మహబూబ్నగర్, మే 24 : మహబూబ్నగర్ నియోజకవర్గంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలు వేగం పుంజుకోవాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. బుధవారం మంత్రి తన క్యాంపు కార్యాలయంలో సంబంధింత అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఇప్పటికీ ప్రారంభం కాని పనులను వెంటనే ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. నియోజకవర్గ అభివృద్ధి నిధులు, ప్రత్యేక అభివృద్ధి నిధులకు సంబంధించి పనుల వారీగా ఆయన అధికారులతో సమీక్షించారు. పనుల ఆలస్యంపై మంత్రి మండలాల వారీగా వివరాలు అడిగి తీసుకున్నారు. పెండింగ్ పనులను సత్వరమే పూర్తి చేయాలని ఆదేశించారు. ఏవైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్గౌడ్, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్కుమార్, ముఖ్య ప్రణాళిక అధికారి దశరథ్, ఎంపీడీవోలు ధనుంజయ, జ్యోతి, డీఈ విష్ణు, ఇంజినీర్లు పాల్గొన్నారు.
జూనియర్ పంచాయతీ కార్యదర్శుల రెగ్యులరైజేషన్ ప్రక్రియ ప్రారంభించాలని అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశించినందుకు గానూ బుధవారం మంత్రి శ్రీనివాస్గౌడ్ను క్యాంపు కార్యాలయంలో జూనియర్ పంచాయతీ కార్యదర్శులు కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రిని శాలువాతో సన్మానించి తమ ఆవేదనను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినందుకు ధన్యవాదాలు తెలిపారు. రెగ్యులరైజేషన్ చేస్తామని చెప్పినందుకు సీఎం కేసీఆర్కు జీవితాంతం రుణపడి ఉంటామని అన్నారు. ప్రజలకు ఇంకా మెరుగైన సేవలు అందించి రాష్ట్ర అభివృద్ధికి తమవంతు పాటుపడతామని తెలిపారు.