వనపర్తి, అక్టోబర్ 3 : పదేండ్ల ప్రస్థానంలో నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలుపాలన్న లక్ష్యంతో సింగిరెడ్డి నిరంజన్రెడ్డి నిరంతరం కృషి చేస్తున్నారు. 2014లో స్వల్ప మెజార్టీతో ఓడినా సీఎం కేసీఆర్ ఆశీస్సులతో ఎడారిగా ఉన్న వనపర్తి జిల్లాను సాగునీటితో సస్యశ్యామలం చేసి తన పేరును నీళ్ల నిరంజన్రెడ్డిగా ప్రజలచేత సాకారం చేసుకున్న జననేత నిరంజన్రెడ్డి.
విద్యాహబ్..
వనపర్తికి మొదటి నుంచి విద్యాపర్తిగా పేరుంది. దానికి కొనసాగింపుగా మంత్రి నిరంజన్రెడ్డి జిల్లా ఏర్పాటుతో రూ.550కోట్లతో 50 ఎకరాల్లో మెడికల్ కళాశాల, రూ.40కోట్లతో 45 ఎకరాల్లో ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల జిల్లా పరిధిలోని పెబ్బేరులో ఉమ్మడి రాష్ట్రంలోనే సీఎం కేసీఆర్ చొరవతో రాష్ట్రంలోనే మొట్ట మొదటి మత్స్య కళాశాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీని కోసం కృష్ణానదీ పరివాహక ప్రాంతంలో 65 ఎకరాల్లో రూ.65కోట్లతో కళాశాల నిర్మాణం చేపట్టారు. అలాగే బీసీ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలతోపాటు మరిన్ని ఉన్నత కళాశాలలను జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది.
చెరువులకు పునర్జీవం..
పట్టణ కేంద్రంలోని తాళ్ల చెరువు, నల్ల చెరువు, రాజనగరం అమ్మ చెరువు, లక్ష్మీకుంట చెరువులు కబ్జాకోరల్లో చిక్కుకోగా, వాటికి పునర్జీవాన్ని పోశారు. 440 ఎకరాల ఆయకట్టు సాగయ్యే ఈ చెరువులు ఇవాళ మినీ ట్యాంక్బండ్లుగా మార్చారు. కట్ట పొడవునా ఎల్ఈడీ లైట్లు, సేద తీరేందుకు బెంచీలు, ఇతర సౌకర్యాలతో నగర వాసులకు ఆహ్లాదాన్ని అందించారు. పదేండ్ల ప్రయాణంలో అనేక సంక్షేమ పథకాలతో నియోజకవర్గాన్ని రాష్ట్ర స్థాయిలో ప్రథమంగా నిలిపేందుకు రూ.10కోట్లతో టీహబ్, రూ.450కోట్లతో పెద్దమందడి మండలంలో వనపర్తి పట్టణ ప్రజలకు సాగునీటి ఎద్దడితీర్చేందుకు మిషన్ భగీరథ సంప్ ఏర్పాటుకు భగీరథ ప్రయత్నం చేసిన ఘనత నీళ్ల నిరంజన్రెడ్డికే దక్కుతుంది.
నిండుకుండలా రిజర్వాయర్లు..
నియోజకవర్గంలోని ఏదుల, ఘణపూర్, గోపాల్పేటలలో ప్రతిష్టాత్మకంగా రిజర్వాయర్లను ఏర్పాటు చేసి నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేశారు. మొదటగా ఏదుల వీరాంజనేయ రిజర్వాయర్ను 145 మెగావాట్ల సామర్థ్యంతో రోజుకు 2 టీఎంసీల కృష్ణానీళ్లను ఎత్తిపోయనున్న పది పంపులతో శ్రీకారం చుట్టారు. కేవలం ఏడాదిన్నరలో రూ.700కోట్లతో ఈ రిజర్వాయర్ను నిర్మించారు. పెద్దమందడి, ఘణపూర్, వనపర్తి మండలాల్లోని కల్వకుర్తి లిఫ్టు ఇరిగేషన్కు సంబంధించి 40వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ చేశారు. ఆసియాలోనే అతిపెద్ద మోటర్లు, సర్జ్పూల్ ఇక్కడే ఉన్నాయి.
ఈ రిజర్వాయర్ నిల్వ సామర్థ్యం 6.5 టీఎంసీలుగా నిలిచింది. అలాగే 800 ఏండ్ల కింద కాకతీయ కాలంలో నిర్మించిన గణపసముద్రాన్ని రూ.55కోట్లతో రిజర్వాయర్గా సీఎం కేసీఆర్ ఆశీస్సులతో తీర్చిదిద్దబోతున్నారు. అదేవిధంగా మరో రిజర్వాయర్కు రూ.42.2కోట్లతో బుద్దారం చెరువును బ్రాంచి కెనాల్ ద్వారా కృష్ణాజలాలతో నింపి మత్తడి దూకించారు. రూ.77కోట్లతో కర్నెతాండ లిఫ్టు పనులను ప్రారంభించారు. 43.25 క్యూసెక్కుల వినియోగమే లక్ష్యంగా 4,325 ఎకరాలకు నీళ్లందించేలా మెట్ట ప్రాంతాలైన లట్టుపల్లి, షాపూర్, జంగమాయపల్లి, కెనాల్స్ ద్వారా ఐదు గ్రామాలు, 16తండాలు, సుమారు 20చెరువుల్లోకి నీళ్లు చేరేలా లిఫ్టును చేపట్టారు. జిల్లాలో 12 చెక్డ్యాంల నిర్మాణంతో భూగర్భజలాలు పెరిగాయి. వనపర్తి నియోజకవర్గంలో రికార్డు స్థాయిలో 64 మినీ లిఫ్టులు ఏర్పాటు చేశారు.
రోడ్ల విస్తరణకు మోక్షం..
ఎన్నోయేండ్లుగా వనపర్తి ప్రజల చిరకాల కోరికగా మిగిలిన రోడ్ల విస్తరణను మంత్రి నిరంజన్రెడ్డి చొరవతో రూ.49.50కోట్లతో శరవేగంగా పనులను చేపడుతున్నారు. అలాగే వనపర్తి పెబ్బేరు రోడ్లను మర్రికుంట వద్ద ఏర్పాటు చేసే బైపాస్రోడ్డుతో వనపర్తి జిల్లా కేంద్రం రూపురేఖలే మారనున్నాయి.
ప్రజలకు చేరువైన వైద్యం..
జిల్లాల ఏర్పాటుతో వైద్య ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ నర్సింగాయపల్లి శివారులో రూ.17కోట్లతో 100పడకల మాతాశిశు ఆరోగ్య కేంద్రం నిర్మాణం, 100 పడకల దవాఖానను 300పడకలుగా అప్గ్రేడ్ చేయడం, మెడికల్ కళాశాల సమీపంలో 600 పడకల దవాఖాన నిర్మాణం కూడా చేపడుతున్నారు. వనపర్తి ఏరియా దవాఖానను రూ.5.75కోట్లతో ఆధునీకరించారు. రూ.16కోట్లతో క్రిటికల్ కేర్ సెంటర్ను ఏర్పాటు చేశారు. 10 డయాలసీస్ బెడ్లు, చిన్నపిల్లల కోసం పది ప్రత్యేక బెడ్లు, పిల్లల కోసం 20 బెడ్లు, 30 ఐసీయూ బెడ్లను ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. స్థానికంగా డ్రగ్స్టోర్, డయాగ్నొస్టిక్ హబ్ అందుబాటులోకి తెచ్చారు. జిల్లాలోని కంటి వెలుగు కార్యక్రమం ద్వారా ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించి ఉచితంగా కంటి అద్దాలు అందించారు.
మారిన మార్కెట్ రూపురేఖలు..
జిల్లాలో అధునాతనమైన నూతన వ్యవసాయ మార్కెట్యార్డును రూ.44కోట్లతో 43 ఎకరాల్లో నిర్మాణం చేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ ఉత్పత్తులను విక్రయించేలా ఏర్పాటు చేశారు. అదేవిధంగా రైతులు పండించిన ధాన్యం నిల్వ కేంద్రం ఏర్పాటు వేర్ హౌసింగ్ గోదాంలు చిట్యాల, ఘనపురం, శ్రీరంగాపురం, రేవల్లి, పెబ్బేరు, పెద్దమందడి మండలాల్లో రూ.58.40కోట్లతో 58.700టన్నుల సామర్థ్యం గల గోదాంలు నిర్మించారు.
మార్కెట్కు వచ్చే ప్రజలకు కార్పొరేట్ స్థాయిలో అన్ని రకాల సౌకర్యాలు కల్పించేలా వేసైడ్ మార్కెట్ను రూ.3.40కోట్లతో 51వేల చదరపు అడుగుల విస్తీర్ణంతో నిర్మించారు. ఒకేసారి 20వేల మంది రైతులు 30గ్రామాల ప్రజలు దీనిద్వారా లబ్ధి పొందనున్నారు. ఈ మార్కెట్లో వ్యవసాయ ఉత్పత్తులను రైతులు విక్రయించుకునేందుకు 78 ప్లాట్ఫాంలు, షెడ్లను ఏర్పాటు చేశారు. అలాగే వీధి వ్యాపారస్తుల కోసం పట్టణంలోని నడిబొడ్డులో సమీకృత మార్కెట్ భవనాన్ని ఏర్పాటు చేశారు.
నియోజకవర్గంజిల్లాగా ఏర్పాటు..
రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనను మరింత చేరువ చేయాలనే సంకల్పంతో జిల్లా ఏర్పాటులో వనపర్తిని కూడా జిల్లాగా చేసేందుకు మంత్రి నిరంజన్రెడ్డి భగీరథ ప్రయత్నం చేశారు. అందులో భాగంగా జిల్లా కేంద్రంలో 25 ఎకరాల్లో రూ.62కోట్లతో 34 ప్రధాన ప్రభుత్వ విభాగాల భవనాలను ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఎస్పీ కార్యాలయం భవనాన్ని 29 ఎకరాల్లో రూ.38.50కోట్లతో రాజభవనం రీతిలో నిర్మించారు.
డబుల్ బెడ్రూంలు..
పేదలు ఆత్మగౌరవంతో జీవించాలనే తపనతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన డబల్బెడ్రూం గృహనిర్మాణ పథకం కింద నియోజకవర్గంలోని 7మండలాల్లో మొదటిదశలో రూ.145.82కోట్లతో 2,825 డబల్బెడ్రూం ఇండ్ల నిర్మాణం చేపట్టారు. రెండో దశలో మరో 3వేల డబల్బెడ్రూం ఇండ్లు మంజూరై నిర్మాణం చేస్తున్నారు.