మహబూబ్నగర్ మెట్టుగడ్డ, మే 13 : రైతులకు నష్టం కలిగించే చర్యలను సహించేదిలేదని, నాసిరకం విత్తనాలను విక్రయించే వ్యాపారులపై కఠినంగా వ్యవహరిస్తామని ఎస్పీ ఆర్.వెంకటేశ్వర్లు అన్నారు. నాసిరకం విత్తనాల నిర్మూలనకుగానూ తీసుకోవాల్సిన చర్యలపై శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీసు శా ఖ, వ్యవసాయ శాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. గతేడాది నాసిరకం విత్తనాలను విక్రయించిన 29మందిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.
రైతులకు నాసిరకం విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. నిషేధిత విత్తనాలు, నాసిరకం విత్తనాల నిర్మూలనకు జిల్లా పోలీసు, వ్యవసాయ అధికారులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నాసిరకం విత్తనాలు విక్రయించే దళారుల సమాచారం తెలుసుకునేందుకు ఉమ్మడిగా కృషి చేసి రైతులకు అండగా ఉంటామన్నారు. రైతులు వ్యవసాయాధికారుల సూచనలు, సలహాలు పాటించాలని సూచించారు. ప్యాకింగ్ లేని లూజ్ విత్తనాలను ఎట్టి పరిస్థితుల్లో కొనుగోలు చేయొద్దన్నారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన కంపెనీలు, డీలర్ల వద్దనే విత్తనాలను కొనుగోలు చేయాలని కోరారు. సమావేశంలో అదనపు ఎస్పీ రాములు, జిల్లా వ్యవసాయాధికారి బి.వెంకటేశ్, డీఎస్పీలు మహేశ్గౌడ్, వెంకటరమణారె డ్డి, లక్ష్మణ్, అసిస్టెంట్ డైరెక్టర్లు ఆంజనేయులు, యశ్వంత్రావు, హైమావతి తదితరులు ఉన్నారు.