పాలమూరు, జూన్ 20 : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యావ్యవస్థలో అనేక మార్పులు తీసుకొచ్చి ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దినట్లు కీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం జిల్లా కేం ద్రంలోని శిల్పారామంలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన విద్యాదినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో ఎప్పుడు కూలిపడుతాయో తెలియని పాఠశాల భవనాలు, తాగడానికి మంచినీరు వంటి కనీస వసతులు లేక విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. ప్రస్తుతం సీఎం కేసీఆర్ మన ఊరు మనబడి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను అన్ని రకాలుగా అభివృద్ధి చేశారని తెలిపారు. కొత్త పాఠశాల భవనాలు, అవసరమైన చోట అదనపు తరగతి గదులు, మౌలిక వసతులు, మధ్యాహ్న భోజనం ఇలా అన్ని రకాల సదుపాయాలతో ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు రూపుదిద్దుకున్నాయన్నారు.
దేశంలో అధిక వేతనాలు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనన్నారు. మోడల్స్కూల్, గురుకులాలు, నూతన జూనియర్, డిగ్రీ కళాశాలలు, మైనార్టీ పాఠశాలలు ఏర్పా టు చేసుకొని అన్ని వర్గాల విద్యార్థులకు అండగా నిలిచినట్లు తెలిపారు. పాలమూరులో వివిధ కంపెనీల ద్వారా రానున్న రెండేళ్లలో 20వేల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. మెడికల్, నర్సింగ్, ఫార్మా కళాశాలలు తీసుకొచ్చామని, దీంతో ఎంతో మంది విద్యార్థులకు మేలు చేకూరిందన్నారు.
జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణాసుధాకర్రెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ తక్కు వ సమయంలో విద్యారంగాన్ని ఎంతో అభివృద్ధి చేశారని కొనియాడారు. కార్యక్రమంలో కలెక్టర్ రవినాయక్, అదనపు కలెక్టర్ సీతారామారావు, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్గౌడ్, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, ముడా చైర్మన్ వెంకన్న, డీఈఓ రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
డ్రోన్ వర్క్షాప్ సందర్శన..
జిల్లా కేంద్రం సమీపంలోని ధర్మాపూర్ జయప్రకాశ్ నారాయణ ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ హాజరయ్యారు. విద్యార్థులు ఏర్పాటు చేసిన డ్రోన్ వర్క్షాప్ను సందర్శించారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో 500 డ్రోన్లతో లేజర్ టెక్నాలజీతో అద్భుత ప్రదర్శనను పాలమూరుతో పాటు 10జిల్లాలలో నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తామన్నారు.
విద్యార్థులు ఉన్నత చదువులు చదివి జిల్లాకు, కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో కళాశాల చైర్మన్ రవికుమార్, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్గౌడ్, గొర్రెల కాపరుల సంఘం అధ్యక్షుడు శాంతన్న యాదవ్, ఎంపీపీ సుధాశ్రీ, వైస్ ఎంపీపీ అనిత, సుజీవన్, వెంకట్రావు, రాజేశ్వర్ తదితరులు పాల్గ్గొన్నారు.