ప్రభుత్వ నిబంధనలు పాటించాలి : టాస్క్ఫోర్స్ అధికారి తిరుపతినాయక్
ఫర్టిలైజర్ దుకాణాలు తనిఖీ
జడ్చర్ల, మే 16 : రైతులకు నాసిరకం విత్తనాలు, ఎరువులను విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని టాస్క్ఫోర్స్ అధికారి, వ్యవసాయశాఖ ఏడీఏ తిరుపతినాయక్ హెచ్చరించారు. జడ్చర్ల పట్టణంలోని విత్తనాలు, ఎరువులు, పెస్టిసైడ్స్ దుకాణాలను సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. జాను ట్రేడర్స్, రవీంద్ర ట్రేడర్స్లో విత్తన ప్యాకెట్లను పరిశీలించారు. అలాగే స్టాక్ రిజిస్టర్, లైసెన్స్, కంపెనీల ఇన్వాయిస్ పత్రాలను తనిఖీ చేశారు. హెచ్టీ పరీక్షలు నిర్వహించి విత్తనాల నాణ్యతను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏడీఏ మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల మేరకు అనుమతి ఉన్న విత్తనాలను మాత్రమే రైతులకు విక్రయించాలని సూచించారు. హెచ్టీ పత్తి విత్తనాలకు ప్రభుత్వ అనుమతిలేదని, రైతులు కొనుగోలు చేయొద్దని తెలిపారు. కార్యక్రమంలో టాస్క్ఫోర్స్ బృందం డీఏవో వెంకటేశ్, జడ్చర్ల ఏడీఏ ఆంజనేయులు, సీఐ శంకర్, విత్తన ధృవీకరణ అధికారి లావణ్య, ఏవో గోపీనాథ్ తదితరులు పాల్గొన్నారు.
బాలానగర్ మండలంలో..
మండలకేంద్రంలోని మన గ్రోమో ర్ ఫర్టిలైజర్ దుకాణంలో సోమవారం టాస్క్ఫోర్స్ బృందం తనిఖీలు చేపట్టింది. ఈ సందర్భంగా ఏడీఏ తిరుపతినాయక్ మాట్లాడుతూ రైతులకు నాసిరకం విత్తనాలను విక్రయిస్తే డీలర్ లైసెన్స్ను రద్దు చేస్తామని హెచ్చరించారు. రైతులకు విత్తనాలు విక్రయిస్తే తప్పనిసరిగా రశీదు ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో ఏవో ప్రశాంత్రెడ్డి పాల్గొన్నారు.
రాజాపూర్ మండలంలో..
మండలకేంద్రంలోని ఫర్టిలైజర్ దు కాణాల్లో సోమవారం వ్యవసాయ శాఖ టాస్క్ఫోర్స్ బృం దం తనిఖీలు నిర్వహించింది. ఈ సందర్భంగా దుకాణాల్లో విత్తనాల స్టాక్ తదితర రికార్డులను అధికారులు పరిశీలించా రు. రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులను విక్రయించాలని సూచించారు. కార్యక్రమంలో టాస్క్ఫోర్స్ అధికారి తిరుపతినాయక్, సీఐ శంకర్, ఏవో నరేందర్ పాల్గొన్నారు.
మిడ్జిల్ మండలంలో..
రైతులకు నాసిరకం విత్తనాలు అమ్మితే పీడీయాక్టు కింద కేసులు నమోదు చేస్తామని టాస్క్ఫోర్స్ అధికారి తిరుపతినాయక్ హెచ్చరించారు. వ్యవసాయశాఖ, పోలీస్ అధికారులతో కలిసి సోమవారం మండలకేంద్రంలోని ఫర్టిలైజర్ దుకాణాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డీలర్లు దుకాణాల్లో స్టాక్ బోర్డును ఏర్పాటు చేయాలన్నారు. రైతులు కొనుగోలు చేసిన విత్తనాలు, ఎరువులకు సంబంధించిన రశీదులను తప్పనిసరిగా ఇవ్వాలని ఆదేశించారు. కార్యక్రమంలో సీఐ శంకర్, విత్తన ధృవీకరణాధికారి లావణ్య, ఏవో సిద్ధార్థ తదితరులు పాల్గొన్నారు.