ్ సక్సెస్ అయ్యాయి.. గురువారం మక్తల్లో గులాబీ పారీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ రోడ్షోకు జనం బ్రహ్మరథం పట్టారు. నిత్యం గడప గడపకూ అభ్యర్థులు సకుటుంబ సపరివార సమేతంగా ప్రచారంలో పాల్గొంటున్నారు. సీఎం కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమాన్ని వివరిస్తూ మరోసారి అవకాశమిస్తే మరింత ప్రగతి చేస్తామని ఓటర్లను అభ్యర్థిస్తుండగా.. నీరా‘జనం’ పలుకుతున్నారు. బీఆర్ఎస్ మ్యానిఫెస్టోపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నా రు. ‘ఎక్కడ చూసినా గులాబీల జెండలే రామక్క’ అన్న పాట మార్మోగుతున్నది. ప్రచారంలో కారు దూకుడు పెంచితే కాంగ్రెస్, బీజేపీ మాత్రం వెనుకబడ్డాయి. ఆయా పార్టీల అధినేతల పర్యటనలు, సభలు జనం లేక అట్టర్ఫ్లాప్ అయ్యాయి. దీంతో పార్టీ క్యాడర్లో టెన్షన్ మొదలవగా.. ఉమ్మడి జిల్లా పొలిటికల్ హీటెక్కింది.
మహబూబ్నగర్, నవంబర్ 24(నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం తుదిదశకు చేరుకోవడంతో అన్ని పార్టీల అభ్యర్థులు అస్త్రశస్ర్తాలు ఉపయోగిస్తున్నారు. గ్రామాలు, పట్టణాల్లో హోరాహోరీగా ప్రచారం చేస్తున్నారు. ఆయా పార్టీల అభ్యర్థుల ప్రచారంతో పొలిటికల్ హీట్ పెరిగిపోయింది. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి అన్నిపార్టీలు తంటాలు పడుతున్నాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని 12నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు. అన్ని నియోజకవర్గాల్లో పర్యటించారు. 12ప్రజాఆశీర్వాద సభలు కనీవిని ఎరుగని స్థాయిలో విజయవంతం కావడంతో గులాబీ శ్రేణుల్లో జోష్ నెలకొంది. మరోవైపు కాంగ్రెస్, బీజేపీ అధినేతలు హాజరైన పబ్లిక్ మీటింగ్లు తుస్సుమనడంతో ఆ పార్టీ అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది. ఉమ్మడి జిల్లాలోని మెజార్టీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ నువ్వానేనా అనే రీతిలో పోటీపడుతుండగా బీజేపీ నేతలు మాత్రం డిపాజిట్లు దక్కించుకుంటే చాలని భావిస్తున్నారు. మరోవైపు అభ్యర్థులతోపాటు కుటుంబ సభ్యులు ప్రచారంలోకి దిగడంతో రసవత్తరంగా మారింది.
ఉదయం తెల్లవారుజాము నుంచి అభ్యర్థులు గ్రామాల్లోకి వెళ్లి గడపగడపకూ ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు మళ్లీ హ్యాట్రిక్ విజయమందిస్తే చేపట్టే కార్యక్రమాలను వివరిస్తున్నారు. కర్ణాటకలో ఐదు గ్యారెంటీలు విఫలమయ్యాయని తెలంగాణలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు కూడా ప్రజలు నమ్మే స్థితిలో లేరని బీఆర్ఎస్ నాయకులు ఓటర్లకు వివరిస్తున్నారు. ఒకరిపై ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలతో వాతావరణం వేడెక్కింది. మరోవైపు కాంగ్రెస్, బీజేపీలకు రెబల్స్ బెడద తీవ్రతరమైంది. టికెట్ రాని వాళ్లంతా పార్టీకి ఓటెయ్యొద్దని ప్రచారం చేస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్కు రోజురోజుకు పెరుగుతున్న ఆదరణను చూసి కాంగ్రెస్ నేతలు దాడులకు తెగబడుతున్నారు. గ్రామాల్లో పుకార్లను పుట్టించి కాంగ్రెస్ కార్యకర్తలను రెచ్చగొడుతున్నారు. అచ్చంపేట నియోజకవర్గంలో ఏకంగా బీఆర్ఎస్ అభ్యర్థి గువ్వల బాలరాజుపై దాడి చేశారు. కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గి మండలం సర్జఖాన్పేటలో ఏకంగా బీఆర్ఎస్ కార్యకర్తలపై రాళ్లతో దాడి చేశారు. కొల్లాపూర్లో మద్యం సరఫరా చేస్తున్నారని దొంగ ఆరోపణలకు దిగి ఏకంగా పోలీసు వాహనంపై రాళ్ల గాడికి తెగబడ్డారు. పోలీసులను కొట్టి ఉల్టా పోలీస్స్టేషన్ ఎదుట ధర్నాకు దిగడం కొసమెరుపు. ఇంకా ప్రచారానికి నాలుగు రోజులే సమయం ఉండడంతో అభ్యర్థులంతా గ్రామాల్లో తిరుగుతున్నారు.
అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పార్టీలు ప్రచారంతో హోరెత్తెస్తున్నారు. పట్టణాలు గ్రామాల్లో నాయకుల మైకుల గోలతో నిండిపోయింది. అన్నిపార్టీల ప్రచార రథాలు తిరుగుతున్నాయి. జిల్లా కేంద్రాల్లో పాటలు, ఆటలతో ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది మేం బీఆర్ఎస్కే ఓటేస్తాం మా ఇంటికి రావొద్దంటూ బ్యానర్లు కట్టారు. మరోవైపు ఆయా పార్టీలు తమదైన శైలిలో ప్రచారం చేస్త్తున్నారు. గులాబీ పార్టీ అభ్యర్థులపై పాడిన పాటలు జనాలను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. నాగర్కర్నూల్ జిల్లా తాండ్రకు చెందిన లక్ష్మమ్మ పాడిన గులాబీల జెండాలమ్మ రామక్క పాట రాష్ట్రవ్యాప్తంగా మారుమగుతోంది. ఈ పాటకు యూట్యూబ్లో మిలియన్ల కొద్ది వ్యూస్ రావడంతో లక్ష్మమ్మకు క్రేజ్ పెరిగిపోయింది.
తెలంగాణ రాకముందు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వలసలు, ఆకలి కేకలకు ప్రసిద్ధి. తెలంగాణ వచ్చాక పాలమూరు పరిస్థితి పూర్తిగా మారిపోయింది . గతంలో సాగు, తాగునీళ్లు లేక వలసలు పోయిన జనం మళ్లీ స్వగ్రామాలకు తరలివస్తున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పంతో పాలమూరు జిల్లా స్వరూపాన్ని మార్చి వేశారు. ఉమ్మడి జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు పోటీపడి అభివృద్ధి చేసి చూపించారు. 14రోజులకొకసారి వచ్చే తాగునీటి మిషన్ భగీరథతో రోజు అందిస్తుండడంతో ప్రజల కష్టాలు తీర్చేశారు. దీంతో జిల్లాకేంద్రాలు, మున్సిపాలిటీలు, గ్రామాలు పచ్చనీ తోరణాలుగా మారాయి. అభివృద్ధి కార్యక్రమాలు పోటాపోటీగా చేశౠరు. అభివృద్ధి కార్యక్రమాలు ఫోకస్ చేస్తూ బీఆర్ఎస్ ముమ్మరంగా ప్రచారం చేస్తుంది.
కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను జనం ఎవరూ నమ్మడం లేదు. ఎక్కడికెళ్లినా నిలదీస్తున్నారు. పక్కనే కర్ణాటకలో అధికారం గురించి ఆరు నెలలు కాకముందే ఒక్క హామీ కూడా అమలు కాకపోవడంతో అక్కడి రైతులు ప్రజలు తెలంగాణలో స్వచ్ఛందంగా వచ్చి ప్రచారం చేస్తున్నారు. దీంతో కాంగ్రెస్ నేతలు వారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ కర్ణాటక రైతులను కట్టడి చేస్తున్నారు. ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో ఇవ్వని వాళ్లు ఇక్కడ ఏమిస్తారని బీఆర్ఎస్ ప్రశ్నిస్తూ.. ఇదే అంశాన్ని ప్రజల్లోకి తీసుకుపోతుoది.
బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తే చేపట్టే కార్యక్రమాలపై గ్రామాల్లో ఎక్కడ చూసినా చర్చ జరుగుతోంది. కేసీఆర్ చెప్పింది చేసి చూపిస్తాడని జనం అంటున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో రూ.200 ఉన్న ఆసరా పింఛన్లు రూ.వెయ్యికిఆ తర్వాత రూ.2016కు పెంచి కేసీఆర్ ఎంతోమందికి ఆసరాగా నిలిచారని అంటున్నారు. ఈసారి కూడా పింఛన్లు రూ.3వేలు చేసి క్రమక్రమంగా రూ.5వేలకు తీసుకెళ్తాడని వృద్ధులు, వితంతువులు బలంగా నమ్ముతున్నారు. కల్యాణలక్ష్మి, రైతుబంధు, 24గంటల కరెంట్ రైతు బీమా ఇచ్చిన కేసీఆర్ మళ్లీ అధికారం లో వస్తే సౌభాగ్యలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టి 18ఏండ్లు నిండిన ప్రతి మహిళకు రూ.3వేల ఆర్థిక సాయంపై మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రేషన్కార్డున్న అందరికీ సన్నబియ్యమిస్తుండంటూ అప్పుడే ప్రచారం చేస్తున్నారు. కేసీఆర్ బీమా పథకం కూడా గ్రామాల్లో విస్తృతంగా పాకింది. అగ్రవర్ణాల పేదలకు ఆర్థిక సాయాలు, రెసిడెన్షియల్ స్కూళ్లు ఇతర సదుపాయాలు అందజేస్తుండడంతో జనం బీఆర్ఎస్ మ్యానిఫెస్టోకు జేజేలు పలుకుతున్నారు.