అయిజ, మార్చి 30 : తుంగభద్ర తీరంలో ఇసుక డంపులు ఉన్నట్లు వెలుగు చూడడంతో అధికారులు అప్రమత్త మయ్యారు. అయిజ మండలంలోని పులికల్ గ్రామ సమీపంలోని తుంగభద్ర నది నుంచి ట్రాక్టర్ల ద్వారా ఇసుకను తరలించి గ్రామ సమీపంలో నిల్వ చేసుకొంటున్నారు. రాత్రి వేళల్లో ఇతర ప్రాంతాలకు టిప్పర్లతో తరలించి సొమ్ము చేసుకొంటున్నారు.
ఇటీవల గట్టు మండలంలో ఇసుక డంపులు గుర్తించిన రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం కేసులు నమోదు చేశారు. ఇసుక డంపుల నిల్వలు, తరలింపుపై కలెక్టర్ రిజ్వాన్ బాషా సీరియస్ కావడంతో జిల్లాలో ఎక్కడెక్కడ ఇసుక డంపులు ఉన్నాయో గుర్తించి రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం దాడులు ముమ్మరం చేశారు.
సోమవారం అయిజ మండలంలోని పులికల్ గ్రామంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ రజినికాంత్రెడ్డి, ఏఎస్సై శ్రీనివాసులు ఇసుక డంపులను గుర్తించి 40ట్రాక్టర్ల ఇసుకను సీజ్ చేశారు. ఇసుక డంపులు ఎవరు చేశారో గుర్తించి కేసులు నమోదు చేసేందుకు చర్యలు తీసుకుంటామని తాసీల్దార్ జ్యోతి, ఎస్సై శ్రీనివాసరావు తెలిపారు.