ఉమ్మడి జిల్లాపై చలి పంజా విసురుతున్నది. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పడిపోతుండడంతో ప్రజలు గజగజ వణుకుతున్నారు. రెండ్రోజులుగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. చల్లగాలుల తీవ్రత పెరిగింది. కనిష్ఠంగా15 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాత్రి 7 అయ్యిందంటే చాలు బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ఉదయం 9 గంటలైనా సూర్యుడు కనిపించడం లేదు. తెల్లవారుజామున మంచు కురుస్తున్నది. చిన్నారులు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
నాగర్కర్నూల్, నవంబర్ 17: ఉమ్మడి పాలమూరు జిల్లాలో చలి తీవ్రత ముదురుతున్నది. రోజురోజుకూ ఊష్ణోగ్రతలో మార్పుచోటు చేసుకుంటూ కనిష్ఠ స్థాయికి పడిపోతున్నాయి. రాత్రి, పగలు తేడాలేకుండా చలిగాలులు వీస్తుండడంతో ప్రజలు బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ చలితీవ్రత మరింత పెరిగింది. రెండు రోజులుగా కనిష్ఠ స్థాయికి చేరుకొని విజృంభిస్తున్నది. ఉదయం, సాయంత్రం వేళల్లో చలిగాలుల ఉధృతి పెరగడంతో పట్టణాలతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ముఖ్యంగా సీజనల్ వ్యాధులతోపాటు శ్వాసకోశ సమస్యలు తలెత్తే అవకాశాలు ఉండడంతో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ, పట్టణ ప్రధాన రహదారులు పొగమంచుతో కమ్ముకుపోవడంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎదురుగా వస్తున్న వాహనదారులు లైట్లు వేసుకొని వస్తేగానీ గుర్తించలేని పరిస్థితి నెలకొన్నది.
సాయంత్రం 4నుంచి ఉదయం 8గంటల వరకు చలిగాలులు వీస్తున్నాయి. దీంతో రోజురోజుకూ రాత్రి, పగటి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. సాయంత్రానికే వ్యాపారులు తమ దుకాణాలను మూసి ఇంటిబాట పడుతున్నారు. పొలం పనులకు వెళ్లే రైతన్న పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. పంట కాపలాకు వెళ్లాలంటేనే చలికి వణికిపోతున్నారు. రాబోయే మూడురోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా చలితీవ్రత పెరుగుతుందన్న వాతావరణ శాఖాధికారుల హెచ్చరికలతో ప్రజల్లో మరింత వణుకు పుడుతున్నది. ప్రస్తుతం 14నుంచి 15 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదవుతున్నాయి. 10డిగ్రీ సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. చలి తీవ్రతకు జాగ్రత్తలు తీసుకుంటే తప్పా మన శరీరాన్ని కాపాడుకోలేమని వైద్యులు పేర్కొంటున్నారు. ఇప్పటికే గాలుల కారణంగా రక్షణకోసం స్వెటర్లు, మంకీ క్యాప్లు, మఫ్లర్లు, గ్లౌజుల వినియోగం పెరిగింది. బైక్పై ప్రయాణం చేసే వారికి స్వెట్టర్లు, గ్లౌజులు, హెల్మెంట్తోపాటు మంగి క్యాప్లు తప్పనిసరి కావడంతో కొనుగోలుకు వెనకాడడం లేదు.