శ్రీశైలం, మార్చి 25 : శ్రీశైల భ్రమరాంబా మల్లికార్జున మహా పుణ్యక్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. పరమ శివుడి దర్శనానికి ఉభ య తెలుగు రాష్ర్టాల నుంచే కాక ఉత్తర దక్షిణా ది యాత్రికులు కూడా అధికసంఖ్యలో క్షేత్రానికి చేరుకున్నారు. సోమవారం తెల్లవారుజామున కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించి కృష్ణమ్మకు పసుపు, కుంకుమ, సారెలతో దీప దానాలు చేశారు. అయితే స్వామిఅమ్మవార్ల దర్శనం కోసం కంపార్టుమెంట్లలో వేచిఉన్న యాత్రికులకు ఉచిత క్యూలైన్ ద్వారా నాలుగు గంటల సమయం పట్టగా శీఘ్ర, అతిశీఘ్ర ప్రత్యేక క్యూల ద్వారా రెండు గంటల సమ యం పట్టింది. అదే విధంగా ఆర్జిత సేవాకర్తలకు నిర్ణీత సమయాల్లో అభిషేకాలు, కుంకుమార్చనలు నిర్వహించినట్లు ఏఈవో హరిదాసు తెలిపారు. సాయంత్రం కళారాధన వేదికపై హైదరాబాద్కు చెందిన అభినయ కూచిపూడి కళాక్షేత్రం బృందంవారిచే సంప్రదాయ గీతాలకు నృత్య ప్రదర్శన ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.