వెల్దండ, ఫిబ్రవరి 18 : ‘పురుగుల అన్నం తినలేకపోతున్నాం.. భోజనం నాణ్యత లేకుండా వండుతున్నారు.. అడిగితే టార్గెట్ చేసి బూతులు తిడుతున్నారు. ప్రిన్సిపాల్ను సస్పెండ్ చేయా లి’.. అంటూ విద్యార్థినులు రోడ్డెక్కారు. బుధవారం నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ మండల కేంద్రంలోని ఎస్సీ గురుకుల స్టూడెంట్స్ ఆందోళనకు దిగారు. హైదరాబాద్-శ్రీశైలం హైవేపై బైఠాయించారు. భోజనం నాణ్యతగా.. రుచిగా లేదని.. అన్నంలో పురుగులు వస్తున్నాయని ప్రిన్సిపాల్ను అడిగితే పురుగులు తీసేసి తినాలంటూ నిర్లక్ష్యంగా ఉచిత సలహా ఇస్తున్నాడని, ప్రశ్నించిన వారిని టార్గెట్ చేసి ఇష్టానుసారం దుర్భాషలాడుతున్నాడని ఆరోపించారు. పాఠశాలలో నిర్వహించే వివిధ కార్యక్రమాలకు సైతం అధికంగా డబ్బు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు.
ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని వాపోయారు. ప్రిన్సిపాల్ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల ధర్నాతో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకొన్న సర్పంచ్ యాదమ్మ, తాసీల్దార్ కార్తీక్కుమార్, ఎస్సై కురుమూర్తి, పోలీసులు అక్కడకు చేరుకొని విద్యార్థులకు నచ్చజెప్పే యత్నం చేశారు. అయినా వినకపోవడంతో సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతామని హామీ ఇవ్వడంతో విద్యార్థులు శాంతించి ఆందోళన విరమించారు. అనంతరం పాఠశాలకు చేరుకొన్న విద్యార్థినుల్లో నలుగురికి కండ్లు తిరుగుతున్నాయంటే సిబ్బంది వెంటనే ప్రైవేటు దవాఖానకు తరలించారు. కార్యక్రమంలో వెల్దండ సింగిల్విండో డైరెక్టర్ వెంకటయ్యగౌడ్తోపాటు బీఆర్ఎస్ నాయకులు అశోక్, నిరంజ న్, విద్యార్థినులు పాల్గొన్నారు.