జడ్చర్ల, నవంబర్ 11 : ఉమ్మడి రాష్ట్రంలో 55ఏండ్లు పాలించిన కాంగ్రెస్ రైతులను పట్టించుకున్న పాపాన పోలేదని, వారి పుణ్యమా అని పాలమూరును కరువుతో ఎడారిగా మార్చారని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మండిపడ్డారు. శనివారం జడ్చర్ల మండలంలోని కోడ్గల్, ఈర్లపల్లి, ఈర్లపల్లితండా, గొల్లపల్లి గ్రామాల్లో ఎమ్మెల్యే ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్తోకలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మహిళలను ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగారు. సీఎం కేసీఆర్ ప్రకటించిన ఎన్నికల మ్యానిఫెస్టోను ప్రజలకు వివరించారు. గొల్లపల్లిలో సర్పంచ్ రాజేశ్వరెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి డప్పులమోతలతో, బ్యాండు మేళాలతో ఘన స్వాగతం పలికారు. మహిళలతో కలిసి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి బతుకమ్మ ఆడారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏండ్లుగా దగాపడ్డ తెలంగాణ నేడు అన్నిరంగాల్లో సీఎం కేసీఆర్ కృషితో అభివృద్ధి సాధిస్తున్నదన్నారు.
అభివృద్ధిని చూసి ఓర్వలేక మళ్లీ రైతులకు అన్యాయం చేసేందుకు కాంగ్రెస్ కుట్ర పన్నుతుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండి ఆలోచించి ఓటు వేయాలని కోరారు. ఆరు గ్యారెంటీల పేరుతో గ్యారెంటీ లేని హామీలు ఇస్తున్నారన్నారు. 55ఏండ్లు పాలించి ఏం ఒకగబెట్టారని, నేడు మళ్లీ ఒక్క ఛాన్స్ అంటూ రావడం సిగ్గుచేటన్నారు. ప్రజలు ఓటుతో తగిన బుద్ధి చెప్పాలని కోరారు. అనంతరం జడ్చర్ల మండలం గొల్లపల్లికి చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు 30మంది సర్పంచ్ రాజేశ్వర్రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్లో చేరారు. అదేవిధంగా కోడ్గల్లో 20మంది, ఈర్లపల్లిలో మాజీ సర్పంచ్ తిరుపతయ్య బీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ యాదయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ గోవర్దన్రెడ్డి, సర్పంచులు రాజేశ్వర్రెడ్డి, మమతానవీన్రెడ్డి, హైమావతివెంకట్రెడ్డి, ప్రభాకర్రెడ్డి, రవీందర్రెడ్డి, సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రణీల్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రఘుపతిరెడ్డి, ముడా డైరెక్టర్ ఇంతియాజ్ఖాన్, ఇర్ఫాన్, రామ్మోహన్, నాగిరెడ్డి, గోపాల్, గిరి, బాబునాయక్ తదితరులు పాల్గొన్నారు.