పల్లెలు ఆరోగ్యకరంగా మారాయి. సీజనల్ వ్యాధుల ప్రాబల్యం తగ్గింది. సమైక్య పాలనలో వానకాలం వచ్చిందంటే గ్రామాలు, పట్టణాల్లో డెంగీ, మలేరియా, చికున్గున్యా వంటి వ్యాధులు ప్రజల ప్రాణాలను హరించేవి. స్వరాష్ట్రంలో గ్రామాల రూపురేఖలు మారాయి. ఏటా రెండుసార్లు చేపడుతున్న పల్లెప్రగతితో పారిశుధ్య సమస్య తీరడంతోపాటు ప్రజారోగ్యమూ మెరుగుపడుతున్నది. వర్షాకాలంలో సాధారణంగా వచ్చే మలేరియా, డెంగీలాంటి రోగాలను ప్రజలు దాదాపుగా మర్చిపోయారు. ఇండ్లు, రోడ్ల వెంట ఉన్న పిచ్చిమొక్కలు, ముళ్ల కంప చెట్లను తొలగించడం, మురుగు నిల్వకుండా చర్యలు చేపట్టడం, నీళ్ల ట్యాంకులను తరచూ శుభ్రం చేయడం, ఇంటింటికీ వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టడంతో మూడేండ్లుగా సీజనల్ వ్యాధులు క్రమంగా జీరో సంఖ్యకు చేరు తున్నాయి. ఫలితంగా గ్రామాలు ఆరోగ్య పల్లెలుగా మారాయి.
నాగర్కర్నూల్, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ) : జిల్లాలోని నల్లమల చెంచు పెంటలతోపాటుగా పట్టణాలు, గ్రామాల్లో సీజనల్ వ్యాధులు దూరమయ్యాయి. సీఎం కేసీఆర్ ఆదేశంతో అమలవుతున్న పల్లె ప్రగతితో ఆరోగ్య పల్లెలుగా మారుతున్నాయి. గత మూడేండ్లలో గ్రామాల్లో సీజనల్ వ్యాధులు భారీగా తగ్గుముఖం పట్టడం గమనార్హం. ఇంతకుముందు సీజనల్ వ్యాధులతో భయపడిన ప్రజలు ఇప్పుడు వాటిని మర్చిపోయారు. దీనివల్ల దవాఖానల్లో రూ.వేలల్లో ఖర్చులు సైతం మిగులుతున్నాయి. పల్లె ప్రగతిలో భాగంగా ప్రతి సంవత్సరం ప్రభుత్వం పారిశుధ్య పనులను చేపడుతోంది.
ప్రజాప్రతినిధులు, అధికారులు సైతం పాల్గొంటుండడంతో ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా గ్రామాల్లో మురుగు కాల్వలను శుభ్రం చేస్తున్నారు. ఇండ్ల మధ్య మురుగు గుంతలు లేకుండా మట్టి వేసి చదును చేస్తున్నారు. బ్లీచింగ్ పౌడర్ పిచికారీ చేస్తున్నారు. ఇండ్ల మధ్యన ఉన్న పాత ఇండ్లను కూల్చివేయడంతో పందులు ఊరికి దూరంగా తరలివెళ్లాయి. ఇక ఇండ్లు, రోడ్ల వెంట వెలిసిన పిచ్చి మొక్కలు, కంప చెట్లను సైతం తొలగించారు. నీటి ట్యాం కుల వద్ద మురుగు నిల్వకుండా చర్యలు తీసుకుంటున్నారు.
నీళ్ల ట్యాంకులను తరచూ శుభ్రం చేస్తున్నారు. ఇంటింటికీ వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం చేపడుతున్నారు. అలాగే ఫాగింగ్ చేపడుతున్నారు. దీనివల్ల గ్రామాల్లో పారిశుధ్య సమస్య తీరుతోంది. పంచాయతీలకు ప్రతినెలా నిధులు మంజూరు చేయడంతోపాటు తడి, పొడి చెత్తను ప్రభుత్వం మంజూరు చేసిన ట్రాక్టర్ ద్వారా ప్రతిరోజూ సేకరించి డంపింగ్ యార్డులకు చేరవేస్తున్నారు. ఇలా పల్లెప్రగతితో గ్రామాల్లో అపరిశుభ్రత దూరమవుతోంది. ఫలితంగా ప్రతి వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులు దూరమయ్యాయి. సమైక్య పాలనలో మలేరియా కేసులతో చెంచులు ప్రాణాపాయ స్థితికి చేరడం సాధారణంగా ఉండేది.
తగ్గిన సీజనల్ కేసులు..
ఈ సంవత్సరం ఇప్పటి వరకు నాగర్కర్నూల్ జిల్లాలో కేవలం రెండు డెంగీ కేసులు తప్పా ఎలాంటి సీజనల్ వ్యాధులు రాలేదు. పైలేరియా కేసులు 2018లో 122 నమోదు కాగా, ఆ తర్వాత ఒక్కరికీ ఈ వ్యాధి రాలేదు. గతంలో ఆందోళన కలిగించిన స్వైన్ ఫ్లూ సింగిల్ అంకెకే పరిమితమైంది. విరేచనాలు 2021లో మాత్రమే 12 కేసులు, 2022లో 18 కేసులు, ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు కేవలం 16మాత్రమే వెలుగు చూశాయి. టైఫాయిడ్ కేసులు ఈ నాలుగేండ్లలో ఐదు మాత్రమే నమోదయ్యాయి. అతిసార కేసులు ఆందోళనకరంగా కనిపించినా వ్యాధి తీవ్రత బాగా తక్కువ. మామూలు లక్షణాలతోనే ప్రజలు కోలుకున్నారు.
నల్లమల అటవీ ప్రాంతాల్లోనూ ఈ వ్యాధులు నమోదు కాకపోతుండటం విశేషం. దోమకాటుతో వచ్చే మలేరియా, డెంగీ, చికున్ గున్యా, ఫైలేరియా, జపనీస్ ఎన్సెఫాలిటీస్(జేఈ) వ్యాధిగ్రస్తులు సింగిల్ డిజిట్లకే పరిమితమయ్యారు. అలాగే కరోనా కంటే ముందు ఆందోళన కలిగించిన హెచ్1ఎన్1 వైరస్ సంక్రమిత స్వైన్ ఫ్లూ సైతం దూరమైంది. ఇక కలుషిత నీటి సంక్రమిత అతిసార, విరేచనాలు, టైఫాయిడ్లాంటి వ్యాధులూ భారీగా తగ్గుముఖం పట్టా యి. నీళ్ల ట్యాంకుల వద్ద మురుగు తొలగించడం, నీళ్లల్లో బ్లీచింగ్ చల్లడం, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ శుద్ధ జలం సరఫరా అవుతుండడం దీనికి కారణం. ఇలా పల్లె ప్రగతితో సీజనల్ వ్యాధులు దూరమయ్యాయి. ఈ కారణంగా పాము, కుక్క కాట్లు, పందుల దాడులు అడపాదడపా తప్పా గణనీయంగా తగ్గాయి. ఇలా పల్లె ప్రగతితో గ్రామాల్లో సీజనల్ వ్యాధులు దూరమయ్యాయి.