పల్లెల్లో సంక్రాంతి పండుగ సందడి నెలకొన్నది. కొత్త అల్లుళ్లు, ఆడపడుచుల రాకతో కళకళలాడుతున్నాయి. శుక్రవారం రాత్రి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రజలు భోగి మంటలు వేశారు. శనివారం తెల్లవారుజామునే భోగి స్నానాలు ఆచరించి నోరూరించే రొట్టెల పండుగను నిర్వహించుకోనున్నారు. ఆదివారం సంబురాల సంక్రాంతి, సోమవారం కనుమను జరుపు కొనేందుకు అంతా సిద్ధమయ్యారు. ఇండ్ల లోగిళ్లను రంగుల ముగ్గులు ముంచెత్తనుండగా.. గొబ్బెమ్మలు అలరించనున్నాయి. చిక్కుడుకాయ కూర, నువ్వులతో చేసిన రొట్టెలు కరకరలాడుతూ తింటుంటే ఆ మజానే వేరు.. ఎవరైనా ఆహా అనాల్సిందే.. రొట్టెల తయారీలో మహిళలు నిగమ్నమయ్యారు. గండీడ్లో మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రోటీ మేకర్ యూనిట్లో రోజుకూ 1400 నుంచి 2 వేల వరకు జొన్న, సజ్జ రొట్టెలు తయారు చేస్తున్నారు.
మహబూబ్నగర్, జనవరి 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లావ్యాప్తంగా పల్లెల్లో సంక్రాంతి పండుగ శోభ నెలకొన్నది. శని, ఆది, సోమవారం మూడ్రోజులపాటు పండుగ జరుపుకోనున్నారు. ఈ ఏడాది రైతులకు ఆశించిన దానికంటే ఎక్కువ దిగుబడులు రావడంతో అన్నదాతలు సంతోషంలో మునిగితేలుతున్నారు. ప్రభుత్వం రైతుబంధు కింద పెట్టుబడి సాయం చేయడంతో ఈ సారి పండుగ ధూంధాంగా చేసుకుంటున్నారు. శనివారం తెల్లవారుజామునే వీధుల్లో భోగిమంటలు వేస్తారు. ఇండ్ల ముందు ఆవుపేడతో సామిడి చల్లి ఇండ్లను అందంగా అలంకరిస్తారు. మహిళలు ఇండ్ల ముందు రంగు రంగుల ముగ్గులు వేస్తూ పండుగ శోభను తీసుకొస్తారు. భోగి, మకర సంక్రాంతికి ఇండ్లల్లో సజ్జరొట్టెలు చేయడం ఆనవాయితీ. అంతేకాక ఇప్పటికే వచ్చిన పంటలను రాశులుగా పోసి పూజలు చేస్తారు. సజ్జ రొట్టెలను వారం రోజుల వరకు నిల్వ ఉంచుకుని తింటుంటారు. ఈ సీజన్లో సజ్జరొట్టెలు తినడం వల్ల శరీరం వేడిగా ఉంటుంది. ఆదివారం మకర సంక్రాంతి, సోమవారం కనుమ పండుగ జరుపుకోనున్నారు.
మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండలకేంద్రంలో మహిళా సమాఖ్య ద్వారా భారీ ఎత్తున జొన్న రొట్టెల తయారీ కేంద్రాన్ని నెలకొల్పారు. గండీడ్ మహిళా రైతుల ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్ ద్వారా మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్ స్థాపించారు. ఇక్కడ ప్రతిరోజూ మహిళా సమాఖ్య సభ్యులు 1200 నుంచి రెండు వేల వరకు జొన్న రొట్టెలను తక్కువ ధరకే విక్రయిస్తున్నారు. ఇక్కడ కేవలం నాణ్యమైన జొన్నలనే వాడులున్నారు. సంక్రాంతి పండుగ ఉన్నందున సజ్జ రొట్టెలను కూడా తయారుచేయనున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. ఇక్కడ మాత్రం కేవలం రూ.5కే విక్రయిస్తున్నారు. సైజుకూడా పెద్దదిగా ఉంటుంది. ప్రభుత్వం ద్వారా అందిన రూ.10 లక్షల ఆర్థిక సాయంతో రొట్టెల తయారీ మిషన్, పిండి కలిసే యంత్రం, రొట్టెలు కాల్చడానికి అవసరమైన భారీ పెంచు కూడా ఉన్నది. మిల్లెట్స్ను కూడా పోడుల రూపంలో తయారుచేసి విక్రయిస్తున్నారు.