కొల్లాపూర్, జనవరి 27: సర్కారు బడుల్లో విద్యార్థులను క్రీడలవైపు మళ్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. మరుగునపడిన స్కూల్ గేమ్స్కు పునరుజ్జీవం పోయనున్నది. విద్యాహక్కు చట్టం అమలులో భాగంగా క్రీడాసామగ్రి కొనుగోలు చేసేందుకు నిధులను మంజూరు చేసింది. ఈ నిధులు ఆయా పాఠశాలల మేనేజ్మెంట్ కమిటీ (ఎస్ఎంసీ) బ్యాంకు ఖాతాల్లో జమయ్యాయి. ప్రతి ప్రాథమిక పాఠశాలకు రూ.5వేలు, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు రూ.10వేల చొప్పున ఇస్తున్నది. నాగర్కర్నూల్ జిల్లాలో 695ప్రాథమిక పాఠశాలలకు రూ.3లక్షల 47వేల 500లు, 133 ఉన్నత పాఠశాలలకు రూ.కోటీ 33లక్షలు విడుదల చేసింది. దీంతో వ్యాయామ ఉపాధ్యాయులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో విద్యాహక్కు చట్టం 2013 అమల్లోకి రావడంతో పాఠశాల్లో క్రీడలు క్రమేణా తగ్గిపోయాయి. స్కూల్ గేమ్ ఫెడరేషన్కు నిధులు లేకపోవడంతో ఎలాంటి క్రీడలను నిర్వహించలేని పరిస్థితి. పాఠశాలల్లోనూ అదే పరిస్థితి నెలకొన్నది. మండల, డివిజన్, జిల్లా, రాష్ట్రస్థాయి క్రీడాపోటీల నిర్వాహణ తగ్గిపోయింది. పాఠశాలల్లో వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులు ఉన్నప్పటికీ క్రీడలకు నిధుల లేకపోవడంతో క్రీడలు నిర్వహించడమే తగ్గించారు. దీంతో విద్యార్థుల్లోనూ నిరాసక్తి నెలకొన్నది. దీంతోపాటు రెండేండ్లుగా కరోనా విజృంభించడంతో పాఠశాలలు మూతబడి ఆటలు ఆటకెక్కాయి.
కొనుగోలు చేసే క్రీడా సామగ్రి
అథ్లెటిక్స్కు సంబంధించి ప్లాస్టిక్చెక్కతో తయారుచేసిన క్రికెట్ బ్యాట్లు, వికెట్లు, సాఫ్ట్బాల్, షాట్పుట్, డిస్కస్త్రో, జావెలిన్త్రో, టెన్నిస్బాల్, పుట్బాల్, బాస్కెట్బాల్, రగ్బీసాఫ్ట్, చీన్బ్యాగ్స్, సాకర్కోన్, ప్యారాషూట్, ఉన్నత పాఠశాలలో స్కిప్పింగ్ కోప్స్, త్రోబాల్, ప్రథమ చికిత్స కిట్లు కొనుగోలు చేసేందుకు సర్కారు అవకాశం కల్పించిందని ఆయా పాఠశాలల వ్యాయామ ఉపాధ్యాయులు తెలిపారు.
క్రీడాకారుల్లో నూతనోత్సాహం
ప్రభుత్వం ప్రతి పాఠశాలకూ క్రీడాసామగ్రి కొనుగోలు చేసేందుకు నిధులు మంజూరు చేయడంతో క్రీడాకారుల్లో నూతనోత్సాహం వెల్లివిరుస్త్తుంది. గతంలో పాఠశాలల్లో క్రీడాసామగ్రి లేకపోవడంతో విద్యార్థులు క్రీడల్లో పెద్దగా ఆసక్తిచూపలేదు. పాఠశాలస్థాయి నుంచే క్రీడలను నిర్వహిస్తూ క్రీడాకారులను తయారు చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం శుభపరిణామం.
– రామన్గౌడ్, పీఈటీ, మోడ్రన్ హైస్కూల్, కొల్లాపూర్
క్రీడాకారులకు వరం
ప్రభుత్వ పాఠశాలల్లో క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రతి ప్రాథమిక పాఠశాలకు రూ.5వేలు, ఉన్నత పాఠశాలకు రూ.10వేల చొప్పున నిధులు విడుదల చేయడం క్రీడాకారులకు వరం. పాఠశాలల్లో చాలీచాలని క్రీడాసామగ్రితో క్రీడల్లో తర్పీదు పొందుతూ వచ్చారు. నిధులు మంజూరు చేయడంతో స్కూల్ గేమ్స్కు సర్కార్ పునర్జీవం పోసినట్లయింది.
– రంగినేని శ్రీధర్, పీఈటీ, జెడ్పీ బాలుర హైస్కూల్, పెంట్లవెల్లి